చంద్రబాబు ధర్నాకు అనుమతి నిరాకరణ, టిడిపినేతల హౌస్ అరెస్ట్

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా టిడిపి ముఖ్య నాయకుల హౌస్ అరెస్ట్ చేశారు.  పలమనేరులో మాజీ మంత్రి  ఎన్.అమర్నాథరెడ్డి, చిత్తూరులో ఎమ్మెల్సీ  దొరబాబు, చిత్తూరు టిడిపి పార్లమెంట్ అధ్యక్షుడు  పులివర్తి నాని తో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న మాజీ ఎమ్మెల్యేలు అందరూ ఎక్కడికక్కడ హౌస్ అరెస్టు లు జరిగాయి. ఈ రోజు చిత్తూరు గాంధీ విగ్రహం చౌరాస్తా వద్ద చంద్రబాబు నాయుడు నిరసన కార్యక్రమం చేపట్టాల్సి ఉంది. దీనికోసం అనుమతి కూడా కోరారు. అయితే, రాత్రి పొద్దు పోయాక పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ ధర్నా కార్యక్రమానికి  అనుమతి నిరాకరించి, నేతలను హౌస్ అరెస్టు చేసి వాచరెవరూ బయకు రాకుండా చేస్తున్నారు. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్నా ఆపే ప్రసక్తే లేదంటున్న టిడిపి శ్రేణులు.

TDP నేతల హౌస్ అరెస్టు ను ఖండించిన అచ్చన్నాయుడు

ప్రతిపక్ష నాయకుడికి రాష్ట్రంలో పర్యటించే హక్కు లేదా? ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడు స్వేచ్ఛగా ప్రజల వద్దకు వెళ్లే హక్కులేదా.? ఆటవిక యుగంలో ఉన్నామా? కిరాతక పాలనలో వున్నామా? చంద్రబాబు నాయుడు గారి పర్యటన నేపథ్యంలో చిత్తూరు జిల్లా టీడీపీ నేతలనో హౌస్ అరెస్ట్ చేయటం దుర్మార్గం అని  టిడిపి ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షుడు కింజారాపు అచ్చన్నాయుడు  వ్యాఖ్యానించారు.ఈ రోజు చిత్తూరు గాంధీ విగ్రహం చౌరాస్తా వద్ద చంద్రబాబు నాయుడు నిరసన కార్యక్రమం చేపట్టాల్సి ఉంది. దీనికోసం ఆయన ఉదయమే చిత్తూరు బయలు దేరారు.

తక్షణమే హౌస్ అరెస్టు చేసిన చిత్తూరు జిల్లా టీడీపీ నాయకులను విడిచిపెట్టాలని ఆయన ఒక ప్రకటనలో  డిమాండ్ చేశారు.

ప్రకటన లోని విశేషాలు:

ఏ హక్కుతో మా నేతలను గృహనిర్భిందించారు. 40 ఏళ్ళ రాజకీయ చరిత్ర వున్న నాయకుడిగా, ఎన్.ఎస్.జి భద్రత వున్న నాయకుడు చంద్రబాబు గారి పర్యటన ఏవిధంగా అడ్డుకుంటారు? హిట్లర్ ముస్సోలినీ కలగలసిన వ్యక్తిగా జగన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. అహంకారం, ప్రతీకారం, నియంతృత్వం అజెండాగా జగన్ రెడ్డి పాలన ఉంది. వేలాది మందితో ర్యాలీలు, సభలు, కుల సంఘాల మీటింగ్ పెట్టుకోడానికి అనుమతి ఇస్తున్న ప్రభుత్వం శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు? ఎన్నికల్లో వైసీపీ మంత్రులు చేసిన అక్రమాలు బట్టబయలు అవుతాయన్న భయంతోనే అనుమతి ఇవ్వటం లేదు. చంద్రబాబు నాయుడు గారి పర్యటన చూసి మండుటెండలో కూడా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు వణికిపోతున్నారు. మా నాయకులను నిర్భందించినంత మాత్రానా మా పోరాటం ఆగదు. ప్రజాక్షేత్రంలోనే మీ వైఫల్యాలు, అవినీతిని, గూండాగిరిని ప్రజలకు వివరిస్తాం. మీ పాలనపై ప్రజలు విసిగెత్తారు కాబట్టే ప్రజల తరపున నిలబడుతున్న మా నాయకులను ఇళ్లలో నిర్భందిస్తున్నారు. పోలీసులు లేకుండా ప్రజల్లోకి వచ్చి తిరిగే ధైర్యం వైసీపీ నాయకులకు లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *