ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు తెలంగాణ ఎమ్మెల్యే సీతక్క విజ్ఞప్తి

తూర్పుగోదావరి జిల్లా అటవీ ప్రాంతంలోని గిరిజనుల వెంటనే ఆహారం సరఫరా చేయాలని  ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి  తెలంగాణ ములుగు ఎమ్మెల్యే సీతక్క విజ్ఞప్తి చేశారు.
తూర్పుగోదావరి జిల్లా అటవీ ప్రాంతంలోని చింతలపాడు అనే కుగ్రామానికి వెళ్లారు. వారికి రూ. 500తో పాటు, నిత్యావసర వస్తువులను పంచారు. ఈ సందర్భంగా జగన్ ను ఉద్దేశించి ఆమె ఒక వీడియో విడుదల చేశారు.
ఇక్కడున్న కోయ, కొండరెడ్డి గిరిజనుల పరిస్థితి దారుణంగా ఉందని ఆమె తెలిపారు. ఇక్కడి ప్రజలు చాలా రోజులుగా ఆహారం లేక బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి రేషన్ కూడా అందడం లేదని చెప్పారు. ఈ గ్రామంలో వాలంటీర్లు కూడా లేరని చెప్పారు. వీరికి న్యాయం చేయాలని కోరారు.
మరోవైపు, లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుంచి గిరిజన గూడేల్లో సీతక్క తిరుగుతున్నారు. రోడ్డు సదుపాయం లేని ప్రాంతాల్లో కూడా ట్రాక్టర్లలో వెళ్తూ, ముండుటెండల్లో ప్రయాణం చేస్తూ పేదలకు అండగా నిలబడుతున్నారు. ఇదే క్రమంలో ఏపీలోని చింతలపాడుకు కూడా వెళ్లారు. అక్కడి గిరిజనులకు సాయం చేశారు. రాష్ట్రం వేరైనా సీతక్క చేసిన సాయాన్ని పలువురు ప్రశంసించారు.