పసుపు రైతుల కష్టాలు చూస్తున్నారా? : జగన్ కు లోకేష్ లేఖ

రైతుల గురించి  వైసీపీ నేతల మాటలు గొప్పగా ఉంటున్నాయి,  చేతలేమో శూన్యంగా కనిపిస్తున్నాయని తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి నారాలోకేష్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్  పసుపు రైతుల గోడు మీకు పట్టడం లేదా?  అని ఆయన ఈ రోజు  ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఒక రాస్తూ ప్రశ్నించారు.   మమార్కెట్ లో క్వింటాలు పసుపుకు రూ.5 వేల నుంచి 5,400 ధర మాత్రమే లభిస్తోంది. ఈ లెక్కన మీరు ప్రకటించిన ధర ప్రకారమే పసుపు రైతులు క్వింటాకు రూ.1450 నుంచి రూ.1850 వరకు నష్టపోతున్నారని ఆయన లేఖలో చెప్పారు. లేఖని యథాాతధంగా అందిస్తున్నాం.
గౌరవనీయులైనఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు   
శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి  
విషయం: రాష్ట్రంలో పసుపు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, గిట్టుబాటు ధర కల్పన గురించి
రాష్ట్రంలో పసుపు పండించిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ వైపు లాక్ డౌన్ నిబంధనలు, మరోవైపు అరకొర కొనుగోళ్లతో నష్టాలపాలు అవుతున్నారు. రాష్ట్రంలో 33వేల ఎకరాల్లో పసుపును సాగు చేశారు. 8.25 లక్షల క్వింటాళ్ల ఉత్పత్తి వస్తుందని అంచనా వేశారు. కడప, కృష్ణా, గుంటూరు, విశాఖ జిల్లాల్లో పసుపును అధికంగా సాగు చేశారు. ప్రభుత్వం పసుపు క్వింటాలుకు రూ.6,850ల గిట్టుబాటు ధర ప్రకటించినప్పటికీ రైతులకు మాత్రం ఆ ధర లభించడం లేదు. ఎన్నికలకు ముందు క్వింటా రూ.15వేలు ఉంటేగానీ పసుపుకు గిట్టుబాటు కాదని ఊదరగొట్టిన వైసీపీ.. ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదు? ప్రస్తుత పరిస్థితుల్లో పసుపుకు కనీసం రూ.10వేలు ధర ఉంటే కానీ రైతుకు గిట్టుబాటు కాదు. కానీ ఇప్పటి ధరల ప్రకారం పెట్టిన పెట్టుబడులు కూడా రాక పసుపు రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మరోవైపు అప్పుల భారం వారిని మరింత కుంగదీస్తోంది. మార్క్ ఫెడ్, వ్యవసాయ శాఖల మధ్య సమన్వయ లేమి ఉందని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్వయంగా వ్యాఖ్యానించడం ప్రభుత్వ అసమర్థతను, నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేస్తోంది. రైతుల గురించి గొప్పగా మాట్లాడే వైసీపీ నేతల.. చేతలు మాత్రం శూన్యంగా కనిపిస్తున్నాయి. పసుపు రైతుల గోడు మీకు పట్టడం లేదా? మార్కెట్ లో క్వింటా పసుపుకు రూ.5 వేల నుంచి 5,400 ధర మాత్రమే లభిస్తోంది. ఈ లెక్కన మీరు ప్రకటించిన ధర ప్రకారమే పసుపు రైతులు క్వింటాకు రూ.1450 నుంచి రూ.1850 వరకు నష్టపోతున్నారు.

కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా ఇప్పటివరకు పెద్దగా కొనుగోళ్లు జరగలేదు. ప్రభుత్వం ఇచ్చిన పిలుపు నిజమని నమ్మి, ఎన్నో ఇబ్బందులు పడి పెద్ద ఎత్తున పండించిన పసుపుతో కొనుగోలు కేంద్రాలకు వచ్చిన రైతులకు  అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. కొనుగోలు కేంద్రాల దగ్గర కనీస ఏర్పాట్లు లేక, కొనుగోళ్లు జరగక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. కొనుగోళ్లు ముమ్మరం చేయకపోవడంతో కొన్నిచోట్ల ఆరబెట్టిన పంట తడుస్తుందేమోనని రైతులు భయపడుతున్నారు.

తుఫాను నేపథ్యంలో రైతుల  వద్ద ఉన్న మొత్తం పంటను ప్రభుత్వమే త్వరగా కొనుగోలు చేయాలి. లేనిపక్షంలో రైతులు నష్టపోతారు. మరోవైపు వర్షం కురిస్తే ఆరబెట్టుకునేందుకు టార్పాలిన్లు కొరతకూడా ఉంది. అటు నిల్వ చేసుకునేందుకు కూడా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పసుపు రైతు సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ఈ-క్రాప్ సీజన్  లో సాగుకు మించి విస్తీర్ణం నమోదుకావడం కూడా అనుమానాలకు తావిస్తోంది.

మీ ప్రభుత్వం దళారులకు కొమ్ముకాస్తున్నట్టుగా ఉంది. ఇప్పటికైనా కష్టాల్లో ఉన్న పసుపు రైతులను తక్షణమే ఆదుకొండి.
ఇట్లు                                                                    
 నారా లోకేష్, తెలుగుదేశం పార్టీ, జాతీయ ప్రధాన కార్యదర్శి