‘విశాఖ స్టీల్’ భూములను కాపాాడుకోవాలి: జగన్ కు ఇఎఎస్ శర్మ లేఖ

(ఇ ఎస్ శర్మ)

కేంద్రం, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని, ప్రైవేట్ కంపెనీలకు ధారాదత్తం చేసే ప్రతిపాదనను వ్యతిరేకించాలని ఈనెల 4వ తారీఖున, 11వ తారీఖున మీకు నేను  రెండులేఖలు రాశాను.  మీరు కూడా ఆలస్యం చేయకుండా స్పందించి, ప్రధాన మంత్రిగారికి రాయడాన్ని స్వాగతిస్తున్నాను. విశాఖ పౌరుల తరఫునుంచి కూడా, ఈ విషయం మీద, ప్రధాన మంత్రి గారికి రాయడం జరిగింది.

ఈ నెల 17వ తారీఖున, మీరు విశాఖ ఉక్కు కార్మికుల సంఘాలతో సమావేశం అయినప్పుడు, కర్మాగారంలో ఖాళీగా ఉన్న 7,000 ఎకరాల భూమిని రియల్ ఎస్టేట్ అభివృద్ధికి అమ్మి, అందునుంచి వచ్చే నిధులతో కర్మాగారాన్ని పునరుద్ధరించి, ప్రభుత్వ రంగం లోనే లాభాలు గణించే వ్యవస్థగా పెంపొందించాలని సూచించినట్లు వార్తలు వచ్చాయి. అటువంటి ప్రతిపాదన ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటుందని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎటువంటి పరిస్థితులలోను, కర్మాగారం భూములను అమ్మకూడదని కేంద్రప్రభుత్వాన్ని హెచ్చరించాలి.

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని స్థాపించడానికి, గతంలో ప్రజా ప్రయోజనాలను  కారణంగా చూపిస్తూ, అప్పటి ప్రభుత్వాలు, రైతుల వద్ద నుంచి మంచి వ్యవసాయ భూములను బలవంతంగా సేకరించడం జరిగింది.

ఆ సందర్భంలో రైతు కుటుంబాలకు కర్మాగారంలో నష్టపరిహారమే కాకుండా, ఉద్యోగావకాశాలు కూడా కలిగిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా, అటువంటి అవకాశాలు అందరికీ లభించలేదు.

ప్రజా ప్రయోజనాలకోసం సేకరించిన భూములను,  రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతులకు బదలాయించడం భూసేకరణ చట్టాన్ని ఉల్లంఘించినట్లు అవుతుంది.

పైగా అటువంటి విలువైన భూములను వేలం వేస్తే, అతిచౌక ధరలకు భూమి, కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం వలన లాభాలు గణించేది, కొద్దిమంది వ్యాపారులు మాత్రమే. ప్రజలు పెద్ద ఎత్తున నష్టపోతారు.

గతంలో ప్రభుత్వాలు విశాఖ ఉక్కు కర్మాగారం భూములలో 2,000 ఎకరాలకు పైగా ప్రైవేట్ కంపెనీ అయిన గంగవరం పోర్టుకు అతి తక్కువ ధరకు ఇవ్వడాన్ని విశాఖ ప్రజలు వ్యతిరేకించిన విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను.

7,000 ఎకరాల భూమి మార్కెట్ ధర, ప్రస్తుతం 70 వేల కోట్ల రూపాయలకు పైగా ఉండవచ్చు. అటువంటి విలువైన భూముల  మీద, ప్రభుత్వ రంగ బ్యాంకుల వద్ద నుంచి, భారీగా రుణాలను, కర్మాగారం యాజమాన్యం తీసుకోవచ్చును.


విశాఖ ఉక్కు కర్మాగారం భూములను అమ్మాలనే ప్రతిపాదనను, రాష్ట్రప్రభుత్వం ఎటువంటి పరిస్థితులలోను సమర్ధించకూడదు


కేంద్రం మంచి ఇనుప గనులను కేటాయించి, విదేశీ ఉక్కుమీద సుంకాన్ని అధికం చేస్తే, కర్మాగారం ప్రభుత్వరంగ సంస్థగానే లాభాలతో ముందుకు పోగలదు.

ప్రైవేట్ కంపెనీలకు, విదేశీ కంపెనీలకు యాజమాన్యాన్ని బదిలీ చేసే బదులు, కర్మాగారాన్ని విశాఖ ఉక్కు ఉద్యోగ సంఘాలకు బదలాయిస్తే, వారు సామర్ధ్యం తో కర్మాగారాన్ని నడిపించగలరు. కర్మాగారానికి, కావలసినది తనదైన ఒక మంచి ఇనుప గని మాత్రమే.

ఈ విషయంలో, విశాఖ ఉక్కు కర్మాగారం భూములను అమ్మాలనే ప్రతిపాదనను, రాష్ట్రప్రభుత్వం ఎటువంటి పరిస్థితులలోను సమర్ధించ కూడదు.

కేంద్ర ప్రభుత్వం, కర్మాగారాన్ని ఎలాగో ఒక లాగ ఒక విదేశీ కంపెనీకి, కొన్ని మన దేశంలో ఉన్న ప్రైవేట్ కంపెనీలకు బదలాయించే ప్రయత్నంలో  ఉన్నది. అటువంటి ప్రయత్నాలను చేయకూడదని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని హెచ్చరించాలి.

విశాఖ ఉక్కు కర్మాగారం భూములను అమ్మడంలో, మీరు స్పష్టంగా, మీద సూచించిన విధంగా, ఒక ప్రకటన చేయాలని కోరుతున్నాను. ప్రైవేట్ కంపెనీలకు కర్మాగారాన్ని బదలాయించే ప్రసక్తి ఉండకూడదు.

ఈ విషయంలో నేను ముందే సూచించినట్లు, రాష్ట్ర శాసనసభకూడా ప్రజల ఉద్దేశాలకు అనుగుణంగా విశాఖ ఉక్కును ప్రభుత్వరంగ సంస్థగానే ఉంచాలని తీర్మానం చేసి పార్లమెంటుకు తెలియ పరిస్తే బాగుంటుంది. ప్రభుత్వరంగ సంస్థలను పార్లమెంటులో ఎటువంటి చర్చ లేకుండా ప్రైవేటీకరణ చేయడం తగదు.

(కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి డా. ఇఎఎస్ శర్మ ముఖ్యమంత్రి రాసిని లేఖ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *