ప్రత్యేక హోదా తెస్తా, జాబులిస్తానన్నావ్, హోదా ఎక్కడ, జాబ్స్ ఏవీ? : కళా వెంకట్రావ్

( కళా వెంకట్రావు)
దేశ అభివృద్దికి వెన్నెముకగా ఉన్న యువత వెన్నెముకను ముఖ్యమంత్రి వైఎస్  జగన్మోహన్ రెడ్డి విరిచేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో శాసించే స్ధాయిలో ఉన్న యువతను జగన్ నాయకత్వంలోని  వైసీపీ ప్రభుత్వం యాచించే స్ధాయికి దిగజార్చింది.
ఎన్నికల ముందు హోదా తెస్తా, హోదాతో యువతకు ఉద్యోగాలు కల్పిస్తా నని ప్రకటించిన జగన్.. ఎన్నికలయ్యాక హోదా గురించి నోరు ఎత్తటం లేదు, నిరుద్యోగ యువత గురించి పట్టించుకోవటం లేదు.
ప్రతి ఏడాది జనవరి లో ఉద్యోగాల క్యాలెండర్ ప్రకటిస్తామని అధికారంలోకి వస్తూనే ప్రకటించారు. అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. క్యాలెండర్ ను ప్రకటించడం కాదు, ఉన్న ఉద్యోగాలను పెరికేస్తున్నారు. ఇంతవరకు 3 లక్షల ఉద్యోగాలు తొలగించారు.ఇప్పుడు గతంలో నియమితులయిన కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు కూడా తొలగించే కుట్ర చేస్తున్నారు.
జగన్ తన 13 నెలల పాలనలో నిరుద్యోగ యువతకు ఒక్క శాశ్వత ఉద్యోగం అయినా ఇచ్చారా? ఒక్క పరిశ్రమ అయినా తెచ్చారా?
రైతులు వర్షం కోసం ఎదురుచూసినట్లు నిరుద్యోగులు నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. పోటీ పరీక్షల శిక్షణ కోసం లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి శిక్షణ పొందిన నిరుద్యోగులు నోటిపికేషన్ రాక రోడున పడ్డారు.
టీడీపీ హయాంలో ఉన్న స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలు ఈ ప్రభుత్వం మూసివేయటం వాస్తవం కాదా? నిరుద్యోగులు పొట్టకూటి కోసం ఉద్యోగాల వేటలో ఉంటే మంత్రులు మాత్రం తమ జేబులు నింపుకునే పనిలో ఉన్నారు.
 జగన్  నిరుద్యోగద్రోహి అయ్యారు.  వైసీపీలోని రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చి లక్షలాది నిరుద్యోగులను నట్టేట ముంచారు. ఉద్యోగాల భర్తీ అంటే మీ తాబేదార్లను సలహాదారులుగా నియమించటమా? లేక ఒకే సామాజికవర్గానికి పదవులు కట్టబెట్టడమా?
75 శాతం స్ధానికులకే ఉద్యోగాలు అన్న జగన్ పొరుగు రాష్ట్రాలు, విదేశాల్లో ఉన్నవారిని సలహాదారులుగా నియమించటం వాస్తవం కాదా?
10 తరగతి కూడా పాసవ్వని కొడాలి నానికి మంత్రిగా ఉద్యోగం ఇచ్చిన జగన్ డిగ్రీ, ఎంబీఎ, బీటెక్ చేసిన వాళ్లని వైన్ షాపుల్లో బేరర్లుగా చేశారు. దేశాన్ని ముందుకు నడిపే యువతను వైసీపీ ప్రభుత్వం మందు షాపులు వైపు నడిపిస్తోంది.
ఉన్నత చదువులు చదివి ఉపాధి దొరక్క యువత మద్యానికి బానిసలవుతున్నారు. జగన్ కి ప్రతిపక్ష నాయకులుపై అక్రమ కేసులు పెట్టడంలో ఉన్న వ్రద్ద నిరుద్యోగులపై లేదు.
ఉద్యోగాలు కల్పించమంటూ నిరుద్యోగులు ముఖ్యమంత్రి ఇంటి ముందు ధర్నా చేస్తే అక్కడ 144 సెక్షన్ పెట్టుకున్నారంటేనే వైసీపీ ప్రభుత్వ వైపల్యానికి అర్ధం పడుతోంది. జగన్ పాలనలో నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు ఉద్యోగులకు జీతాలు లేవు.
కేంద్రం మెడలు వంచి తెస్తానన్న ప్రత్యేక హోదా ఏమైంది? జగన్ ఇప్పటి వరకు 10 సార్లు డిల్లీ వెళ్లారు, ఎన్ని సార్లు కేంద్రం మెడలు వంచారో ప్రజలకు లెక్క చెప్పాలి ? మెడలు వంచేటపుడు విజయసాయిరెడ్డి లెక్కపెట్టడం మరిచిపోయారా? లాక్ డౌన్ సమయంలో అన్న క్యాంటీన్లు ఉండి ఉంటే నిరుద్యోగులు ఆకలితో అలమంటిచే పరిస్థితి  ఉండేది కాదు.
నిరుద్యోగులకు చంద్రబాబు నాయుడు ఇచ్చిన నిరుద్యోగ భృతిని రద్దు చేసి జగన్ నిరుద్యోగుల పొట్టకొట్టారు. యువత గురించి పట్టించుకోకుండా రాష్ట భవిష్యత్ ని అంధకారం చేశారు. నాడు రావాలి జగన్ కావాలి జగన్ అన్న వారే నేడు పోవాలి జగన్ అంటున్నారు. జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న చర్యలతో యువత తిరుగుబాటు చేయటం ఖాయం.
(కిమిడి కళా వెంకట్రావు, టీడీపీ రాష్ట్రఅధ్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్)