వైసిపి బిసి గర్జనపై మంత్రి యనమల సంచలన వ్యాఖ్యలు

ఆదివారం ఏలూరులో జరిగిన వైసీపీ బీసీ గర్జనపై మీడియా ముందు స్పందించారు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు. బీసిలపై జగన్ కపటప్రేమ అంటూ మండిపడ్డ యనమల బిసిలపై జగన్మోహన్ రెడ్డి కొంగజపం చేస్తున్నారు అన్నారు. ఇంకా ఆయన ఏం మాట్లాడారో కింద ఉంది చదవండి.

బీసిలను ఫ్యాక్షనిజానికి బలిచేసింది రాజారెడ్డి కుటుంబం. బిసిల ఆస్తులు,తోటలు,పంటలు నాశనం చేశారు. బీసిలపై అకృత్యాలకు పాల్పడింది వీళ్లే. జగన్ తాత బీసిలను బతకనివ్వలేదు. జగన్ తండ్రి బిసిలను జైళ్లలో పెట్టించారు. కడప అభివృద్ధి చెందక పోవడానికి కారణం రాజారెడ్డి కుటుంబమే. బీసిలు నిలదొక్కుకుంటే తిరగబడతారనే భయం. ఫాక్షన్ లో ఇరికించి బీసిలను జైళ్లకు పంపింది వీళ్లే. పేద కుటుంబాలను ముఠాకక్షలకు బలిచేశారు. ఈ రోజు జగన్ పదవీకాంక్షతో కొంగజపం ప్రారంభించారు అని ఆగ్రహం వ్యక్తం చేసారు యనమల.

బీసిలు జగన్ కొంగజపాన్ని నమ్మరు. తండ్రి అధికారంలో ఉండగా బిసిలపై జగన్ మాట్లాడలేదు. ఎంపిగా ఏనాడూ బిసిల గురించి జగన్ నోరు తెరవలేదు. తన ఆస్తులు పెంచుకోడానికే ఆనాడు జగన్ శ్రద్ధ చూపాడు. బిసిలకు ఆర్ధికంగా మేలు చేసే శ్రద్ద జగన్ కు లేదు. ఫ్యాక్షన్ రాజకీయం చేసేవాళ్లు బిసిలకు న్యాయం చేస్తారా..? ఫ్యాక్షన్ కుటుంబాన్ని ఎవరు నమ్ముతారు..? అంటూ నిలదీశారు.

తెలుగుదేశంపార్టీ వచ్చాకే దేశంలో బిసిల సంక్షేమము వచ్చింది. టిడిపికి ముందు 35ఏళ్లు బిసిలకు తీవ్ర అన్యాయం జరిగింది. టిడిపి రాకముందు దేశంలో, ఏపిలో బిసిలకు ప్రభుత్వ ఫలాలు అందలేదు. స్వాతంత్ర్యం వచ్చాక తొలి 35ఏళ్లు బీసిలు ఎంతో నష్టపోయారు. కేంద్ర పథకాలు, రాష్ట్ర పథకాలు బిసిలకు అందలేదు. టిడిపి వచ్చాకే బిసిలకు ప్రభుత్వ లబ్ది అందింది. ఎన్టీఆర్ పార్టీ పెట్టాకే బిసిలకు గుర్తింపు, సంక్షేమం లభించింది. ఇళ్లపట్టాలు, పక్కాఇళ్లలో బీసీలకు వాటా ఎన్టీఆర్ ఘనతే. వాటా పెంచి బిసిల సంక్షేమాన్ని చంద్రబాబు కొనసాగిస్తున్నారు.

చట్టసభల్లో రిజర్వేషన్లపై 2సార్లు కేంద్రానికి తీర్మానం పంపాం. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వాలు అమలు చేయలేదు. మండల్ కమిషన్ సిఫారసుల అమలు ఘనత టిడిపిదే. నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఎన్టీఆర్ ఉన్నప్పుడే అమలు. అప్పటిదాకా మండల్ నివేదికను బుట్టదాఖలు చేశారు. ఉద్యోగాల్లో బీసిలకు వాటా వచ్చింది టిడిపి వల్లే. సంక్షేమ పథకాల్లో బిసిలకు వాటా టిడిపి వల్లే కలిగింది అని పేర్కొన్నారు యనమల.

బిసిలను టిడిపికి దూరం చేసేందుకు 3పార్టీల కుట్రలు మొదలయ్యాయి. వైసిపి,బిజెపి,టిఆర్ ఎస్ కుట్రలను బిసిలే తిప్పికొడతారు. కుట్రల కూటమి హైదరాబాద్ లో తిష్టవేసింది. బిజెపి, టిఆర్ ఎస్, వైసిపి 3పార్టీలు కుట్రల కూటమిగా మారాయి.
హైదరాబాద్ లో మకాం వేసి ఏపిపై కుట్రలు చేస్తున్నారు. టిడిపి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలు చేస్తున్నారు. కొత్త రాష్ట్ర నిర్మాణాన్ని అడ్డుకునే కుట్రలు. పేదల సంక్షేమాన్ని అడ్డుకునే కుతంత్రాలు చేస్తున్నారు.

5ఏళ్లలో తెలంగాణ కన్నా ఏపి అభివృద్ధి చెందిందనే ఈర్ష్య టిఆర్ ఎస్ ది. నమ్మకద్రోహంపై తిరగబడ్డామనే ఆక్రోశం నరేంద్రమోదిది. పదవీకాంక్ష, కేసులమాఫీ కోసం జగన్మోహన్ రెడ్డి కుతంత్రాలు. ముగ్గురూ కుమ్మక్కై ఏపికి అన్యాయం చేస్తున్నారు.
ఈ కుట్రల కూటమిని అడ్డుకోవాల్సింది ప్రజలే. కుట్రకూటమి గెలిస్తే నష్టపోయేది ప్రజలే. కుట్రకూటమి గెలిస్తే బిసిల సంక్షేమం ఆగిపోతుంది. పేదల సంక్షేమం ఆగిపోతుంది అని వ్యాఖ్యానించారు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *