కరోనా నెగటివ్ అని చీర్స్ కొట్టొద్దు, మూన్నెళ్లు వైద్య పర్యవేక్షణ అవసరం: ఎపి కోవిడ్ సెంటర్

(డాక్టర్ అర్జా శ్రీకాంత్)
కోవిడ్‌-19 నుంచి కోలుకొని ‘నెగెటివ్‌’ నిర్ధారణ కాగానే తమ ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా లేదనే అతివిశ్వాసం వద్దని వైద్యులు సూచిస్తున్నారు. అదే సమయంలో మరింత భయపడాల్సిన అవసరం లేదని, కొద్దిపాటి జాగ్రత్త చర్యలు పాటిస్తే ఆరోగ్యంగా ఉండొచ్చంటున్నారు.
నెగెటివ్‌ వచ్చిన తర్వాత కూడా దాదాపు మూడు నెలల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి. క్రమం తప్పకుండా మందులు వాడటం మంచిదని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.
ఈక్రమంలో అంతకుముందు నుంచీ ఉన్న ఇతరత్రా వ్యాధులు ముదిరిపోకుండా చూసుకోవడం అత్యవసరమన్నారు. కరోనా నుంచి కోలుకున్నవారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే గుండె, మెదడు, కిడ్నీ వంటి కీలక వ్యవస్థల్లో సమస్యలు తలెత్తే ముప్పు పొంచి ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
వీటిని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి:
* ప్రతిరోజు ఆక్సిజన్ లెవెల్స్ పరీక్షించుకోవాలి. కనీసం 94 శాతం వద్ద ఉండేలా చూసుకోవాలి.
* దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లక్షణాలను గమనిస్తూ ఉండాలి
* శరీరంలో ఉష్ట్రోగ్రత 100డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటే జాగ్రత్తపడాలి
* బద్ధకం, మగతగా ఉండడం, ఆందోళనకరంగా ఉండడం లాంటి సంకేతాలు ఎప్పకికప్పుడు గమనిస్తూ ఉండాలి
* డయాబెటిక్ పేషెంట్లలో బ్లడ్ షుగర్ లెవెల్స్ ను ఎప్పకటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. కోవిడ్-19 సోకినప్పుడు బ్లడ్ షుగర్ లెవల్స్ లో మార్పులు వస్తుంటాయి. కాటట్టి కనీసం మూడు రోజులకు ఒకసారి తప్పకుండా చెక్ చేసుకోవాలి. తరచూ వైద్యులను సంప్రదించాలి.
* రక్తపోటు సంబంధిత సమస్యలను నివారించుకోవడానికి ఎప్పటికప్పుడు చెకప్ చేసుకుంటూ ఉండాలి. రక్తపోటు నియంత్రణలోనే ఉన్నవారు మాత్రం కనీసం వారానికి ఒకసారి పరీక్షించుకోవాలి. ఒకవేళ అసాధారణంగా పెరిగే తరచూ చెక్ చేసుకోవాలి.
* కోవిడ్-19 నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి వారం రోజుల తర్వాత మరోసారి డాక్టర్ని సంప్రదించాలి.
* సీబీసీ, సీఆర్పి లాంటి రక్తసంబంధిత పరీక్షలను ఒకవేళ వైద్యులు సూచిస్తే అందుకు అనుగుణంగా జాగ్రత్తలు పాటించాలి.
* కోవిడ్-19 నుంచి పూర్తిగా కోలుకున్న మూడు నెలల తర్వాత ఊపరితిత్తుల యొక్క పరిస్థితిని తెలుసుకోవడానికి సంబంధిత సిటీ స్కాన్ చేయించుకోవాలి.
*ప్రపంచ వాణిజ్య చరిత్రను మార్చేసిన ఒక డాక్టర్ ప్రాణత్యాగం
ఈ సూచనలను పాటించకపోతే ఏం జరగవచ్చు?
* ‘సైటోకిన్ స్టార్మ్’ కు గురై ఊపిరితిత్తులపై ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది.
* ఈ రక్తనాళాలు లీకవడంతోపాటు రక్తం గడ్డకట్టడం ప్రారంభమవొచ్చు.
* రక్తపోటీ క్షీణించి అవయవాలు విఫలం అవడం ప్రారంభం కావచ్చు.
* కోవిడ్-19 రోగులకు పెద్ద సమస్య ‘పల్మనరీ ఫైబ్రోసిస్’ వల్ల వస్తోంది. అది ఊపిరి తిత్తులకు సంబంధించినది. అదే కాకుండా పల్మనరీ ఎంబోబోలిజం, మూత్రపిండ వైఫల్యం, కాలేయ పనిచేయకపోవడం, కోగ్యులోపతి (అధిక రక్తస్రావం లేదా గడ్డకట్టడం), తీవ్రమైన స్ట్రోక్ మరియు మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ వంటివాటికి దారితీయవచ్చు.
కరోనా నుండి కొలుకొన్నామని అజాగ్రత్తగా లేకుండా వైద్యుల పర్యవేక్షణలో మరింత జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది.
Arja Srikanth
(డాక్టర్ అర్జా శ్రీకాంత్, స్టేట్ నోడల్ ఆఫీసర్, కోవిడ్-19, ఆంధ్రప్రదేశ్)

Like this story? Share it with a friend!