షాద్ నగర్ జర్నలిస్టు శ్రీనివాస్ అరెస్టు మీద నిరసన

శ్రీనివాస్ పై అక్రమ కేసును ఎత్తివేయాలి: మంత్రి సబితకు టీయూడబ్ల్యూజే వినతి

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సీనియర్ పాత్రికేయుడు, టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి గుడిపల్లి శ్రీనివాస్ పై అక్కడి పోలీసులు అక్రమంగా కేసు నమోదు చేయడం అప్రజాస్వామిక చర్య అని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ, ఐజేయూ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డిలు పేర్కొన్నారు.

మంగళవారం నాడు రాష్ట్ర మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డిని కలిసి వారు వినతి పత్రాన్ని సమర్పించారు.

షాద్ నగర్ లో నిరుపయోగంగా ఉన్న స్టేడియంలో క్రీడాకారులను అనుమతించాలని స్టేడియం నిర్వాహకులను శ్రీనివాస్ కోరగా, పథకం ప్రకారం స్థానిక పోలీసులు కొందరు ఈ అంశాన్ని వివాదాస్పదం చేసి శ్రీనివాస్ పై 341, 452, 504, 506 సెక్షన్ల క్రింద నాన్ బెయిలేబుల్ కేసు నమోదు చేశారు.

రాత్రికి రాత్రే ఆయనను మహబూబ్ నగర్ జైలుకు తరలించడం మీడియా లోకాన్ని విస్మయానికి గురిచేసిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

షాద్ నగర్ ప్రాంతంలో ఎన్నో సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న సీనియర్ పాత్రికేయుడు శ్రీనివాస్ పై అక్రమంగా నమోదైన కేసును తొలగించాలని వారు డిమాండ్ చేశారు.

టీయూడబ్ల్యూజే ప్రతినిధి బృందం వినతిపై స్పందించిన మంత్రి సబితా వెంటనే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తో ఫోన్లో మాట్లాడారు.

జర్నలిస్టులను ఆందోళన కలిగించే ఇలాంటి చర్యలు మంచివి కాదన్నారు. శ్రీనివాస్ ను కస్టడీలోకి తీసుకురాదన్నారు. అతనికి వెంటనే బెయిల్ లభించే విధంగా సహకరించాలని సీపీని మంత్రి సూచించారు.

మంత్రిని కలిసిన వారిలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎ.రాజేష్, రంగారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షుడు కొంపల్లి శ్రీకాంత్ రెడ్డిలు ఉన్నారు.

డీజీపీకి, సీపీకి వినతి పత్రాలు

జర్నలిస్ట్ శ్రీనివాస్ పై అక్రమంగా నమోదైన కేసును వెంటనే తొలగించాలని డీజీపీ మహేందర్ రెడ్డి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ లకు టీయూబ్ల్యూజే వినతి పత్రాన్ని సమర్పించింది.

శ్రీనివాస్ తీవ్రవాదా?

శ్రీను ప్రస్తుతం మహబూబ్​నగర్​ జిల్లా జైలులో ఉన్నారు. 23న తిరిగి షాద్​నగర్​  కస్టడిలో తీసుకునేందుకు పిటిషన్​లను వేసి పోలీసులు కక్ష పూరితంగా అతనికి బెయిల్​ రాకుండా అడ్డుపడుతున్నారని జర్నలిస్టులు విమర్శిస్తున్నారు.

‘ఒక జర్నలిస్టుపై ఇంతటి అమానుషమైన చర్యలు సబబా?  ఆయన ఏమన్నా..తీవ్రవాదా..? టెర్రరిస్ట్​ ఆ..? అకారణంగా కేసులు నమోదు చేస్తు జర్నలిస్టుల మనోస్థ్యేర్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించడం ఎంతవరకు సమంజసమో ఆలోచించాలి.గతంలో కూడ ఇదే విధంగా అతనిపై సంబంధంలేని కేసును బనాయిస్తే మేమందంరం అప్పటి సైబరాబాద్​ సీపీ సందీప్​శ్యాండిల్యను వాస్తవాలు వివరిస్తే విచారణ జరిపించి ఆనాడు శ్రీనన్నపై కేసులు లేకుండా చేశారు,’  అని జర్నలిస్టులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *