నూతన విద్యావిధానంతో అంతరాలు పెరుగుతాయ్: యుటిఎఫ్ హెచ్చరిక

(కె జంగయ్య, చావ రవి)
కేంద్ర ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్న జాతీయ విద్యావిధానం ప్రైవేటు విద్యా వ్యాపారాన్ని ప్రోత్సహించి, ప్రజల మధ్య అంతరాలను మరింత పెంచేదిగానే ఉందని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టిఎస్ యుటిఎఫ్) అభిప్రాయపడుతున్నది.
విద్యారంగ భాగస్వాములనుండి సూచనలను ఆహ్వానించిన కేంద్ర ప్రభుత్వం ఏ సూచనలనూ పరిగణనలోకి తీసుకున్నట్లు కనిపించటం లేదు. సుమారు రెండున్నర లక్షల సూచనలు వచ్చాయని పేర్కొన్నారు కానీ అవేంటో, వేటిని పరిగణనలోకి తీసుకున్నారు, వేటిని తిరస్కరించారో వెల్లడించలేదు.
1. ఐదవ తరగతి వరకు మాతృభాష నిర్భంధమా, ఐచ్చికమా స్పష్టత లేదు.
2. దేశమంతటా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నింటిలో ఒకే విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉన్నది.
3. మూడు, అయిదు, ఎనిమిది తరగతులలో పరీక్షలు నిర్వహించటం పరోక్షంగా డిటెన్షన్ విధానాన్ని అమలు జరపటమే.ఇది పేద విద్యార్థులను విద్యకు దూరం చేస్తుంది.
4. వృత్తి విద్యను ఆరవ తరగతి నుండే ప్రారంభించటం ఆర్థికంగా, సామాజికంగా అణగారిన వర్గాల విద్యార్థులను సాధారణ విద్యకు దూరం చేస్తుంది.
5. సెకండరీ స్థాయిలో మాత్రమే వృత్తి విద్యను ప్రారంభిస్తే చదువు ముగిసిన అనంతరం ఉపాధిని పొందే అవకాశం ఉంటుంది.
6. అన్ని స్థాయిల పాఠశాలల్లో ఒకే రకంగా 1:30 ఉండటం సమంజసం కాదు.
7. ప్రీ ప్రైమరీ లో 1:10, ప్రైమరీలో 1:20, సెకండరీ విద్యలో 1:30 గా ఉండాలని, ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి పాఠశాల మొత్తానికి కాకుండా తరగతి వారీగా ఉండాలని, ప్రతి తరగతికి కనీసం ఒక టీచర్ ఉండాలనే సూచనలను పట్టించుకోలేదు.
8. ఉన్నత విద్యలో విదేశీ విశ్వ విద్యాలయాలు, ప్రైవేటు కళాశాలలకు స్వయం ప్రతిపత్తి, ప్రభుత్వ రంగాన్ని బలహీనపరిచి, ప్రైవేటు రంగానికి ప్రోత్సాహం కల్పించే దిశగా ఎన్ఈపీ ఉన్నది.
9. మూడు నుండి 18 సం. వరకు ఉచిత నిర్బంధ విద్యను, ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభిచాలనటాన్ని, మధ్యాహ్న భోజనం తో పాటు అల్పాహారాన్ని అందించాలనే నిర్ణయాలను స్వాగతిస్తున్నాం. 5+3+3+4 విధానం ఆహ్వానించదగింది.
10. అయితే జిడిపిలో 6% విద్యకు కేటాయించాలనే జాతీయ విద్యాకమీషన్(కొఠారి కమిషన్) సూచన గత 52 సంవత్సరాలుగా అమలుకు నోచుకోలేదు. మరలా అదే ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలు ఆచరణాత్మకంగాకుంటే ప్రయోజనం లేదని టిఎస్ యుటిఎఫ్ భావిస్తున్నది.
(కె జంగయ్య(అధ్యక్షులు) చావ రవి (ప్రధాన కార్యదర్శి)
టిఎస్ యుటిఎఫ్)