జర్నలిస్టు విగ్రహమెక్కడైనా చూశారా? నర్సాపురంలో ఉంది

(డి.సోమ సుందర్)
విగ్రహం అంటేనే రాజకీయ నాయకులు గుర్తుకొస్తారు. కొద్ది రోజుల కిందటయితే స్వాతంత్య్ర సమరయోధుల విగ్రహాలు కనిపించేవి. వాళ్ల త్యాగం నేటితరానికి స్పూర్తినివ్వాలని వాళ్ల విగ్రహాలను ఆవిష్కరించేవారు.చరిత్ర గుర్తుండాలని, నిస్వార్థ త్యాగానికి ప్రేరణ కావాలని గొప్పవిగ్రహాలను ముఖ్యమంత్రి ఎన్టీరామారావు హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేశారు.  ఇపుడు విగ్రహాలను ఏర్పాటుచేసే ఉద్దేశమే వేరు. పదవులుకోసం, పార్టీ టికెట్ల కోసం, రూలింగ్ పార్టీ అధినేత మెప్పుకోసం విగ్రహాలను ఏర్పాటుచేస్తున్నారు. ఈ రాజకీయాల మధ్య రాజకీయాలకు అతీతంగా జనాన్ని చైతన్యం వంతం చేసిన జర్నలిస్టులక విగ్రహాలు పెట్టేందుకు అవకాశమొక్కడుంది.
అయితే, పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ప్రజలు ఒక జర్నలిస్టు విగ్రహం నెలకొల్పి ఆందర్నిఆశ్చర్యంలో ముంచెత్తారు. అక్కడి ప్రజలు ఆశపు గంగరాజు అనే గ్రామీణ విలేకరికి విగ్రహం ఏర్పాటుచేసి ఆయన సేవలు ఎపుడూ గుర్తుండేలా చేశారు.
ఒకజర్నలిస్టుకు అందునా గ్రామీణ విలేకరికి విగ్రహం ఏర్పాటుచేసి నివాళులర్పరించడం దేశంలో ఇదే మొదటిసారమే.
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం లో మొన్నమొన్నటి వరకు ఆయన  ప్రముఖ పాత్రికేయుడు.
సుమారు యాభై సంవత్సరాల పాటు విశాలాంధ్ర విలేఖరి గా పని చేశారు.
“ఉండీల్” వార పత్రిక ను సుదీర్ఘ కాలం పాటు నిరాటంకంగా నిర్వహించారు.
నరసాపురం తెలుసుగా!  ఓ పక్క వశిష్ట గోదావరిని, మరో వైపు బంగాళాఖాతం ను పెనవేసుకుని ఉంటుంది.నరసాపురం తీర ప్రాంతం లోని ప్రజా సమస్యలను విస్తృతంగా వెలుగు లోకి తెచ్చిన పాత్రికేయుడు గంగ రాజు గారే.
వ్యవసాయ, మత్స్య, గీత, చేనేత, లేసు, ఉప్పు తయారీ, నవ్వారు, కొబ్బరి పీచు, ఓ ఎన్.జి. సి వంటి రంగాల సమస్యలను, వరద, మురుగు ముంపు సమస్యలు, తీర ప్రాంత రహదారులు, వంతెనలు, విద్య, వైద్యం వంటి అంశాలపై ఆయన విస్తారంగా వార్తలు, వ్యాసాలు రాశారు.
విశాలాంధ్ర సంపాదకుడు సి.రాఘవాచారి గారి తో ఉత్తమ గ్రామీణ విలేఖరి గా ప్రశంసలు అందుకున్నారు.
స్థానిక, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఏన్నో సత్కారాలు పొందారు.
తూర్పు గోదావరి జిల్లా కే.పెద పూడి లో చేనేత కార్మిక కుటుంబంలో 1930 లో జన్మించిన గంగరాజు నరసాపురం దత్తత వచ్చారు. బాల్యం లో ఉత్సాహంగా స్వాతంత్య్రోద్యమం లో పాల్గొన్నారు.
కళారూపాల ద్వారా ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు కృషి చేశారు.
ప్రజానాట్య మండలి లో బుర్ర కథ కళా కారునిగా పేరు పొందారు.
అనంతర కాలంలో ఆయన కమ్యూనిస్టు గా మారారు.
తొలుత చేనేత కార్మికుల కోసం ఉద్యమించిన గంగరాజు అనంతరం పలు కార్మిక సంఘాల స్థాపనలో పాలు పంచుకున్నారు.
నిషేధ కాలం లో కమ్యూనిస్టు ఉద్యమం లో పలు నిర్బంధాల కు గురయ్యారు.జైలు పాలయ్యారు.
కార్మిక నేతగా అనేక పోరాటాలు చేశారు. అరెస్టు అయ్యారు.
పేదలకు ఇళ్ల స్థలాల కోసం కృషి చేసి అనేక పేటలు, కాలనీల ఏర్పాటు లో ముఖ్య పాత్ర పోషించారు.

భూస్వాములు అయిన మంగెన వారి కుటుంబాన్ని అభ్యర్థించి, ఒప్పించి వారిచ్చిన భూమి లో వారి పేరుతోనే పేదలకు కార్మికుల కాలనీ ఏర్పాటు చేయించారు.

ప్రముఖ కార్టూనిస్ట్ కోటి లాల్ గంగరాజు గారి కుమారుడు. కోటి లాల్ ఆర్టీసి లో పని చేసి రిటైరయ్యారు.
వైద్య ఆరోగ్య శాఖ లో సూపరింటెండెంట్ గా రిటైర్ అయ్యి, ప్రస్తుతం ఏ.పి. మహిళా సమాఖ్య ప.గో. జిల్లా అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నెక్కంటి జగదాంబ గారు గంగరాజు గారి కుమార్తె.
సీపీఐ రాష్ట్ర నాయకుడు నెక్కంటి సుబ్బారావు గంగ రాజు గారి అల్లుడు.
ఆశపు గంగ రాజు 2012 ఆగస్ట్ 22 న మృతి చెందారు.
ఆయన పై గల అభిమానం తో అప్పట్లోనే మంగెన వారి నగర్ లో స్థానికులు గంగరాజు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
ప్రతి ఏటా ఆయన వర్ధంతి ని అక్కడ ఘనంగా నిర్వహిస్తున్నారు.
(ఆశపు గంగ రాజు గారి ఎనిమిదవ వ వర్ధంతి సందర్భంగా)

 

Like this story? Share it with a friend!