కరోనా కారణంగా రాష్ట్రంలో ఈ సారి బోనాలు నిర్వహించడం లేదు. ఈ నెల 25 నుంచి ప్రారంభం కావాల్సిన గోల్కోండ బోనాలు, జులై 12న సికింద్రాబాద్ మహంకాళి, 19న హైదరాబాద్ బోనాలు రద్దయ్యాయి. కాకపోతే, ఆయా గుడుల పూజారులే అమ్మ వార్లకు బోనాలు సమర్పిస్తారు.
ఈ విషయాలను దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రకటించారు.
శుక్రవారం హైదరాబాద్లోని అరణ్యభవన్లో ఉన్నతాధికారులతో మంత్రి బోనాల నిర్వహణ మీద సమీక్ష నిర్వహించారు. ఇలాగే తెలంగాణలో ఆలయాలు తెరవడానికి సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొటోకాల్ (ఎస్ఓపీ)పై అధికారులతో చర్చించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ప్రకారం ఈ నెల 8వ తేదీ నుంచి గుడుల్లో దర్శనాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
క్యూలైన్లలో ఫిజికల్ డిస్టెన్స్ ఉండేలా ఏర్పాట్లు చేయాలని, సోడియం హైపోక్లోరైడ్తో గుడి ఆవరణ కడగాలని, ఎంట్రీలోనే శానిటైజర్స్ అందుబాటులో ఉంచాలని, థర్మల్ స్క్రీనింగ్కు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్నారు. కంటైన్మెంట్ జోన్లలో మాత్రం గుడులు ఓపెన్ కావని చెప్పారు.
కోనేరులలో స్నానానికి అనుమతి లేదు
కోనేర్లలో స్నానాలకు అనుమతి లేదని, అంతరాలయ దర్శనం, శఠగోపం, తీర్థ ప్రసాదాల వితరణ, వసతి సౌకర్యాలు ఉండవని మంత్రి పేర్కొన్నారు. ఆలయాల వద్ద ఉన్న షాపుల నుంచి ప్రసాదాలు పొందొచ్చన్నారు. ప్రముఖ దేవాలయాలకు సంబంధించి ఆన్లైన్ బుకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. 65 ఏండ్లపైబడిన వారు, 10 ఏండ్లలోపు పిల్లలు, కరోనా లక్షణాలు ఉన్నవారు ఆలయ దర్శనాలకు రావొద్దని సూచించారు. సమీక్షలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.