బయట లాక్ డౌన్, లోన యూనివర్శిటీల్లో వైసిపి దందా: కూన రవికుమార్

(కూన రవికుమార్,  మాజీ విప్)
ఆంధ్రప్రదేశ్ లో విశ్వ విద్యాలయాల పాలకమండళ్లను రాజకీయ పాలకమండళ్లుగా మార్చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కింది.
ఓవైపు లాక్ డౌన్ కొనసాగుతుంటే గుట్టుచప్పుడు కాకుండా మార్చి 23వ తేదీన పాలకమండళ్ల నియామకం చేపట్టారు. 14 యూనివర్సిటీల్లో ఒకేసారి ఎలాంటి స్క్రీనింగ్స్ లేకుండా తన అనుయాయులకు పాలకమండళ్లు కట్టబెట్టారు. విశ్వ విద్యాలయాల పాలకమండళ్లను అవినీతిమయం, అరాచకమయం చేశారు.
14 యూనివర్సిటీల్లో 118మందిని నియమించగా అందులో 70మంది ఓసీలను నియమించారు. వారిలో 46 మంది రెడ్డి సామాజిక వర్గం వారే. అన్నింట్లో ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తూ ఏపీని రాబందుల రాజ్యంగా మార్చేశారు.
రాష్ట్రంలోని బీసీలు, దళితులు , గిరిజనులు, ఓసీల్లోని కాపు, కమ్మ, బ్రాహ్మణులకు ఎటువంటి ప్రాతినిధ్యం లేకుండా రెడ్డి సామాజిక వర్గంతోనే అన్ని పదవులు భర్తీ చేస్తున్నారు.
విద్యా ప్రమాణాలను మెరుగుపరిచే వ్యక్తులను నియమించాల్సిన తరుణంలో రాజకీయ ప్రయోజనాలు ఆశించి తన సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇచ్చి ఏపీలో విద్యావ్యవస్థను జగన్మోహన్ రెడ్డి నాశనం చేస్తున్నారనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంది?
ప్రభుత్వ నిబంధనల ప్రకారం గవర్నర్ ఆధ్వర్యంలో పాలకమండళ్ల నియమాకం జరగాలి. కానీ కేవలం విజయసాయిరెడ్డి ప్రోద్భలంతోనే నియామకాలు జరిగాయి. ఆఖరుకు విద్యావ్యవస్థలోనూ రెడ్డి రాజ్యాన్ని తీసుకొస్తున్నారు.
కాకినాడ జేఎన్ టీయూలో విజయసాయిరెడ్డి సూచించిన వారినే నియమిస్తున్నట్టు ఏపీ ఉన్నతవిద్యామండలి చైర్మన్ హేమచంద్రా రెడ్డి తన నోట్ లో పొందుపరిచారు.
మేధావులకు నెలవుగా ఉన్న ఆంధ్రా యూనివర్సిటీని కూడా విజయసాయి రెడ్డి భష్టు పట్టించారు. తన అనుచరులను ఆంధ్రా వర్సిటీ పాలనమండలిలో నింపేశారు. ప్రజలు ఒకసారి ఆలోచించాలి. విద్యార్థులు తిరగబడాలి.
అధికార పార్టీ ప్రతి అంశాన్ని, సంఘటనను రాజకీయం చేసి వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోంది. ఏపీలో దాదాపు 500 పదవుల్లో రెడ్లే ఎక్కువగా ఉన్నారు. రాష్ట్రంలో ఇతర కులాల్లో విద్యావేత్తలు లేరా? ఎందుకూ పనికిరాని వారిని పాలకమండళ్లలో నియమించి విద్యావ్యవస్థను జగన్ ప్రభుత్వం నాశనం చేసింది. రెడ్డి వ్యవస్థను తీసుకొచ్చి అన్ని రంగాల్లో దోచుకుంటున్నారు.
పదవుల నియామకాల్లో ఇతర కులాలకు 25 శాతం మాత్రమే చోటు కల్పిస్తున్నారు. ఒకే సామాజిక వర్గాన్ని అందలం ఎక్కించి వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. విద్యాలయాల గౌరవాన్ని దిగజార్చుతున్నారు. లాక్ డౌన్ సమయంలో ఇటువంటి జీవోలు ఇచ్చే అధికారం మీకు లేదు. తక్షణమే పాలకమండళ్ల నియామకాలను రద్దు చేయాలి. పాలకమండళ్ల నియామకంలో జరిగిన అవినీతి, ఆశ్రితపక్షపాతంపై మేము గవర్నర్ కు ఫిర్యాదు చేస్తాం. అర్హులను నియమించకుండా ఏపీ తన జాగీరులా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపైనా గవర్నర్ కు ఫిర్యాదు చేస్తాం.
విద్యా ప్రమాణాలను కాలరాస్తున్నారు
( కూన రవికుమార్ తెలుగుదేశం నాయకుడు, మాజీ విప్ ఈ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పిన  విషయాలు)