ఆర్టీసి అధికారులు ఆశగా ఎదరుచూస్తున్నారిలా! ఈ బస్సులు రేపు కదుల్తాయా?

ప్రభుత్వం ఇచ్చిన గడువు లోగా అంటే నవంబర్ అయిదో తేదీలోపు విధుల్లో చేరాలనుకునే ఆర్టీసీ కార్మికులు తాము పనిచేస్తున్న డిపో మేనేజర్లకే కాక ఇంకా పలుచోట్ల తమ జాయినింగు లెటర్స్ ఇవ్వవచ్చని తెలంగాణ ఆర్టీసీ ఎండి సునీల్ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. లెటర్ల ఇచ్చేందుకు చాలా ఏర్పాట్లు చేశారు వాటిని ఆయన ఈ ప్రకటనలో వెల్లడించారు.
కార్మికులు ఆయా జిల్లాల కలెకర్టర్ కార్యాలయంలో గానీ, ఎస్పీ కార్యాలయంలో గానీ, ఆర్డీవో కార్యాలయంలో గానీ, డిఎస్పీ కార్యాలయంలోగానీ జాయినింగ్ లెటర్లు ఇవ్వచ్చు.
అదే విధంగా తాము పనిచేస్తున్న డిపో మేనేజర్ కార్యాలయంలో గానీ, డివిఎం కార్యాలయంలో గానీ, రీజనల్ మేనేజర్ కార్యాలయంలో గానీ విధుల్లో చేరడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ లేఖ ఇవ్వవచ్చు.
హైదరాబాద్ లో పనిచేసే కార్మికులు బస్ భవన్ లో ఇడి కార్యాలయాల్లో లేఖలు అందించవచ్చని ఆయన  తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్యాలయాల్లో మంగళవారం రాత్రి వరకు వచ్చిన లేఖలన్నీ హైదరాబాద్ చేరుకుంటాయన్నారు. వాటిని ప్రభుత్వానికి పంపనున్నట్లు వెల్లడించారు.
ఈ అవకాశాన్ని కార్మికులు వినియోగించుకోవాలని, విధుల్లో చేరే కార్మికులకు అన్ని రకాల రక్షణ కల్పించనున్నట్లు తెలిపారు.