ప్రధాని మోడీ ఫ్యూడల్ లార్డ్, కాంగ్రెస్ కంటే ఎక్కువ తప్పులు: టిఆర్ ఎస్ ఎంపి

తెలంగాణ రాష్ట్ర సమితి మొదలు పెట్టిన మోదీ వ్యతిరేక క్యాంపెయిన్ కు చెవేళ్ల లోక్ సభ సభ్యుడు డాక్టర్ రంజిత్ రెడ్డి శృతి కలిపారు. మొదటి దఫా గత ఎన్నికల్లో లోక్ సభకు ఎంపికయిన రంజిత్ రెడ్డి ప్రధాని మోదీ మీద విరుచుకు పడ్డారు. ప్రధాని మోదీ ఫ్యూడల్ లార్డ్ లాగావ్యవహరిస్తున్నారని, కాంగ్రెస్ కంటే ఘోరమైన తప్పులు చేస్తున్నారని విమర్శిస్తూ, నిధుల కేటాయింపులో తెలంగాణ మీద  వివక్ష చూపిస్తున్నారని నిప్పులు చెరిగారు. పార్లమెంట్ లో మోదీని నిలదీస్తామని హెచ్చరించారు.
తాను ఎంపి అయి సంత్సరకాలం పూర్తైన సందర్భంగా చెవెళ్ల నియోజకవర్గం ప్రగతి నివేదన ప్రజల ముందుంచారు.ప్రజాసేవ చేసే ఒక గొప్ప అవకాశం, అది నాకు దక్కడం అదృషం, ఈ అవకాశం ఇచ్చిన సీఎం కెసిఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ మోదీ మీద విమర్శలు గుప్పించారు.
డాక్టర్ రంజిత్ రెడ్డి ఏమన్నారో చూడండి;
మధ్యప్రదేశ్ ఎన్నికల కోసం లాక్ డౌన్ వాయిదా వేశారు. అదే సమయంలో వలస కార్మికులు గమ్యస్థానాలకు చేరే అవకాశం ఇవ్వలేదు. వారిని వూర్లకు తరలించే  ప్రయత్నం కూడా చేయలేదు. ప్రధాని తీయని మాటలు చెప్తున్నారు తప్ప పనులు మాత్రం చేయడం లేదు.
కొవిడ్ వల్ల దేశంలో 10 లక్షల 50 వేల కోట్ల నష్టం జరిగింది. కానీ
20 లక్షల కోట్లు ప్యాకేజీ అని చెప్పి 2 లక్షల కోట్లు మాత్రమే డబ్బు రూపంలో అందిస్తున్నారు.  హెలికాప్టర్ మనీ అని కెసిఆర్ గారు చెప్తే చెయ్యలేదు. మోడీ గారు ఇన్ని సార్లు విడియో కాన్ఫరెన్స్ పెట్టి వూరకే ఉపన్యాసాలిస్తున్నారు తప్ప సమస్య తీర్చే ప్రయత్నం చేయడం లేదు. రాష్ట్రాలకు చేయూత అందించడం లేదు.
FRBM (Fiscal Responsibility and Budget Management Act 2003) లోన్ పరిమితి పెంచకుండా రాష్ట్రాల మీద నానా రకాల ఆంక్షలు పెడుతున్నారు. కానీ కేంద్రం మాత్రం ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటూ పోతున్నారు. అప్పులు ఇష్టం వచ్చినట్టు తెచ్చుకొనే వెసులు బాటు తెచ్చుకున్నారు తప్ప రాష్ట్రాలకు న్యాయం చేయడం లేదు. 6 రాష్ట్రాలకు 56 శాతం నిధులు ఇచ్చి మిగతా రాష్ట్రాల అందరికీ 44 శాతం మాత్రమే కేటాయించి వివక్ష చూపిస్తున్నారు.వీటన్నిటి మీద పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వా న్ని నిలదీస్తాం.
నిజామాబాద్ బిజెపి సభ్యుడు ధర్మపురి అరవింద్ ముందు రాష్ట్రం అభివృద్ది గురించి మాట్లాడాలి. రాష్ట్రానికి కేంద్రం నుండి తెచ్చే నిధులు గురించి కొట్లాడాలి.కేంద్రం నుండి తీసుకు వచ్చే నిధులు తీసుకురండి. అవి పక్కన పెట్టీ అభివృద్ది చేస్తున్న రాష్ట్రం మీద విమర్శలు చేయడం తగునా?
అభివృద్ది అందుబాటు అనే నినాదం తో ప్రజల ముందుకు వచ్చాను. అదే కొనసాగిస్తున్నాను.
మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి., నియోజక వర్గ ఎమ్మెల్యేలు అందరూ పూర్తి స్థాయిలో సహకరించారు. మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధితో రాష్ట్ర అభివృద్ది కోసం పార్లమెంట్ లో తెలంగాణ వాయిస్ ని వినిపిస్తున్న.
కెసిఆర్ గారు ప్రగతి నివేదన సభ పెట్టీ ప్రభుత్వం చేసిన పని చెప్పారు. అదే విధంగా ఈ సంవత్సరం పాటు ఎం చేశామో ప్రజల ముందుంచుతున్నాను.
పాలమూరు రంగా రెడ్డి ప్రాజెక్ట్ పూర్తీ చేస్తాము.ఎంఎంటీఎస్ ను వికారాబాద్ కు ఎక్స్టెన్షన్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము.ఫార్మా సిటీ గురించి పార్లమెంట్ లో ప్రస్తావించాను. ఐటీ విస్తృతికి కృషి చేస్తున్నాం.అమెజాన్ డాటా సెంటర్ ను తీసుకొని వచ్చాము. కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఉద్యోగ కల్పన ప్రధాన లక్ష్యం గా పని చేస్తున్నాం.
నా తపన, ఆరాటం చేవెళ్ల నియోజక అభివృద్ది. చేయాల్సింది చాలా ఉంది.బిజినెస్ కంటే ప్రజాసేవలో సంతోషం ఎక్కువ ఉంది.