యాత్ర : శ్రీముఖ లింగ క్షేత్రం

శ్రీ ముఖలింగం లేదా ముఖలింగం శ్రీకాకుళం జిల్లా, జలుమూరు మండలానికి చెందిన గ్రామము.ఇది మండల కేంద్రమైన జలుమూరు నుండి 12 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఆమదాలవలస నుండి 38 కి. మీ. దూరంలోనూ ఉంది.
ఇక్కడ చరిత్ర ప్రసిద్ధినందిన ముఖలింగేశ్వరాస్వామి, భీమేశ్వరాస్వామి, సోమేశ్వరస్వామి ఆలయాలున్నాయి. ఇవి చక్కని శిల్పాలతో కనుల పండుగ చేస్తాయి.

శ్రీ ముఖలింగేశ్వర దేవాలయం :-

శ్రీ ముఖలింగేశ్వరస్వామి దేవాలయము గల ఈ ఊరు ‘పంచపీఠ’ స్థలముగా ప్రసిద్ధం. దీనినే ముఖలింగక్షేత్రమని కూడా పిలుస్తారు.

ఇక్కడ లభించిన ఆధారాలను బట్టి ఈ గ్రామం ఒకప్పుడు రాజధానికి ఉన్నత దశననుభవించిందని తెలుస్తుంది. ఆయా కాలాలలో ఇక్కడ బౌద్ధ, జైన, హిందూ మతాలు వర్ధిల్లాయనికూడా తేలింది. చిత్రం ఏమిటంటే ఇక్కడ దొరికిన ఏశాసనంలోనూ ఈ పూరిపేరు శ్రీ ముఖలింగం అని పేర్కొనలేదు. నగరం, కళింగనగరం, కళింగదేశ నగరం, కళింగవాని నగరం, నగరపువాడ, త్రికళింగనగరం మొదలైన పేర్లతో ఉంది.ఇక్కడ త్రవ్వకాలలో వీణాపాణి అయిన సరస్వతి విగ్రహం, జైనమత ప్రవక్త మహావీరుని విగ్రహం లభించాయి. వీటిని ముఖలింగాలయంలో భద్రపరిచారు. ఇక్కడ అనేక శాసనాలు కూడా దొరికాయి. వాటిని బట్టి ముఖలింగాలయాన్ని క్రీ.శ. 10వ శతాబ్దంలో రెండవ కామార్ణవుడన్న రాజు కట్టించాడని, అతని కుమారుడు అనియంక భీమ వజ్రహస్తుడు భీమేశ్వరాలయాన్ని కట్టించాడని తెలుస్తోంది. వీరిద్దరూ కళింగరాజులు. కామార్ణవుడు తన రాజధానిని దంతనగరం నుండి యిక్కడకు మార్చినట్లు కూడా తెలుస్తోంది.

క్షేత్ర పురాణము :-
ఇక్కడ ముఖలింగాలయాన్ని మధుకేశ్వరాలయం అని కూడా అంటారు. ఇక్కడ లింగం రాతితో చెక్కింది కాదు. ఇప్పచెట్టు మొదలను నరికి వేయగా అదే ముఖలింగంగా ప్రసిద్ధి చెందింది. ఆ చెట్టు మొదలుపై ” ముఖం ” కనిపిస్తుంది అని చెబుతారు. ఆ చెట్టు మొదలే క్రమంగా రాపడి లింగంగా మారిందని చెబుతారు. ఇప్పచెట్టును సంస్కృతంలో ‘మధుకం’ అంటారని అందువల్ల ఈ గుడికి మధుకేశ్వరస్వామి ఆలయంగా పేరొచ్చిందని అంటారు. ఈ ఆలయంలో గర్బాలయంకాక ఎనిమిది వైపుల ఎనిమిది లింగాలున్నాయి. ఇక్కడి అమ్మవారు వరాహిదేవి, సప్త మాతృకలలో ఆమె ఒకరు . మిగిలివారు బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, ఇంద్రాణి. వీరు పార్వతీదేవి అవతారాలు. ఇక్కడి శిల్పాలలో వరాహావతారం, వామనావతారం, సూర్య విగ్రహం వుండటం విశేషం.

భీమేశ్వరాలయం శిథిలావస్థలో ఉంది. ఇక్కడ కుమారస్వామి, దక్షిణామూర్తి నాలుగు ముఖాలతో బ్రహ్మ, గణపతి విగ్రహాలున్నాయి.

సోమేశ్వరాలయానికి గర్భగుడి మాత్రమే ఉంది. ముఖమండపం లేదు. ఎత్తయిన శిఖరంపై బ్రహ్మాండమైన రాతితో కప్పు వేశారు. ఇది ఒకేరాయి. ఒకసారి పిడుగుపడి, ఆరాయి పగిలి అందులో ఒక ముక్క క్రింది పడింది. ఆ ముక్కనే దాదాపు 50 మంది కలిసి కదల్చలేకపోయారంటే, మొత్తం రాయి ఎంత బరువో వూహించుకోవచ్చు. అంతటి రాయిని అంత ఎత్తుకు ఆ రోజుల్లో ఎలా ఎత్తారో, ఎలా అమర్చారో తలచుకుంటే ఆనాటి విశ్వబ్రాహ్మణ శిల్పుల గొప్పతనం, ప్రజ్ఞ అర్థం అవుతాయి. ఇక్కడ ఏడు నాలికల అగ్ని విగ్రహం, వినాయకుడు, కాశీ అన్నపూర్ణ, నటరాజు, కొమారస్వామి, హరిహరదేవుల విగ్రహాలు ఎంత్తో అందంగా ఉన్నాయి. కొన్ని శృంగార శిల్పాల్ని కూడా ఇక్కడ చెక్కారు . ఈ ఆలయం శిథిలావస్థలో ఉంది.

మహా శివరాత్రికి ఇక్కడ గొప్ప ఉత్సవం జరుగుతుంది.

చరిత్ర :-
ఆంధ్రప్రాంతమును ఏలిన తూర్పు గాంగవంశరాజులకు 6 శతాబ్దములకు పైగా రాజధానియై ఈ ప్రాంతము భాసిల్లినది. తూర్పు గాంగరాజులలో ప్రాముఖ్యుడైన అనంతవర్మ చోడగంగదేవుడు ఉత్కళమును జయించి, తన రాజధానిని క్రీ.శ.1135 లో ఒరిస్సా లోని కటక్ నగరమునకు మార్చిన పిదప ముఖలింగపు ప్రాముఖ్యత క్రమముగా తగ్గిపోయింది. ఆనాటి వైభవుమునకు తాత్కారణముగ ముఖలింగంలో మూడు శైవ దేవాలయములున్నవి.ముఖలింగం లోని పాశుపత శైవమత ప్రాబల్యమునకు నిదర్శనముగ అచ్చటి ఆలయములలో లకుశీలుడు విగ్రహములు పెక్కు ఉన్నాయి.

లకుశీలుడు తను మత స్థాపకుడనియు, అతడు శివుని అవతారమనియు పాశుపత శైవమతస్థులు నమ్ముదురు.శైవమత గ్రంథములలో కూడా లకులీశుడు శివుని అవతారమనియు పేర్కొనబడెను.లింగ పురాణములో లకులీశుడు శివునియొక్క 28వ అవతారముగ చెప్పబడెను.కాని లకులీశుడు మానవుడనియు, అతడు గుజరాత్ రాష్త్రములోని కాయారోహణము (కార్వాన్) పట్టణమున క్రీ.శ. 2 వ శతాబ్దములో జనించెననియు మనకు శాసనముల ఆధారముగ తెలియుచున్నది.

లకులీశుడు ఎల్లప్పుడు లకుటమును ధరించుటచే ఆతనికి ఆపేరు వచ్చెను. అతడు పాశుపత శైవమత సిద్ధాంతములకు ఒక రూపము తెచ్చి, ఆ మతప్రచారము చేసెను. లకులీశుని శిష్యులలో ముఖ్యులు కుశినుడు, మిత్రుడు, గార్గుడు, కౌరుస్యుడు అనువారు. లకులీశుని నిరంతర కృషివలన ఆతని శిష్యులును, పాశుపత శైవ మతస్థుల సంఖ్యయు నానాటికి పెరిగెను. మధ్యయుగము నాటికి పాశుపత శైవమతమునకు బహుళ ప్రాచుర్యము లభించి, ఆ మతస్థులలో లకులీశుడు దైవసంభూతుడే అను నమ్మకము గాఢముగ ఏర్పడెను.

మధ్యయుగ కాలములో పాశుపత శైవమతము గుజరాత్, రాజస్థాన్, రాష్త్రములనుండి మధ్య్ర పదేశ్, అస్సాం, బెంగాల్, ఒరిస్సా, ఆంధ్ర, తమిళనాడు, మైసూరు ప్రాంతములకు వ్యాపించి జనాదరణ పొందెను.

ముఖలింగ ప్రాంతమునకు పాశుపత శైవ మతము క్రీ.శ 8 వ శతాబ్దములో ఒరిస్సానుండి వ్యాపించెను.ముఖలింగములోని లకులీశుని విగ్రహములు భువనేశ్వరములోని లకులీశుని బిగ్రహములకు పోలిఉండును.ఇదే ఇక్కడి ముక్య విగ్రహము. గుజరాత్ లోను సోమేశ్వరాలయంలో ఈయని పద్మాసనమున కూర్చొని ఉన్న విగ్రహము ఉంది.ఆతనికి నాలుగు చేతులు ఉన్నాయి.రెండు చేతులు ధర్మచక్ర ప్రవర్తన ముద్రను చూపుచున్నవి. మిగిలిన రెండు చేతులలో అక్షమాల, త్రిశులము ఉన్నాయి.ఆతని ఫాలభాగమున త్రినేత్రము ఉంది.అతడు ఊర్ధ్వ లింగముతో చెక్కబడి ఉన్నాడు.ఆతని రెండు కళ్ళు సగము మూయబడి యోగముద్రలో ఉన్నట్లు ఉంది.అతను ఎల్లప్పుడు ధరించు లకుటము అతని ఎడమ భుజముపై ఆసించబడి, ఎడమ చేతితో చుట్టబడి ఉంది.ఈవిధముగా ముఖలింగములో చెక్కుటవలన శిల్పి ఆతనిని శివుని అవతారముగా భావించానాడని చెప్పవచ్చును.ఈయన విగ్రహమునకు క్రింది భాగమున ఆతని శిష్యులు నల్గురు పద్మపు కాడకు రెండు వైపుల ఆశీనులై ఉన్నారు.ఆగూటి చుట్టును పాశుపత శైవమత గురువులు చిత్రములు చెక్కబడి ఉన్నాయి.

సోమేశ్వరాలయం లకులీశుని విగ్రహము ప్రాముఖ్యత ఏమనగా ఇచట ఈతడు చతుర్భుజుడుగా చెక్కబడియున్నాడు.ఇలా మరియొకచేట కనబడలేదు.

ముఖలింగం లోని దేవాలయములు క్రీ.శ.9 వ శతాబ్దమునుండి 11వ శతాబ్దపు మధ్యకాలములో కట్టబడినవి.వాటిలో చివరిదైన సోమేశ్వరాలయము క్రీ.శ.11 వ శతాబ్దమునాటిది.

(జయంతి చంద్రశేఖర్ రావు Ancient Vizag Patnam నుంచి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *