పోతిరెడ్డిపాడును కాదని గోదావరి నమ్ముకుంటే మునిగినట్లే 

(మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి)
అందుబాటులో ఉన్న అవకాశాలను ఉపయోగించుకోవడం మానవ సహజం.. చేతిలో ఉన్న అవకాశాలను జారవిడుచుకొని ఆ తర్వాత కొత్తవాటి కోసం ప్రయత్నం చేసే వారిని ఏమనాలి ? ఇప్పుడు అలాంటి ప్రతిపాదన ఒకటి సీమ ప్రజల ముందుకు వచ్చింది. గ్రావిటీ ద్వారా కళ్ళ ముందు ఉన్న కృష్ణా , తుంగభద్ర నీటిని అందించే అవకాశాలను పక్కన పెట్టి 700 – 800 అడుగుల క్రింద ఉన్న గోదావరి నీటిని సీమకు తరలించడం, దానిపై హక్కుల కోసం కేసీఆర్ మీద ఆధారపడటం అవసరమా?
ఆద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రదానంగా రెండు నదులు ఉన్నాయి అవి గోదావరి, క్రిష్ణ. గోదావరి నుంచి దాదాపు ఏటా 2 వేల tmc లకు పైగా సముద్రంలో కలిసిపోతుంది. అదే క్రష్ణనది నుంచి దాదాపు 2,3 వందల tmcలు సముద్రం లో కలుస్తున్నాయి. నదుల నుంచి నీటిని పొలాలకు, త్రాగునీటికి వాడుకోవడానికి ఉన్న మార్గం ప్రాజెక్టుల నిర్మాణం. ప్రాజెక్టులకు అనుబందంగా రిజర్వాయర్ లు, కాలవలు నిర్మిస్దారు. నీటిపంపిని గ్రావిటి, ఎత్తిపోతల పద్దతుల ద్వారా చేస్దారు. ఎత్తిపోతల పధకం అన్నది అత్యంత కరీదైనది. అన్ని మార్గాలు అయిన తర్వాత విదిలేని పరిస్దితులలో మాత్రమే ఎత్తపోతల పద్దతిని ఎంచుకొంటారు.
ఏపిలో శ్రీశైలం , నాగార్జున సాగర్ ద్వారా ప్రదానంగా నీటిని నిల్వ చేసుకుంటారు. గోదావరిపై నిర్మించాల్సింది పోలవరం. పోలవరం నిర్మించితే కుడి, ఎడమ కాలువల ద్వారా అటు ఉబయ గోదావరి జిల్లాలు, ఉత్తరాంద్ర జిల్లాలకు. ఇటు క్రిష్ణ, గుంటూరు, కొంత ప్రకాశం జిల్లాలకు నీటిని గ్రావిటీ ద్వారా అందించవచ్చు. శ్రీశైలం ద్వారా రాయలసీమ, నెల్లూరు కొంత మేరకు ప్రకాశం జిల్లాలకు గ్రావిటీ ద్వారానే నీటిని అందించవచ్చు.
రాయలసీమ గుండెచప్పుడు పోతిరెడ్డిపాడు
రాయలసీమ ప్రాంతంలో ఉన్న గాలేరు నగరి , తెలుగుగంగ , నెల్లూరు కి ఉపయోగపడే నిప్పులవాగు , SRBC లకు నీరు లభించేది పోతిరెడ్డిపాడు ద్వారానే. హంద్రీనీవాకు నీరు విడుదల చేసే మాల్యాలకు నీరు అందాలంటే అది శ్రీశైలంలో నీటి మట్టం 845 అడుగులు ఉండాలి. అలా శ్రీశైలం నీటి మట్టం పోతిరెడ్డిపాడు రాయలసీమ నీటి సమస్య పరిష్కారానికి కీలక అవసరం.
తుంగభద్ర , కుందుని విస్మరించే ప్రయత్నం దుర్మార్గంకృష్ణా నదితో బాటు సీమలో ప్రవహిస్తున్న ముఖ్యమైన ఉప నది తుంగభద్ర మరియు కుందు. తుంగభద్ర ప్రతియేటా కరువు పరిస్థితులలో 50 టీఎంసీలు , సాధారణ పరిస్థితుల్లో 100 వరద సమయంలో 200 టీఎంసీల నీటిని తీసుకు వస్తుంది. ఈ నీటిని వాడుకునే విధంగా గుండ్రేవుల , సమాంతర కాలవ కుందు నదిపై నిర్మాణాలతో ( నేటి ప్రభుత్వం కుందుపై ప్రయత్నం ప్రారంభించినది ) కృష్ణ నీటితో సంబందం లేకుండా 150 – 250 టీఎంసీల నీరు అందుబాటులోకి వస్తుంది. అలా కృష్ణా , తుంగభద్ర , కుందు నదులలో రాయలసీమలో లభించే నీటితో కనీసం జిల్లాకు 50 టీఎంసీల నీరు విడుదల చేయవచ్చు. రేపు పోలవరం పూర్తి అయితే శ్రీశైలంలోని కృష్ణ నీటిని నాగార్జున సాగర్ జలాశయం ద్వారా కృష్ణా డెల్టాకు నీటి సరఫరా అవసరం ఉండదు. అపుడు కృష్ణలోని ఏపీ వాటా పూర్తిగా రాయలసీమ , నెల్లూరు , ప్రకాశం జిల్లాలకు ఉపయోగించే అవకాశం ఉంటుంది. అపుడు కూడా పోతిరెడ్డిపాడు అవసరం మరింత పెరుగుతుంది.
గోదావరి నీరు రాయలసీమకు వ్యయం అధికం ఫలితం పరిమితం
గోదావరిని రాయలసీమ తీసుకురావడం సాధ్యమా ? అంటే సాధ్యమే ఎలా అంటే గోదావరిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు సముద్ర మట్టానికి దాదాపు 50 అడుగులు పైనే ఉంటుంది. అక్కడి నుంచి రెండు, మూడు లిప్టులు ద్వారా దాదాపు 300 అడుగులు సముద్ర మట్టానికి పైన ఉన్న సోమసిల లేదా బొల్లారం తరలించాలి. అంటే పోలవరం బ్యాక్ వాటర్ పైన నీటిని లిప్ట్ చేసి అక్కడి నుంచి కాలువల ద్వారా ప్రకాశం జిల్లాలో నిర్మించే రిజర్వాయర్ లో నింపి మల్లీ అక్కడ లిప్ట్ చేసి రాయలసీమలోని బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ కు తరలిండం ద్వారా నెల్లూరుకు ,రాయలసీమ కు నీరు ఇస్దామంటారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి వేల కోట్లు ఖర్చు చాలా పరిమితమైన ప్రయోజనం. అంతే కాదు దీని నిర్వహణ తడిసి మోపెడు అవుతుంది. ఆ ఖర్చులో సగం రాయలసీమలో ప్రాజెక్టుల నిర్మాణంపై చేస్తే సీమకు గ్రావిటితో నీటిని సరఫరా చేయవచ్చు.
రాయలసీమకు పొంచి ఉన్న ప్రమాదం
గోదావరిలో పుష్కలంగా నీరు ఉన్నది వాస్తవం. కానీ ఏపీ వాటా కన్నా ఎక్కువ నీటిని వాడుకుంటే మహారాష్ట్ర , కర్ణాటకతో తెలంగాణ రాష్ట్రాలు కృష్ణాలో అధిక వాటా కొరవచ్చు పోలవరం పూర్తి అయిన తర్వాత అయినా రాయలసీమ ప్రాంతానికి కృష్ణ నీటిని వాడుకోవచ్చు అన్న చివరి ఆశ కూడా నెరవేరే పరిస్థితి ఉండదు. శ్రీశైలం నీటిని రాయలసీమ, నెల్లూరు ,ప్రకాశం జిల్లాలకే పరిమితం కావాలన్ని న్యాయమైన కోర్కేను నిరాకరించడం. అందుకే వరదల సమయంలో కృష్ణ నీటిని గరిష్ట స్థాయిలో వాడుకోవడం అందుకోసం పోతిరెడ్డిపాడు వెడల్పు , రాయలసీమ ఎత్తిపోతల పథకం , ముఖ్యంగా కాల్వల సామర్థ్యం పెంచుకోవాలి. గరిష్ట స్థాయిలో నీటిని తీసుకుని వస్తున్న తుంగభద్ర పై గుండ్రేవుల , సమాంతర కాల్వ నిర్మాణం , సిద్దేశ్వరం నిర్మాణం పూర్తి చేసి కుందు పై ప్రారంభించిన నిర్మాణాలు సత్వరం పూర్తిచేయాలి. పరిస్థితులు అనుకూలిస్తే గోదావరి నీటిని తరలించే ఆలోచన చేయవచ్చు. కేసీఆర్ ప్రభుత్వం గోదావరి నీటి రాయలసీమకు తరలించు కోవచ్చు అన్న ప్రతిపాదన వెనక సీమ పై ప్రేమకన్నా కృష్ణా నీటిలో అధికవాటా కోరే ఉద్దేశ్యం కనిపిస్తుంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కృష్ణ నీటి వాటాలో తమకు అన్యాయం జరిగిందని కేసు వేసింది. పోలవరం పూర్తి అయితే కృష్ణలో ఏపీ వాటా 512 టీఎంసీల నీటి హక్కు పూర్తిగా రాయలసీమ , నెల్లూరు , ప్రకాశం వాడుకోవచ్చు. అలా కాకుండా గోదావరి నీటిని సీమకు భారీ ఖర్చుతో స్వల్ప నీటిని సీమకు వాడుకుంటే రేపు ఏపీ అవసరాలు గోదావరితో తిరిపోతుంది కనుక కృష్ణలో ఉన్న ఏపీ వాటాను తమకు కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం కోరే అవకాశం ఉంది. కృష్ణ పై హక్కును వదులుకోవాల్సిన అవసరం లేదు. గోదావరి నీటిని అదనంగా వాడుకోవడానికి తెలంగాణ అనుమతి అవసరం లేదు. ఎందుకంటే గోదావరికి మన రాష్ట్రం చివరిది కాబట్టి.
ఇప్పటికే పాలకుల నిర్లక్ష్యం కారణంగా రాయలసీమ తీవ్రంగా నష్టపోయిన విషయం తెల్సిందే. ఏపీ ప్రభుత్వం తీసుకున్న పోతిరెడ్డిపాడు వెడల్పు , రాయలసీమ ఎత్తిపోతల పథకం అమలు రాయలసీమకు ప్రయోజనకరం. ఈ నిర్ణయాన్ని సమర్థిస్తూ సిద్దేశ్వరం , గుండ్రేవుల , సమాంతర కాలవ సాధన కోసం సీమ సమాజం పోరాడాలి. అలాంటి ప్రయత్నం రాయలసీమ ప్రజలు చేసేలా చైతన్యం కల్పించే బాధ్యత రాయలసీమ మేధావులు , ఆలోచనాపరులు మీద ఉన్నది.
(మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి, సమన్వయ కర్త, రాయలసీమ మేధావుల ఫోరం, తిరుపతి)