ఈ సారికి తిరుమల వైకుంఠ ఏకాదశి సర్వదర్శనం స్థానికులకే

ఈ డిసెంబరు 25 నుంచి జనవరి 3 వ తేదీ వరకు శ్రీ వారి వైకుంఠ ద్వార దర్శనం కోసం టీటీడీ జారీ చేయనున్న సర్వ దర్శనం టోకెన్లు ఈ సారి స్థానికులకు మాత్రమే ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది.
 డిసెంబరు 25 ఉదయం నుంచి జనవరి 3వతేదీ రాత్రి 12 గంటల వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం చేయించాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. కోవిడ్ 19 నిబంధనల వల్ల రోజుకు 17 నుంచి 18 గంటల్లో 30 నుంచి 35 వేల మందికి మాత్రమే దర్శనం చేయించే అవకాశం ఉంది. కోవిడ్ 19 నిబంధనలు కఠినంగా పాటిస్తున్నందు వల్లే జూన్ 8 నుంచి ఇప్పటి దాకా ఒక్క భక్తుడికి కూడా కోవిడ్ సోకలేదని ఈ విషయం వెల్లడిస్తూ అదనపు ఇవొ ధర్మారెడ్డి చెప్పారు.
సర్వ దర్శనం టోకెన్లు అందరికీ అందుబాటులో పెడితే దేశ వ్యాప్తంగా భక్తులు తిరుపతికి వచ్చి కోవిడ్ 19 నిబంధనల ఉల్లంఘన జరుగుతుందన్నారు.
ఉద్యోగులకు మొదట్లో పాజిటివ్ వచ్చినా క్రమంగా అరికట్టగలిగామని అన్నారు. రోజుకు ర్యాన్డం గా 200 మంది భక్తులకు పరీక్షలు చేస్తుంటే ఒక్కరికి కూడా పాజిటివ్ రాలేదని ఆయన  చెప్పారు.
ప్రస్తుతం అమలు చేస్తున్న కోవిడ్ 19 నిబంధనలు పాటిస్తూనే రోజుకు 30 నుంచి 35 వేల మందికి వైకుంఠ ద్వార దర్శనం చేయిస్తామన్నారు. ఇందులో రోజుకు 20 వేల చొప్పున శీఘ్ర దర్శనం టోకెన్లు ఆన్లైన్ లో విడుదల చేశామని ఆయన తెలిపారు.
పెరటాసి మాసం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలు, శాంతి భద్రతల ఇబ్బందుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. ఈ కారణాల వల్ల సర్వదర్శనం టోకెన్లు స్థానికులకే ఇవ్వాలని నిర్ణయించామని, స్ధానికేతరులు రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *