బేల్దార్ కూలీల డబ్బు కాజేస్తున్న వైసిపి ప్రభుత్వం: సుంకర పద్మశ్రీ

(సుంకర పద్మశ్రీ, ఏపీసీసీ సమన్వయ కమిటీ సభ్యురాలు )
ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అంటారు… కలకాలం ఉండే అందమైన ఇంటిని ఎంతో కష్టపడి నిర్మించే భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో అత్యంత దయనీయంగా ఉంది
ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు… ఏడాది కాలంగా కార్మికుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఆకలి కేకలు భరించలేక… కుటుంబసభ్యుల ఆర్తనాదాలు చూడలేక… ఎంతోమంది అభాగ్యులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అసలే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. ఆదాయం కూడా అంతంత మాత్రమే. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వానికి మిగిలిన ఏకైక ఆదాయ మార్గం భవన నిర్మాణ రంగం.
Pic credits: counterview.net
నెల రోజుల్లో భారతదేశానికి ఏకంగా లక్ష కోట్ల రూపాయలను ఆర్జించగల ఏకైక రంగం రియల్ ఎస్టేట్ మాత్రమే. అలాంటి రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభుత్వం చిన్నచూపు చూసింది.
కేవలం కక్షపూరితoగా వ్యవహరిస్తూ  వైసిపి ప్రభుత్వం భవన నిర్మాణ రంగాన్ని పూర్తిగా కుదేలు చేసింది.
అందమైన ఇల్లు కట్టే భవన నిర్మాణ కార్మికుల ఆకలి కేకలు ప్రస్తుత ముఖ్యమంత్రికి వినపడుతున్నట్లుగా లేవు.వరుస ఏకపక్ష నిర్ణయాలతో కార్మికులను మరింతగా ఊబిలో పడేలా చేస్తున్నారు.
పేదల ప్రభుత్వం అని చెప్పుకునే వైసీపీ సర్కారు ఎక్కువ శాతం బీసీలున్న భవన నిర్మాణ కూలీలను మాత్రం చిన్నచూపు చూస్తోంది.అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుకపై నిషేధం విధించడంతో ఎక్కడి నిర్మాణాలు అక్కడే ఆగిపోయాయి. దాదాపు 3 నెలల పాటు ఎలాంటి ఉపాధి లేక… ఏం చేయాలో దిక్కుతోచని స్థితి కార్మికులది.
ఒక అందమైన ఇంటి నిర్మాణం పూర్తవ్వాలంటే… ఎంతో మంది శ్రమ దాని వెనుక ఉంటుంది.
భవన నిర్మాణ రంగంలో.. ఇసుక కూలీలు, తాపీ, వడ్రంగి. సెంట్రింగ్, రాడ్ బెండింగ్, ఎలక్ట్రికల్ ఇలా మొత్తం 22 రకాల కార్మికులు ఆధారపడి ఉన్నారు.
ప్రస్తుతం ఏపీలో భవన నిర్మాణ కార్మికులు దాదాపు 40 లక్షల మంది ఉన్నారు.
ప్రస్తుతం భవన నిర్మాణ కార్మికులు ప్రతి ఒక్కరూ 50 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజుతో పాటు 5 సంవత్సరాలకు రెన్యువల్ ఫీజుగా 60 రూపాయలను AP Building & Other Construction Workers Welfare Board లో జమ చేస్తున్నారు.
ఇసుక కొరత, వరదలు, రాజధాని మార్పు వంటి పరిస్థితులు నిర్మాణ రంగంపై తీవ్రంగా ప్రభావం చూపించాయి.
మూడు రాజధానుల ప్రకటన రాష్ట్రంలోని రియల్ ఎస్టేట్ రంగంపై బలంగా పడింది.
రాజధాని అమరావతి పరిధిలో నిర్మాణాలు పూర్తిగా నిలిచిపోయాయి. చివరికి పెట్టుబడులు పెట్టేందుకు కూడా వ్యాపారులు ముందుకు రాని పరిస్థితి.
ఈ ప్రభావం కార్మికులపై బలంగా పడింది. ఇప్పుడు లాక్ డౌన్ కూడా నిర్మాణ రంగంపై మూలిగే నక్కపై తాటికాయ పడినట్లుగా మారింది.
లాక్ డౌన్ కారణంగా దాదాపు 45 రోజులుగా ఎలాంటి పనులు లేక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రెక్కాడితే కానీ డొక్కాడని భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం… కనీసం ఆ దిశగా ఆలోచన కూడా చేయటం లేదు. నలుగురితో పాటు నారాయణ అన్నట్లుగా వ్యవహరిస్తోందని మండి పడిన పద్మశ్రీ.
లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ నిధి నుంచి ప్రతి కుటుంబానికి 10 వేల రూపాయలు ఇవ్వాలని ఇప్పటికే కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
ఇదేమీ ప్రభుత్వం జేబులో నుంచో… ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు జేబు నుంచో ఇవ్వటం లేదని… తాము కూడబెట్టుకున్న నిధి నుంచే చెల్లించాలని పద్మశ్రీ డిమాండ్ చేశారు.
ఇసుక కొరత కారణంగా పనుల్లేక కుటుంబపోషణ భారమైన ఎంతో మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు.
ఇదే సమయంలో అమరావతి పనులు నిలిచిపోవడంతో దాదాపు 20 వేల కోట్ల రూపాయల పనులు ఎక్కడి వక్కడే ఆగిపోవడంతో ఆ ప్రభావం కార్మికులపై పడింది.
ఇలాంటి సమయంలో రేట్లు పెoచడం దారుణమని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
లాక్ డౌన్ కు ముందు 250 నుంచి 280 రూపాయలున్న సిమెంట్ బస్తా రేటు… ఇప్పుడు ఏకంగా 380 నుంచి 400 రూపాయలకు వ్యాపారులు అమ్ముతున్నారని ఆరోపించారు.
ఇసుక ,సిమెంటు రేట్లు సామాన్యులకు అందుబాటులో లేకపోవడంతో కొత్త నిర్మాణాలకు ఎవరూ ముందుకు రావడం లేదు.
ఇసుక సామాన్యులకు అందుబాటులొ ఉంచి , సిమెంట్ రేట్లను నియంత్రించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే…