ఒక డాక్టర్ ప్రాణత్యాగంతో సాగిన పనామా కాలువ నిర్మాణం, ఎలాగంటే…

ప్రపంచ  వాణిజ్యంలో పనామా కాలువ ప్రాముఖ్యం అంతా ఇంతకాదు. పనామా కాలువ లేకుండా నేటి అంతర్జాతీయ వాణిజ్యాన్ని వూహించలేం.
అయితే, పనామా కాలువ తవ్వేందుకు వందలాది మంది ప్రాణాలు వదిలారు. ప్రాణభయం తో కాలువతవ్వకం  దశాబ్దాల పాటు వాయిదా వేశారు. చివరకు ఒక డాక్టర్ ప్రాణత్యాగంతో సమస్య పరిష్కారం అయింది. ఆ డాక్టర్ పేరు జెసీ విలియం లాజియర్ (Jesse William Lazear).
పూర్వం వైద్యం లో క్లినికల్ ట్రయల్స్ కు ముందు డాకర్ల తమ మీదే ప్రయోగాలు చేసుకునేవారు.  అలాచాలా మంది చనిపోయారు కూడా. కొత్త విషయాల ఆవిష్కరణకు ఆత్మత్యాగానికి కూడా శాస్త్రవేత్తలు డాక్టర్లు జంకే వారు కాదు.
దీనినే సెల్ప్ ఎక్స్ పెరిమెంటేషన్ ((Self-Experimentation) అంటారు. వీళ్లందరూ వైద్యశాస్త్రం కోసం ప్రాణాలు విడిచినందునే ఈ రోజు మనం అనేక భయంకరమయిన రోగాలనుంచి విముక్తి పొందాం.అనేక మందులు వాడగలుగుతున్నాం. అనేక జబ్బుల రహస్యాలు తెలుసుకోగలిగాం. నిజానికి మనం వైద్యానికి పునాదులు వేసిన అమరవీరులు వాళ్లంతా.
ఇలాంటి సెల్ప్ ఎక్స్ పెరిమెంటేషన్ కోసం ప్రాణత్యాగం చేసిన డాక్టర్ లలో లాజియర్ ఒకరు. ఆయన త్యాగం మీద నిర్మాణమయిందే పనామా కాలువ.  ఆ కథేంటో చదవండి
ఎల్లో ఫీవర్ (Yellow Fever) అనేది 18,19 శతాబ్దాలలో భయంకరమయిన జబ్బు. మధ్య అమెరికా అటు ఇటూ దేశాలలో విపరీతంగా ప్రాణాలను తీసిన జబ్బు. ఆ జబ్బు ఎలా వస్తుందో, ఎలా వ్యాపిస్తుందో తెలియని రోజులవి.  ప్రపంచాన్ని చుట్టి వస్తున్న నౌకల ద్వారా  ఈ జబ్బు దేశ దేశాలకు ప్రాకుతూ వేలాది మందిని బలి గొంటూ ఉంది.
 ఎల్లో ఫీవర్ నరకయాతన తెలిసినా అదెలా వ్యాపిస్తున్నదో అంతుబట్టడం లేదు. అందుకే ఎల్లో ఫీవర్ నివారణ చర్యలు చేపట్టలేక పోయారు. ఎల్లో ఫీవర్  ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాలు రెండింటిని  గజగజ వణికిస్తున్నది. మరణాలు రేటు 20 శాతం దాకా ఉంది.
ఇపుడు కరోనా మహమ్మారి  ఎలా ప్రపంచాన్ని పీడిస్తున్నదో ఆ రోజుల్లో లాటిన్ అమెరికాతో పాటు అమెరికా దక్షిణ ప్రాంతాలను ఎల్లోఫీవర్ శాపంలా పట్టుకుని పీడించింది.
అమెరికాలోనే  వేల సంఖ్యలో చనిపోయారు. ఉదాహరణకు1878లో మెంఫిస్ నగరంలో 16 వేల మంది చనిపోయారు. 1793లో 1900 మంది చనిపోయారు. ఈ జబ్బు ఎలా వస్తున్నదో ఒక మనిషి నుంచి మరొక మనిషికి ఎలా అంటుకుంటున్నదో తెలియదు.
వ్యాధికి వైద్యం చేసేందుకు, ఈ వ్యాధిని నివారించేందుకు ఈ విజ్ఞానం (Epidemeology) చాలా అవసరం. చాలా మంది డాక్టర్లు ఎల్లో ఫీవర్ ‘అంటువ్యాధి’ అని అనుమానిస్తున్నారు. ఈ జబ్బు వచ్చినపుడు కామెర్లు కూడా వచ్చి మనిషి పచ్చబడతాడు కాబట్టి ఎల్లోఫీవర్ అని పిలిచారు.
Willam Jesse Lazear/ National Library of Medicine, Public Domain,
ఈ వ్యాధి వల్ల  అనేక దేశాలలో ఉన్నఅమెరికా సైనికులు కూడా పిచ్చిపచ్చిగా చనిపోతున్నారు. 1804 నాటికి ఇది ‘అంటువ్యాధి’ కాదని మాత్రం తెలుసుకున్నారు.
 ఇది దోమల వల్ల వ్యాపిస్తున్నదని భావించిన వాళ్లూ (జాన్ క్రాఫోర్డ్  బాల్టిమోర్ 1807) ఉన్నారు. .అయితే ఆధారాలు లేవు. అది  ప్రయోగాత్మకంగా  రుజువుకావలసి ఉంది.
ఇలాంటపుడు అట్లాంటిక్ , పసిఫిక్ మహా సముద్రాలను కలిపి, ఆమెరికా పడమటి తీరానికి దగ్గిర దారి వేయాలనుకున్నారు.  ఈ ఆలోచనతో మొదలయిందే పనామా కాలువ తవ్వకం.
ఫ్రాన్స్ ఈ పని మొదలుపెట్టింది. అయితే, ఆ ప్రాంతంలో ఎల్లో ఫీవర్ ప్రబలి వేల సంఖ్యలో ఫ్రాన్స్ కార్మికులు చనిపోవడంతో   ఫ్రెంచ్ దేశం వాళ్లు  పనామా కాల్వ తవ్వకం పనులను ఆపేసుకుని వెళ్లిపోయారు.

ఇది కూాడా చదవండి

పనామా కెనాల్ నిర్మాణాన్ని సాధ్యం చేసిన ఒక డాక్టర్ ప్రాణ త్యాగం


పనామా దగ్గిర ఈ కాలువ తవ్వడం అమెరికాకూ చాలా అవసరం.ఎందుకంటే,  అమెరికా తూర్పు తీరం నుంచి పడమటి తీరానికి చాలా చేరుకోవాలంటే  చాలా దూరం ప్రయాణించాలి. దీనితో సరుకుల రవాణ ఖరీదయిన వ్యవహారంగా మారిపోయింది. అటు ఇటూ నౌకాయానం చేయాలంటే దక్షిణ అమెరికా ఖండాన్ని మొత్తం చుట్టి ప్రయాణించి పడమటి తీరం చేరాలి. ఒక దేశమే అయినా ఒక తూర్పుతీరం నుంచి పడమటి తీరం చేరాలంటే వేలాది మైళ్లు నౌకల్లో దక్షిణ అమెరికా ఖండాన్ని మొత్తం చుట్టు చుట్టి చేరుకోవలసి వచ్చేంది. ఇది భరించలేనంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.  సరుకుల రవాణ చౌకగా, తొందరగా జరిగేలా దగ్గిర దారి కనిపెట్టాలి. దీనికి అనువైన ప్రదేశం పనామా. కాలువ తవ్వితే దూరం కొన్నివేల మైళ్లు తగ్గుతుంది. అందువల్ల ప్రాన్స్ వెళ్లిపోయాక అమెరికా పనామా కాలువతవ్వేందుకు ప్రయత్నించింది.
అయితే, పనామా ప్రాంతంలో ఎల్లో ఫీవర్ ప్రాణాలను తీసేస్తూ ఉంది. అందువల్ల ఎల్లో ఫీవర్ ను అర్జంటుగా అరికట్టాలి.
 అపుడు ఆమెరికా ప్రభుత్వం 1900 లో ఎల్లోఫీవర్ కమిషన్ (Yellow Fever Commission) నియమించింది.  దీనికి వాల్టర్ రీడ్ (Walter Reed) అనే మిలిటరీ డాక్టర్ అధ్యక్షుడు.
క్యూబా ఆ రోజుల్లో స్పెయిన్ నుంచి స్వాతంత్య్రం కోసం పోరాడుతూ ఉంది.  స్పెయిన్  కు వ్యతిరేకంగా చొరబడింది.
1895-98 మధ్య జరిగింది. ఈయుద్ధంలో స్పెయిన్ వోడిపోయింది.అమెరికా క్యూబాను అక్రమించుకుంది. 1902లో క్యూబా స్వతంత్రమయింది. అయితే, అక్కడ తిష్ట వేసి  ఉన్న అమెరికా సైనికులు ఎల్లో ఫీవర్ తో హడలిపోతున్నారు.  కాబట్టి సైన్యాన్ని కాపాడుకోవాలి.
అప్పుడు డా. రీడ్ ఒక ఆర్మీ మెడికల్ స్కూల్ లో బ్యాక్టీరియాలజీ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. రీడ్  నలుగురు డాక్టర్లతో ఒక వైద్య బృందాన్ని ఏర్పాటు చేసి క్యూబాకు పంపించారు. ఈ బృందంలో ఉన్న యువకుడే  డా. జెస్సీ విలియమ్ లాజియర్ . లాజియర్ చాలా పట్టుదల ఉన్న డాక్టర్.
వీరంతా క్యూబా రాజధాని హవానా శివార్లలో ఉన్న ఒక మిలిటరీ బ్యారక్ లో  1900 జూన్ 25న కలుకున్నారు. ఈ వ్యాధి ఒకరినుంచి మరొకరికి ఎలా సంక్రమిస్తున్నదో కనిపెట్టడం వారి లక్ష్యం.
Walter Reed / Wikimedia Commons
తమ ట్రయల్స్ కోసం ఈ బృందం  కొంతమంది సైనికులను రిక్రూట్ చేసుకుంది. వీళ్లందరికి కుటుంబాలున్నాయి. పిల్లలున్నారు. అయినా సరే ,  మందులేని  ఒక జబ్బు మీద జరుగుతున్న  వైద్య పరిశోధనల్లో పాల్గొనేందుకు సాహసించారు.
1900 ఆగస్టు 3న  వలంటీర్లు వైద్య పరీక్షలకు ప్రాణత్యాగమైనా చేసేందుకు సిద్ధమని   ప్రతిజ్ఞ చేశారు. ఎల్లో ఫీవర్   దోమలు (Aedes Aegypti) లతో  కుట్టించుకునే వైద్యపరీక్షకు అంగీకరిస్తున్నామని ప్రతిజ్ఞ చేశారు.

మరిన్ని విశేషాలు
*తిరుమల పవిత్రతను ఈస్టిండియా కంపెనీ ఎలా కాపాడిందంటే…

*తిరుమల వెంకన్న గుడి ఈస్టిండియా కంపెనీ పాలన కిందికి ఎలా వచ్చింది?


 

ఇందులో మొదట 8 మంది వలంటీర్లకు ఎల్లో ఫీవర్  దోమలు కుట్టేలా చేశారు.  ఎల్లోపీవర్ సోకిన రోగులున్న గదులనుంచి తెచ్చిన దోమలివి. అయితే, వాళ్లెవరూ జబ్బు పడలేదు.
ఆ రోజుల్లో వలంటీర్ల మీద ప్రయోగాలు చేసే ముందు శాస్త్ర వేత్తలు, డాక్టర్లు తమ మీదే మొదట పరీక్షలు  చేసుకునే వారు.
ఈ ఎనిమిది వలంటీర్ల లో  దోమల వల్ల జ్వరం రాకపోవడంతో  జెసీ విలయమ్ లేజియర్ తన మీదే ప్రయోగం చేసుకున్నాడు. ఎల్లో ఫీవరో దోమలు తనని కుట్టేలా చేసుకున్నాడు. అయితే, తొలుత ఆయనకూ జ్వరం రాలేదు.
లాజియర్ రెండో సారి సెల్ప్ ఎక్స్ పెరిమెంటేషన్ కు పూనుకున్నాడు. ఎల్లో ఫీవర్ రోగం మోసుకెళ్తున్నాయని అనుమానం ఉన్న దోమలతో రెండో సారి కుట్టించుకున్నాడు.
అంతే, అయిదు రోజుల్లో ఆయన తీవ్రమయిన జ్వరం వచ్చింది. దాని ప్రభావం గురించి ఆయన రోజూ డైరీ రాయడం మొదలుపెట్టారు. లాజియర్ జ్వరం మందులకు తగ్గలేదు. ఇంకా తీవ్రమయింది. తన పరిస్థితిని ఆయన మొత్తం డైరీలోకెక్కించారు. చివరకు, జబ్బు బాగా ముదిరి అంతా చూస్తుండగానే డా.లాజియర్ చనిపోయాడు. అపుడు ఆయన వయసు కేవలం 34 సంవత్సరాలు.
తన జబ్బు తీవ్రమవుతున్నపుడు, తన ప్రయోగం విజయవంతమయిందని ఆయనకు తెలిసిపోయింది. ఎల్లో ఫీవర్  దోమల ద్వారా వ్యాపిస్తుందనే సిద్ధాంతం తమ ప్రయోగాల్లో రుజువయిందని కూడా ఆయన డైరీలో రాసుకున్నారు.
ఇంత ప్రమాదరక మయిన ప్రయోగాలు జరుగుతున్నపుడు తన గదిలో కూర్చోవడం తప్ప టీమ్ లీడర్  ప్రొఫెసర్ రీడ్  మరొక పని చేయలేదు. అయితే, లాజియర్ చనిపోగానే రీడ్ క్యూబా వదలి అమెరికా వెళ్లిపోయాడు. పోతూ పోతూ డాక్టర్ లాజియర్ డైరీ తీసుకుని పోయాడు.
ఈ డైరీలో ఉన్న విషయాల ఆధారంగా రీడ్ ఎల్లోఫీవర్ దోమల ద్వారా వ్యాపిస్తున్నదని అమెరికి ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చాడు.
ఒక రీసెర్చ్ పేపర్ కూడా పబ్లిష్ చేశాడు.  రీడ్ రిపోర్టు ఒక అత్యద్భుతమయిన రహస్యాన్ని వెల్లికితీసిందని, ఎల్లో ఫీవర్ దోమల ద్వారా వ్యాపిస్తుందని రుజువుచేయడం ఒక వైద్య పరిశోధనల చరిత్రలో ఒక మైలురాయి అని  ప్రభుత్వం ప్రశంసించింది. ప్రపంచమంతా గుర్తించింది.  ప్రొఫెసర్ రీడ్ వైద్య ప్రపంచంలో సెలెబ్రిటీ అయ్యాడు. అయితే, ఆయన ఎక్కడ తన తోటి  పరిశోధకుడు, సెల్ఫ్ ఎక్స్ పెరిమేంటేషన్ బలిదానం చేసుకున్న డా. లాజియర్ పేరు పేర్కొనలేదు.ఇది వేరే విషయం
 ఈ భయంకరమయిన జబ్బును వ్యాప్తి చేస్తున్నది దోమలే నని తెలియగానే ఆమెరికా ప్రభుత్వం పనామా ప్రాంతంలో దోమల నిర్మూలన కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికను చేపట్టింది.
దోమల నివారణ ఎపుడూ పూర్తయిందో వ్యాధి అదుపులోకి వచ్చింది. ఆమెరికా ప్రభుత్వం పనామా కాలువ నిర్మాణ పనులు చేపట్టింది. పూర్తి చేసింది. ఈ కాలువ నిర్మాణం మనిషి సృష్టించిన మహాద్భుతం.
పనామా కాలువ
రెండు మహా సముద్రాలను, అంటే పసిపిక్, అట్లాంటిక్ మహాసముద్రాలను కలుపుతూ ఇంజీనీర్లు సృష్టించిన వింత పనామా కాలువ. భూమ్మీద ఇదొక ఇంజనీరింగ్ అద్బుతమని చెబుతారు.1994లో సివిల్ ఇంజనీరింగ్ ఏడు వండర్స్ లో ఒకటిగా గుర్తింపు పొందింది.
పనామ దేశంలో ఈ రెండు సముద్రాలను మధ్య ఉన్న చికెన్ నెక్  పొడవునా ఈ కాలువ తవ్వడంతో  20 శతాబ్దం ప్రపంచనౌకా వాణిజ్య కొత్త మలుపు తిరిగింది. ప్రపంచంలో అత్యంత కీలకమయిన ఖరీదైన నౌకా మార్గమయింది.  అంతర్జాతీయ వాణిజ్యాన్ని సులభతరం చేసిన కాలువ కూడా ఇది.
1914 లో పనామా కెనాల్ నిర్మాణం పూర్తయింది. మొన్న 2014 లో నూరేళ్ల పండగ జరుపుకుంది.  ఈ కెనాల్ ఇపుడు పనామాదేశం అదుపులో ఉంటుంది. దీని పరిపాలనకు పనామా కెనాల్ అధారిటీ ఏర్పాటు చేశారు.  2015లో ఈ కెనాల్ గుండా 12,000 నౌకలు, అంటే రోజుకు 32 నౌకలు, దాదాపు రెండుగంటలకు మూడు నౌకలు  ప్రయాణించాయి. 2015 అధారిటీకి  టోల్ ద్వారా వచ్చిన  ఆదాయం 2.6 బిలియన్లు డాలర్లు.పనామా ఖజానాకు చేకూరిన మొత్తం 1 బిలియన్ డాలర్లు. 80 దేశాలకు చెందిన 140 వాణిజ్య మార్గాల  నౌకలు ఈ కాలువ గుండా ప్రయాణిస్తుంటాయి.
లాజియర్ అంతా మర్చిపోయారు
దీనితో ప్రొ. రీడ్ కు విపరీతంగా గుర్తింపు వచ్చింది.  ఆయన పనిచేసిన ఒక మిలిటరీ ఆసుపత్రికి వాల్టర్ రీడ్ మిలిటరీ హాస్పిటల్ అని పేరు పెట్టారు.
లేజియర్ త్యాగాన్ని ఎవరూ పట్టించుకోలేదు. ప్రయోగాలకు చాలా ప్రాముఖ్యం ఉంది. ఎందుకంటే మొట్టమొదటి సారి ఒక మనిషిని నుంచి మరొక మనిషికి ఎల్లో ఫీవర్ దోమలద్వారా వ్యాపిస్తుందనే విషయం రుజువు చేసేందుకు ఒక డాక్టర్ తన మీద తానే ప్రయోగం చేసుకున్నాడు. ఎల్లో ఫీవర్ బారిన పడ్డాడు. వ్యాధికి సరైన వైద్యం లేక సతమతమవుతూనే ప్రయోగాన్ని డైరీ లోరికార్డు చేశాడు. ప్రయోగం విజయవంతమయంది. వ్యాధి ముదిరింది. ప్రాణంవిడిచాడు

 


ఇదీ మీకు నచ్చవచ్చు
తిరుమల గురించిన 20 చిన్న, చిక్కు ప్రశ్నలు, వీటి జవాబులు మీకు తెలుసా?

Panama Canal/Panama Canal Authority

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *