సిఎం జగన్ కు కొత్త పరీక్ష: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సతీసమేతంగా వెళతారా?

(ప్రసాద్ వి ఎస్. డి గోశాల)
ఆంధ్రప్రదేశ్  రాజకీయాలు మత విశ్వాసాల మీదకు మళ్లాయి. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథానికి నిప్పుపెట్టి కాల్చిన తర్వాత ఈ వివాదం తీవ్రమయింది.   హిందూత్వ , ధార్మిక సంస్థలు అంతర్వేది రథాాన్ని కాల్చేసిన సంఘటనపై ఆగ్రహం  వ్యక్తం చేస్తున్నాయి.
ఇప్పటివరకు రథం కాల్చిన నిందితులు లెవరో  పట్టుకోలేకపోయిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, కేసు విచారణను సిబిఐ కి అప్పగించి చేతులు దులుపుకుంది.
ఇంతలో సోషల్ మీడియా భగ్గుమంది. జగన్ మోహన్ రెడ్డి గారి క్రైస్తవ మత విశ్వాసాల మీద కొన్ని వేదికలు  విస్తృత ప్రచారం చేస్తుంటే మరో పక్క జగన్ హిందూ సానుభూతి ఏమిటో చెప్పే ప్రయత్నం జరుగుతూ ఉంది.
“జగన్ ఫర్ హిందూస్ #jagan-for-hindus  , ‘హిందూస్ విత్ జగన్ ‘ #HINDUS WITH JAGANA) అని సోషల్ మీడియా లో ప్రచారాన్ని వైస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఉధృతం చేసారు.

 

 

 

నిజమే మరి వారం రోజుల క్రితం అంతర్వేదిలో శ్రీ నృసింహ స్వామి గుడిలో రథం తగలబడింది. దుండగులు ఎవరో పోలీసులు కనిపెట్టలేకపోయారు. పాపం వాళ్ళేమి చేస్తారు. సర్కార్ వారి ఆజ్ఞలు పాటించడం తప్ప. హిందూ దళాలు ఆందోళన వ్యక్తం చేసిన రోజునే సమీపంలో వున్న చర్చిపై దాడి చేసిన కొంత మందిని అంటే 39 మందిని గుర్తించి ఒకరోజు పోలీస్ స్టేషన్ల లో కూర్చోపెట్టుకుని ఆనక రాజమండ్రి సెంట్రల్ జైలు కి పంపించారు.  వాళ్లంతా 14 రోజుల పాటు అక్కడే ఉండాలి. ఈలోగా బెయిల్ వస్తే సరి లేదంటే మరోసారి జైలు జీవితం పొడిగింపు. ఇది మరో కధ .
పది రోజులైనా రథం కాల్చిన వ్యక్తులు ఆచూకి లేదు. కేసు మాత్రం విచారించాల్సిన బాధ్యతను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) కి అప్పగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఏపీ డీజీపీ ఒక లేఖ , ఆ వెంట జీవో జారీ అయిపోయాయి. ఇక బంతి కేంద్రం చేతిలో పడింది.
అయితే ఈ పది రోజుల్లో జగన్ ప్రభుత్వం పై హిందూ వ్యతిరేక ముద్ర పడిపోయింది. తాను సెక్యులర్ రూలర్ అని నిరూపించులోవాల్సిన బాధ్యత జగన్ పై పడిందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని సీనియర్ శాసనసభ్యుడు ఒకరు అన్నారు.

 

అంతర్వేది సంఘటనతో ఆత్మ రక్షణలో పడిన జగన్ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జిలు యమ అర్జెంటుగా జగన్ ఫర్ హిందూస్ (jagan for hindus) అంటూ సోషల్ మీడియా లో కొంతమంది వ్యక్తుల పేరిట ప్రచారం ప్రారంభించారు. దేశంలో వున్న హిందూ దేవాలయాల చిత్రాలన్నీ వేసి వాటికి జగన్ మోహన్ రెడ్డి నమస్కారం చేస్తున్నట్లు ఫొటోషాపింగ్ చేసి ప్రచారం ఉధృతం చేసారు.

ప్రముఖ  స్వామీజీలు జగన్ మోహన్ రెడ్డి ని ఆశీర్వదిస్తున్నట్లు ఫోటోలను కూడా జత చేసారు. గతంలో రుషికేశ్ లో విశాఖ శారదా పీఠం స్వామిజీ స్వరూపానంద మహాస్వామి దగ్గర వుండి జగన్ చేత గంగ స్నానం చేయించినప్పటి చిత్రాలు కూడా ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. ఇవన్నీ చూసిన నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణ రాజు మరొక అడుగు ముందుకేసి తిరుమలలో జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన సతీమణి శ్రీమతి భారతిని వెంట తీసుకెళ్లి దంపతులిద్దరూ శ్రీ వారికి పట్టువస్త్రాలు సమర్పిస్తే బావుంటుందని సూచనలాంటి సలహా ఇచ్చారు.
ఇప్పటివరకూ జగనన్న ఏ హిందూ ఆలయానికి వెళ్లినా ఒంటరిగానే వెళ్లారే తప్ప, భార్యతో కలసి వెళ్లలేదు. గతంలో సీఎంలు బ్రహ్మోత్సవాలకు వెళ్లినా, సతీసమేతంగానే వెళ్లే సంప్రదాయం ఉండేది. కానీ జగన్ భార్య భారతి మాత్రం ఆలయాల్లో జగన్‌తో కలసి వెళ్లకపోవడం ప్రస్తావనార్హం. పట్టువస్త్రాలను సతీసమేతంగానే సమర్పించాలన్నది శాస్త్రం చెబుతోంది. బహుశా రఘురామ రాజు ఈ ధర్మశాస్త్రం గుర్తించిన తర్వాతనే, బ్రహ్మోత్సవాల్లో సీఎం భార్యతో కలసి వెళ్లాలని సూచించి, ఆయనను ధర్మసంకటంలోకి నెట్టి మత విశ్వాసాన్ని వెలుగులోకి తెచ్చినట్లు కనిపిస్తోంది. అంతటితో ఆగని రఘురామ కృష్ణ రాజు ఇతర మతస్తుల పండుగలకు డబ్బులిస్తున్న జగన్ సర్కారు, హిందువుల పండుగలను నిర్లక్ష్యం చేస్తున్నారని, హిందూ మతాన్ని నిర్లక్ష్యం చేసి, ఇతర మతాలను ప్రోత్సహిస్తున్నారని చేసిన ఆరోపణ చర్చనీయాంశమయింది. మరి జగన్ గారు ఈ సలహాను పాటించి హిందూ మతం పై నమ్మకాన్ని , విశ్వాసాన్ని వ్యక్తం చేస్తారా ?అన్న ప్రశ్న అన్ని వర్గాలనుంచి వస్తోంది . గతంలో ముఖ్యమంత్రి హోదాలో తిరుమల వెళ్లిన వారిలో జగన్ మోహన్ రెడ్డి ఒక్కరే , ఒంటరిగానే శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అఫ్ కోర్సు .ఆయన పక్కన బాబాయి సుబ్బారెడ్డి, పిన్ని కూడా వున్నారనుకోండి. అది వేరే విషయం. .
గతంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తండ్రి వై.ఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా తిరుమలకు వెళ్లి శ్రీవారికిపట్టు వస్త్రాలు ఇచ్చినప్పుడు ఇటువంటి వివాదాలు తలెత్తలేదు.
జగన్ స్వతహాగా క్రైస్తవుడయినా హిందూ ఆలయాలకు వెళుతుంటారు. అయితే జగన్ ఒక్కరే దైవ దర్శనం చేసుకుంటారు. ఆయన తల్లి కానీ, భార్య కానీ ఎప్పుడూ హిందూ దేవాలయాలకు వెళ్లిన దాఖలాలు లేవు. అయితే జగన్ మోహన్ రెడ్డి తన తాడేపల్లి ఇంటి గృహప్రవేశం చేసినప్పుడు హిందూ దేవుళ్ళ ఫోటోలు పెట్టినట్లు వార్తలు వచ్చాయి. ముఖ్య మంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి వెలగపూడి సచివాలయానికి వచ్చినప్పుడు అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి ఎల్.
.వి ఇతర పీఠాల నుంచి (కంచిపీఠం) పూజార్లను రప్పించి జగన్ రెడ్డికి ఆశీర్వచనం ఇప్పించారు.
తిరుమల నుంచి డాలర్ శేషాద్రి తదితరులు వచ్చి వేదం మంత్రాలతో ఆశీర్వచనాలు ఇచ్చారు. ‘అన్ని మతాలను సమానంగా ఆదరించే’..గుణం తమ నాయకుడికి ఉందని వైస్సార్సీపీ ప్రచారం చేసుకుంటుంది. ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం కరోనా సమయంలో పాస్టర్లకు  5 వేలు చొప్పున ప్రభుత్వం నుంచి సహాయం చేసింది. ఆలయాల్లో అర్చకులకు, మసీదుల్లో వుండే వారికీ ఇచ్చినా అధిక శాతం పాస్టర్ల కెళ్లిందని ప్రచారం జరిగింది.
జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు బైబిల్ గ్రంధం టేబుల్ పైనే  పెట్టారన్న ప్రచారం జరిగింది. సర్వమత ప్రార్ధనలు చేయించారు.  విశాఖ శారదా పీఠం స్వామిజీ రెండు సార్లు తన పీఠంలో పూజలు కూడా చేయించారు. జగన్ సీఎం కాకముందు, అయిన తర్వాత కూడా తిరుమలకు వెళ్లారు. విపక్షంలో ఉన్నప్పుడు తనకు హిందూమతంపై విశ్వాసం ఉందని, అన్యమతస్తులు ఇచ్చే డిక్లరేషన్ ఇవ్వకపోవడం విమర్శలకు దారితీసింది. దీనిని అప్పట్లో విశాఖ శారదా పీఠం స్వామిజీ స్వరూపానంద తప్పుపట్టారు. జగన్మోహన్‌రెడ్డి ప్రత్యేకంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిన పనేమిటని, శిష్యుడి పక్షాన మాట్లాడారు.
అది వేరే విషయం.! ఇహ ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఎలా వెళతారోనని సోషల్ మీడియాలో నెటిజన్లు , హిందూ వాదులు ఎదురు చూస్తున్నారు.
చూడాలి మరి ఏం జరుగుతుందో  ?

(Prasada VS Goshala is a senior political analyst from Andhra Pradesh and editor Mirror Today.  The views expressed in this post are his own and do not necessarily reflect the official policy of the trendingtelugunews.com)