ప్రధానికి స్వాగతం చెప్పేందుకు సిఎం కెసిఆర్ రానవసరం లేదు : ప్రధాని కార్యాలయం

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా స్వాగతం పలకాడానికి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు రానసరం లేదని ప్రధాని కార్యాలయం స్పష్టం చేసింది.
ప్రధాన మంత్రికి స్వాగతం పలకడానికి హకీంపేట ఎయిర్ పోర్టుకు  ముఖ్యమంత్రి రావాల్సిన అవసరం లేదని ప్రధాన మంత్రి వ్యక్తిగత సహాయకుడు వివేక్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు ఫోన్ చేసి చెప్పినట్లు తెలిసింది.
శనివారం నాడు ప్రధాని నరేంద్రమోదీ  ఇండియాలో కోవిడ్  వాక్సిన్ తయారుచేస్తున్న భారత్ బయోటెక్ కంపెనీని సందర్శించేందుకు వస్తున్నసంగతి తెలిసిందే. ప్రధాని నగరంలోకి రాకుండా నేరుగా జీనో మ్ వ్యాలీ వెళ్లి అక్కడి వాక్సిన్ తయారీ ప్రోగ్రెస్ ను సమీక్షిస్తారు.
సహజంగా ప్రధాన మంత్రి రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు విమానాశ్రయం వద్దే రాష్ట్ర ప్రజల తరఫున గవర్నర్, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు స్వాగతం పలుకుతారు.
ఈ సారి కూడా అలాగే చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు భావించారు. శనివారం మధ్యాహ్నం హకీంపేట విమానాశ్రయానికి చేరుకునే ప్రధాన మంత్రికి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం పలుకుతారని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రధాన మంత్రి కార్యాలయానికి సమాచారమిచ్చింది.
దీనికి స్పందనగా ప్రధాన మంత్రి కార్యాలయం నుండి రాష్ట్ర ప్రభుత్వానికి శుక్రవారం సాయంత్రం ప్రత్యేక సమాచారం అందింది. స్వాగతం చెప్పడానికి ముఖ్యమంత్రి రానవసరం లేదని సమాచారంఅందించారు.
అంతే కాకుండా ప్రధాన మంత్రికి స్వాగతం చేప్పడానికి కేవలం ఐదుగురు అధికారులకు  మాత్రమే పిఎంవో అవకాశం ఇచ్చింది. వారు:  హకీంపేట ఎయిర్ ఆఫిస్ కమాండెంట్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డి.జి.పి. మహేందర్ రెడ్డి, మేడ్చల్ కలెక్టర్ శ్వేతామొహంతి, సైబరాబాద్ సి.పి. సజ్జనార్ లు
వారు మాత్రమే హకీంపేట విమానాశ్రయానకి రావాలని పిఎంవో ఆదేశాలు పంపింది.
 కానీ ఈ సారి స్వాగతం పలకడానికి ముఖ్యమంత్రి రావాల్సిన అవసరం లేదని ప్రధాన మంత్రి కార్యాలయం వారించడం విశేషం. ఈ పర్యటన మునిసిపల్ ఎన్నికల రీత్యా అట్టహాసంగా కాకుండా నామమాత్రంగానే జరపాలని ప్రధాని కార్యాలయం భావించిందునుకోవాలి. ఇది కొత్త  సంప్రదాయమని కొంత మంది అధికారులు వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *