విశాఖ ఎల్జీ మృతుల కుటుంబాలకు టిడిపి రు.50 వేలు సాయం: చంద్రబాబు లేఖ

ఎల్జీ పాలిమర్స్ మృతుల కుటుంబాలకు సాంత్వనగా తెలుగుదేశం పార్టీ  రూ.50 వేల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. ఈ మేరుకు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు గ్యాస్ లీకేజీ వల్ల మరణించిన వారి కుటుంబాలకు పేరుపేరున లేఖ రాశారు. ఈ ప్రమాదంలో 15 మంది చెందిన విషయం తెలిసిందే.
వ్యక్తిగతంగా  పరామర్శించి ఆర్ధిక సాయం అందించాలనుకుంటే వైసీపీ ప్రభుత్వం సహకరించలేదని అందువల్ల మృతులకుటుంబాలను సందర్శించలేకపోయానని ఆయన విచారం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా రాష్ట్ర ప్రజల కష్టనష్టాల్లో తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందుని చెబుతూ  మృతుల కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ రూ.50 వేల ఆర్ధిక సహాయం అందించాలనకుందని,  ఈ సాయం బ్యాంకు అక్కౌంటులో జమ చేస్తున్నామని ఆయన తెలిపారు.
 ఇది ఒక లేఖ 
శ్రీ నాగులపల్లి గణేష్ గారికి !
ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ దుర్ఘటనలో నాగులపల్లి గ్రీష్మ మృతి చెందడం హృదయవిదారకం. స్టైరిన్ విష వాయువుల బారి నుంచి తప్పించుకోలేక మొత్తం 15 మంది మృతి చెందడం నా మనసును కలచి వేసింది. వందలాది మంది అస్వస్తతకు గురై ఆసుపత్రులలో చేరి చికిత్స పొందడం చూసి చలించి పోయాను. నాకెంతో ఇష్టమైన విశాఖ నగరంలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ దుర్ఘటన చోటు చేసుకోవడం శోచనీయం. ఆది నుంచి ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యాన్ని వైసీపీ ప్రభుత్వం వెనుకేసుకు రావడం విచారకరం.
వ్యక్తిగతంగా మిమ్మలను పరామర్శించి ఆర్ధిక సాయం అందించాలని అనుకుంటే వైసీపీ ప్రభుత్వం సహకరించలేదు. నేను విశాఖ బయలుదేరిన రోజు విమాన సర్వీసును ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా రాష్ట్ర ప్రజల కష్టనష్టాల్లో తెలుగుదేశం పార్టీ అండగా ఉండటం తెలిసిందే.
ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ బాధిత మృతుల కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ రూ.50 వేల ఆర్ధిక సహాయం మీ బ్యాంకు అక్కౌంటులో జమ చేస్తున్నామని తెలియజేస్తున్నాను. మీకు జరిగిన నష్టం ఎవరూ ఏ విధంగా భర్తీ చేయలేనిది. అయినా గుండె దిటవు చేసుకుని భవిష్యత్తు వైపు ముందడుగు వేయాలని కోరుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ తరఫున అందరికీ పూర్తీ సహాయసహకారాలు అందజేస్తానని తెలియ జేస్తున్నాను. మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశిస్తున్నాను.
ఆవేదనా భరిత హృదయంతో
భవదీయుడు
నారా చంద్రబాబునాయుడు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు