వలస కూలీలకు 20 రోజులుగా సాయంచేస్తున్నముగ్గురు మిత్రులు

కొరోనా తో జనజీవనం గత రెండు నెలలుగా స్తంభించి పోయంది,సామాన్యుని జీవితం అతలాకుతలమైంది. వలస కార్మికుల జీవనం,కుటుంబాలు   చిన్నాభిన్నమైయ్యాయి. ఉపాధి కోల్పోయిన వలస కూలీలంతా రకరకాల పద్ధతుల్లో  ఎక్కడో సూదూరరాష్ట్రాల్లోని వాళ్ల వాళ్ల గ్రామాలుకు బయలుదేరారు.  మొదట్లో చాలా  మంది కాలినడకనేబయలుదేరారు. ఇపుడయితే ప్రభుత్వాలు రంగంలోకి దిగి వాళ్లని గమ్యస్థానాలకు చేర్చేందుకు రైళ్లు బస్సులు నడుపుతున్నాయి. ఈ కూలీలకు ఆహారం అందించేందుకు ఎన్జీవోలు ముందుకు వచ్చాయి. కొంతమంది వ్యక్తులు కూడా మిత్రులను పోగేసుకుని వారికి ఆహారం అందిస్తున్నారు.
ఇలా సికిందరాబాద్ కు చెందిన ముగ్గురు మిత్రులు, Dr బీ యెన్ వీ సత్యనారాయణ,పి ప్రసాద్ మరియు ఏ సూర్యనారాయణ రావు వలసకూలీలకు ప్రచారానికి దూరంగా  ఎనలేని సేవలందిస్తూ వస్తున్నారు.
గత ఇరవై రోజులుగా వలస కార్మికులకు తమవంతు భాధ్యతగా   చొరవతో సహాయం చేస్తున్నారు. ఇది తెలిసిన మరికొంతమంది మిత్రులు కూడా వారికి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఇంకా వస్తున్నారు. కార్మికులకు ఆర్ధికంగా,ఆహారపదార్ధాలతో పాటు వారి స్వంత రాష్ట్రమైన రాయపూర్,చత్తీస్ ఘడ్ కు అనేక కార్మికులను ప్రైవేట్ బస్సులలో పంపించారు. ఇంతవరకు వారు మూడు బస్సులలో పంపించారు.
సోమవారం నాడు  (01 -06 -2020  5 :30 ఉదయం) బెంగళూరు- గోరకపూర్ వెళ్లే శ్రామిక్ రైల్ లో ప్రయాణించే 1600 వలస కార్మికులకు బ్రెడ్ అందించారు. వీళ్లకు వీళ్లు మిత్రులు కూడా సహకారం అందిస్తున్నారు.
దీనికి గాను ప్రవాస భారతీయులైన  చిరవరపు సూర్య, చిరవరపు హేమ లక్ష రూపాయలు ఆర్ధిక తోడ్పాటుని అందించారు.రాబోయే మూడు నాల్గు రోజులలో వచ్చే శ్రామిక రైళ్లలోని కార్మికులకు కూడా ఆహారపదార్ధాల అందించే ఏర్పాట్లలో వున్నారు.  దానికి కూడా ప్రవాస భారతీయులైన సుజిత్ కుమార్,పడిదల వంశి,సింధూజ ,శ్రీకాంత్,ఒబ్బిలిరెడ్డి శ్రవంత్ కుమార్,మత్సా భరత్ ఆర్ధిక తోడ్పాటు అందించారు.

మున్ముందు కూడా ఈ సేవా కార్యక్రమాలను కొనసాగించటానికి తాము సిద్ధంగా ఉన్నామని ఈ మిత్రత్రయం తరఫున డాక్టర్ బిఎన్ విసత్యనారాయణ ట్రెండింగ్ తెలుగు న్యూస్ కు చెప్పారు. డాక్టర్ సత్యానారాయణ  ఉస్మానియా క్యాంపస్ లోని రీజినల్ సెంటర్ ఫర్  అర్బన్ అండ్ ఎన్వైరన్మెంటల్ స్టడీస్ (RCUES: Regional Center for Urban and Environmental Studies) కోఆర్టినేటర్ గా పనిచేస్తున్నారు.
తమకు సహకారం అందిస్తున్న రైల్వే అధికారులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.