శ్రీవారి కళ్యాణం వల్లే అయోధ్య లైవ్ ఇవ్వలేక పోయాము: టిటిడి

తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతి రోజు మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు నిర్వహించే శ్రీ వేంకటేశ్వర స్వామి నిత్య కళ్యాణం లైవ్ కారణంగానే అయోధ్య లో ఆగస్టు 5న  శ్రీ రామ మందిర నిర్మాణం భూమి పూజ కార్యక్రమం ఎస్వీ బీసీ లో లైవ్ ఇవ్వలేక పోయామని చానెల్ ఒకప్రకటన విడుదల చేసింది.
ప్రధాని నరేంద్ర మోదీ  అయోధ్య మందిర శంకుస్థాపన కార్యక్రమాన్ని ఎస్ వి బిసి చానెల్ లైవ్ ప్రసారం చేయకపోవడాన్ని రాష్ట్ర బిజెపి విమర్శిస్తూ ఉంది. ఇదే విధంగా పార్టీ రెబెల్ ఎంపి రఘురామ కృష్ణంరాజు కూడా దీనిని తప్పుపట్టారు.
దీనితో టిటిడి వివరణ ఇచ్చింది.
ప్రకటనలో ఏం చెప్పారంటే…
శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రారంభించిన రోజు నుంచి స్వామి వారి నిత్య కళ్యాణం నిరంతరాయంగా లైవ్ ఇస్తూనే ఉన్నాము. స్వామి వారి కల్యాణాన్ని ప్రతిరోజూ కోట్లాది మంది భక్తులు చూస్తారు.
తిరుమలలో నిర్వహిస్తున్న సుందరకాండ పారాయణంలో బుధవారం నాడు శ్రీ కుప్పా శివ సుబ్రమణ్యం అవధాని అయోధ్యలో జరగనున్న రామ మందిర భూమి పూజ గురించి మాట్లాడారు. రామమందిర నిర్మాణం భూమి పూజ 12 – 44 గంటల సమయంలో నిర్ణయించారు.
ఆసమయంలో శ్రీ వారి కళ్యాణం లైవ్ ఇవ్వాల్సి ఉన్నందున అయోధ్య కార్యక్రమం లైవ్ ఇవ్వలేక పోయారు. మధ్యాహ్నం 1 గంట న్యూస్ బులిటిన్ లో అయోధ్య కార్యక్రమం ఎస్వీ బీసీ ప్రముఖంగా ప్రసారం చేసింది.
రామ మందిర నిర్మాణ భూమి పూజ కార్యక్రమం మొత్తం రికార్డ్ చేసి యానిమేషన్ తో గురువారం మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు ఎస్వీ బీసీ ప్రత్యేక కార్యక్రమం ప్రసారం చేసింది. టీటీడీ హిందూ ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉంది, పాలక మండలి ఈ దిశగా అనేక చర్యలు తీసుకుంది