అన్న క్యాంటీన్లు ఉంటే వలస కూలీలకు భోజనం దక్కేది: చంద్రబాబు ఆవేదన

రాష్ట్రంలో వలస కార్మికుల బాధలు చూస్తే కలిచివేస్తోంది. కాలినడకన వందల కిమీ నడిచి వెళ్తున్నారు. వాళ్లకు తిండికూడా పెట్టలేని దుస్థితి రాష్ట్రంలో తెచ్చారని మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సమయంలో అన్న క్యాంటీన్లు ఉండి ఉంటే వారికి భోజనం దక్కి ఉండేదని చెబుతూ  క్యాంటీన్లు మూసేశాడు, తాను తిండిపెట్టేలేకపోతున్నాడని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
అన్న కేంటిన్లు ఉంటే ఉంటే వాళ్ల ఆకలి తీర్చేవి, కడుపు నింపేవి. రోడ్డు ప్రమాదాల్లో అనేకమంది మృతి చెందారు. చంద్రన్న బీమా ఉంటే రూ10లక్షలు బాధితులకు అంది వుండేదని అన్నారు.
తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు  చంద్రబాబు నాయుడు ఈ రోజు టిడిపి మండల అధ్యక్షులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయన చేసిన ప్రసంగం:
వలస కార్మికులు వందల కిమీ కాలినడకన నడిచివెళ్లడం, కాళ్లకు బొబ్బలెక్కి చిన్నారుల బాధలు, భార్యాభర్తలు సైకిళ్లపై వందల కిమీ ప్రయాణం, బిడ్డలను భుజాన ఎత్తుకుని నడిచివెళ్లడం గతంలో ఎన్నడూ చూడని కష్టాలు ఇవి.
వలస కార్మికులకు నాగాలాండ్ ప్రభుత్వం రూ10వేలు ఇస్తామని ప్రకటించింది. ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే రూ 5వేలు అందజేసింది. కేంద్రం ఇచ్చేదానికి అదనంగా అన్ని రాష్ట్రాలు అదనపు సాయం. కేరళ రూ20వేల కోట్ల ప్యాకేజి ఇచ్చింది. 17రకాల నిత్యావసరాలు ఇంటింటికి ఇచ్చింది. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదనపు సాయం శూన్యం. కేంద్రం ఇచ్చేదానిని తామే ఇచ్చామని చెప్పడం గర్హనీయం.
కేంద్రం ఉదారంగా స్పందించి 3నెలల రేషన్ ఉచితంగా ఇచ్చింది. మరో 2నెలల రేషన్ ఇస్తానంది. వలస కార్మికుల రైళ్ల ఖర్చు 85% కేంద్రమే పెట్టుకుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదు. వైసిపి నాయకులు ప్రచారం కోసం తాపత్రయబడ్డారే తప్ప పేదలను ఆదుకుంది శూన్యం.
ఏడాది వైసిపి పాలనలో చరిత్రలో కనీవినీ ఎరుగని తప్పులు చేశారు. ఇన్ని తప్పులు చేసిన ప్రభుత్వాన్ని ఎప్పుడూ, ఎక్కడా చూడలేదు. వైసిపి దౌర్జన్యాలకు హద్దు, అదుపు లేకుండా పోయాయి. టిడిపి నాయకులపై అక్రమ కేసులు పెట్టారు. ప్రతిపక్షాలపై కేసులు పెట్టారు. సోషల్ మీడియా కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టారు. ఇప్పుడు ప్రజలపై, ఉద్యోగులపై కూడా దాడులు చేసే పరిస్థితి వచ్చారు. విశాఖలో మృతుల కుటుంబాలపై కూడా అక్రమ కేసులు పెట్టారు.
ప్రకాశం దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు రూ25లక్షల పరిహారం ఇవ్వాలి:
ప్రకాశం జిల్లా దుర్ఘటనలో మృతులైన దళిత, రైతుకూలీ కుటుంబాలకు రూ25లక్షలు పరిహారం అందించాలి.
ప్రభుత్వ సహకారం లేక తీవ్ర నష్టాల్లో రైతులు కూరుకుపోయారు. అరటి తోటలు దున్నేయడం, కూరగాయలు రోడ్లపై పారబోయడం మున్నెన్నడూ లేదు.
అరటి,మామిడి, బత్తాయి, బొప్పాయి, పుచ్చ ఇతర పండ్ల ఉత్పత్తులను రాష్ట్ర ప్రభుత్వమే కొని, పేదలకు చౌకధరలకు అందిస్తే, అటు రైతులకు, ఇటు పేదలకు ఎంతో ప్రయోజనకరంగా ఉండేది.
భరోసా పేరుతో ఒక్కో రైతుకు రూ 78,500 మోసం చేశారు..?
ఏడాదిలో 900మంది రైతుల ఆత్మహత్యలు వైసిపి నిర్వాకాలకు నిదర్శనం. టిడిపి తెచ్చిన ‘‘అన్నదాత సుఖీభవ’’ రద్దు చేశారు. నాలుగైదు కిస్తీల రుణమాఫీ ఎగ్గొట్టి మోసగించారు.
రైతు భరోసా కింద అదనంగా రూ17వేలు ఇస్తున్నట్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అబద్దాల ప్రకటన చేసింది. కేవలం 5ఏళ్లకు ఒక్కో రైతుకు ఇస్తోంది రూ37,500మాత్రమే.
ఒక్కో రైతుకు ఏడాదికి రూ6వేలు ఎగ్గొట్టడం ‘‘రైతు భరోసా’’ ఎలా అవుతుంది..? అంటే 5ఏళ్లకు రూ30వేలు ఎగ్గొడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి మాట మార్చారు, మడమ తిప్పారు.
టిడిపి ప్రభుత్వమే ఉంటే ‘‘అన్నదాత సుఖీభవ’’ కింద ఏడాదికి రూ15వేల చొప్పున ఒక్కో రైతుకు రూ 75వేలు వచ్చేవి. నాలుగు,ఐదు రుణ మాఫీ కిస్తీలు రూ 40వేలు వచ్చేవి, అంటే ఒక్కో రైతుకు మొత్తం రూ లక్షా 15వేలు వచ్చేవి. ఇప్పుడీ వైసిపి మోసం వల్ల ఒక్కో రైతు రూ 78,500 నష్టపోయారు.
భూకొనుగోళ్ల పేరుతో వైసిపి భారీ కుంభకోణాలు:
విచక్షణారహితంగా మడ అడవుల నరికివేశారు. తీర ప్రాంతంలో పర్యావరణానికి తీరని చేటు. అన్నివర్గాల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత.
తూర్పుగోదావరి జిల్లా ఆవ భూముల్లో భారీ అవినీతికి పాల్పడ్డారు. 14అడుగుల పల్లంలో ఉండే భూములు, 10రెట్ల ఎక్కువ ధరకు విక్రయాలు. వాటిని మళ్లీ 14అడుగుల మెరక చేయడానికి రెట్టింపు నిధులు కావాలి. ఇళ్లస్థలాల ముసుగులో భూ కొనుగోళ్లలో వైసిపి స్కామ్ లు.
భూముల కొనుగోళ్ల పేరుతో భారీ కుంభకోణాలు. ప్రతి నియోజకవర్గంలో వైసిపి ల్యాండ్ మాఫియా పేట్రేగింది. ప్రపంచంలో ఎక్కడా లేని భూకుంభకోణాలు చేస్తున్నారు. ఎకరం రూ 7లక్షల భూమిని, రూ70లక్షలకు కొని వాటాలు వేసుకుని పంచుకుంటున్నారు. పేదల అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కున్నారు.
మొత్తం రాష్ట్రాన్నే హోల్ సేల్ గా వైసిపి అమ్మేస్తోంది:
బిల్డ్ ఏపిని ‘‘సోల్డ్ ఏపిగా’’ మార్చారు. మొత్తం రాష్ట్రాన్నే వైసిపి హోల్ సేల్ గా అమ్మేస్తోంది. పేదల పేరుతో వందల కోట్ల లూటీకి పాల్పడ్డారు.
గుంటూరులో ఆసుపత్రి విస్తరణకు, మార్కెట్ ఏర్పాటుకు టిడిపి ప్రభుత్వం కేటాయించిన భూములు అమ్మేస్తున్నారు. విశాఖలో పోలీసు క్వార్టర్స్ అమ్మేస్తున్నారు.
కలెక్టర్ కార్యాలయాలు, ఆసుపత్రులు, మార్కెట్ స్థలాలు, పోలీస్ క్వార్టర్స్ భూములు అమ్మే దురాలోచన దేశంలో ఎవరూ చేయలేదు. వైసిపి మాఫియా విలువైన భూములను కారుచౌకగా కొట్టేసే పథకమే ఈ బిల్డ్ ఏపి పథకం.
ఉన్న భూములను మార్కెట్ వ్యాల్యూకు అమ్మడం, మళ్లీ కొనాలంటే రెండున్నర రెట్లు (250%) అధికంగా చెల్లించడం ద్వారా రాష్ట్ర ప్రజలపై మోయలేని భారం వేస్తున్నారు.
వర్చువల మహానాడు ఆన్ లైన్ లోనే నిర్వహణపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఆన్ లైన్ లోనే మహానాడు తీర్మానాలపై చర్చ .
ఈ సమావేశంలో వివిధ మండలాల టిడిపి అధ్యక్షులు, రాష్ట్ర పార్టీ, జిల్లా పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.