‘సింగిరి కోన’లో ట్రెకింగ్ : దోసిళ్ల కొద్ది ప్రకృతి సౌందర్యం ఆస్వాదించవచ్చు…

(భూమన్)
చిత్తూరు జిల్లాలో ఉన్న కోనలన్నీ తమిళలకు తెలిసినంతగా తెలుగువారికి తెలియకపోవడం ఆశ్చర్యమే. అన్ని కోనలకు ఎక్కువ మంది తమిళులే.
మేము చాలా కాలంగా ఆ చుట్టు పక్కల అనేక ట్రెక్కింగ్ లు చేసినాము గాని దీనిపేరైనా వినలేదు.అట్ల ఉంది మన సమాచారం విప్లవం.
సింగిరి కోన ప్రకృతి ప్రియులకు అద్భుత దృశ్య కావ్యం. ఆ కొండల నడమ అడవుల వెంట పోతుండడమే ఒక మహావిశిష్ట అనుభవం.
మనమందరం ప్రకృతిబిడ్డలం కదా! తిరిగి అక్కడికి చేరుకుంటే గాని ఆ స్పర్షామృతం ఏమిటో అనుభవించలేం. సింగిరి కోన ‘సింగిరిపెరుమాళ్ ’  కోన అని అంటారు. ఇది నారాయణ వనం నుంచి ఐదు కి.మీ దూరాన ఉంది.
నారాయణ వనం పుత్తూరుకూ ఐదు కి.మీ దూరం. అక్కడి నుంచి కీల గ్రామం వరకు సిమెంట్ రోడ్డు, అక్కడి నుంచి నాలుగు కి.మీ దూరం మట్టిరోడ్డులో ప్రయాణించవలసి ఉంటుంది. రహదారి బాగుంది. మాకు ఎవరో తప్పుడు సమాచారం ఇవ్వటం వల్ల స్కూటర్లలో తిరుపతి నుంచి నలభై కి.మీ ప్రయాణం చేసినాము.అయితే, అక్కడి కార్లు నేరుగా పోయేంత బాగా రోడ్డు ఉంది.
అయితేనేమి, ఆ మట్టి రోడ్డులో స్కూటర్లో ప్రయాణించడమే మంచే అయింది. రోడ్డు వెంట చిరుజల్లు, పక్కనే పిల్ల కాలువల సందడి ఇరువైపుల అద్భతమయిన కొండలు, ఆకొండలు  పట్టు చీరలకు నగిషీలద్దినట్లుగా గొప్పఆకర్షణతో మిలమిలా మెరుస్తున్నాయి. సానువులంతా  పచ్చపచ్చటి అడవులో కలకలలాడుతున్నాయి. ఆపక్క ఈ పక్క తోవలకు ట్రెకింగ్  ట్రెయిల్స్ అద్భుతమయిన ఆహ్లాదకరమయిన ప్రయాణంతో కోన చేరినాము.

Like this story? Share it with friends!

అక్కడ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం చూశాం.ఉచిత అన్నదాన సౌకర్యం, ఎదురుగా జలపాతం,గుండం ఉన్నాయి. ఈ దేవాలయాన్ని నారాయణ వనం పరిపాలకులు నాలుగువందల యేళ్ల క్రితం కట్టించినట్లుగా అక్కడి పూజారులు చెప్పినారు. అక్కడి తీర్థం పేరు బాలతీర్థం. సంవత్సరం పొడుగుతా  నీళ్లు పారుతూనే ఉంటాయట. జలపాతం చాలా పైనుండి వస్తున్నది.
మేం వారిని అభ్యర్థించి శిఖరభాగానికి నడకమొదలుపెట్టినాము నలుగురం. దారి తెన్నులేదు. మొండిగా పైభాగానికి చేరి అచట ప్రకృతి దృశ్యాన్ని కనులారా గాంచి దిగ్భ్రకు గురయినాము. ఏమా సౌందర్యం? ఎంతటి అపురూప దృశ్యములవి. చూసినంత దూరం పచ్చటి పడుచవైభోగమే ఆ ప్రకృతి.
కిందికి దిగేటప్పుడు వచ్చిన దారితప్పోయి జారుకుంటూ పాక్కుంటూ ఇదొక అనుభవంగా ముచ్చటించుకుంటూ మోస్ట్ అడ్వెంచరస్ అండ్ హార్డ్ ట్రెక్కింగ్ అని  చెప్పుకుంటూ మమ్మల్ని మేము అభినందించుకుంటూ గిలిని జయించి, గిరుల ముద్దాటన మధ్యన ఆచిరు జలపాతం కింద కూర్చోగానే గొప్ప రిలీఫ్ . అనుభవించిన వారికేతెలుస్తుంది. ఆఅనుభూతి.
రండి, మీరు, మీరందరూ రండి. ప్రకృతిని మనసారా అస్వాదించండి. ప్రకృతి మీలో ఆరోగ్యం ప్రసాదిస్తుంది. దోసిళ్లారా స్వీకరిద్దురు రండి. సింగిరికోన అందచందాలలో విహరిద్దురు గాని రండి!

MORE TREKKING ON SESHACHALM HILLS, TIRUPATI, ANDHRA PRADESH, INDIA