ఆంధ్రా తొలిమహిళా ఛీఫ్ సెక్రటరీ నీలమ్ సాహ్ని… ఆమె గురించి తెలుసా?

అమరావతి,13నవంబరు:నవ్యాంధ్రప్రదేశ్ తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు.
బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం ప్రధానం కార్యదర్శి నియామకానికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు సంఖ్య జిఓఆర్టి నం.2563 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది.
ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం,ఎంపవర్మెంట్ కార్యదర్శిగా పనిచేసిన ఆమె నవ్యాంధ్ర ప్రదేశ్ కు తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు.
1984వ ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఆమె గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మచిలీపట్నంలో అసిస్టెంట్ కలక్టర్ గా పనిచేశారు.అలాగే టెక్కలి సబ్ కలక్టర్ గాను,నల్గొండ జిల్లా సంయుక్త కలక్టర్ గాను పని చేశారు.
అదే విధంగా మున్సిపల్ పరిపాలనశాఖ డిప్యూటీ సెక్రటరీగా,హైదరాబాదులో స్త్రీశిశు సంక్షేమశాఖ పిడిగాను పనిచేశారు. నిజామాబాదు జిల్లా పిడిడిఆర్డిఏ గాను,ఖమ్మం జిల్లాల్లో కాడా(CADA)అడ్మినిస్ట్రేటర్ గాను పనిచేశారు.
తదుపరి ఇంధనశాఖలో సంయుక్త కార్యదర్శిగా,నల్గొండ జిల్లా కలక్టర్ గాను,కుటుంబ సంక్షేమశాఖ కమీషనర్ గా,టిఆర్అండ్ బి కార్యదర్శిగా పనిచేశారు.అదే విధంగా క్రీడల శాఖ కమీషనర్ మరియు సాప్ విసి అండ్ ఎండిగాను పని చేశారు.
అనంతరం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శిగా కేంద్రంలో పనిచేసిన అనంతరం ఎపిఐడిసి కార్పొరేషన్ విసి అండ్ ఎండిగా ఉమ్మడి రాష్ట్రంలో పని చేశారు.
అనంతరం స్త్రీశిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. 2018 నుండి కేంద్ర సామాజిక న్యాయం మరియు ఎంవపర్మెంట్ కార్యదర్శిగా పనిచేస్తూ నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వచ్చారు.
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇద్దరు మహిళలు సతీనాయర్, మిన్నీ మాధ్యూలు మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా పనిచేశారు. నవ్యాంధ్రప్రదేశ్ కు తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని  అయ్యారు.
(ప్రచార విభాగం,సమాచారశాఖ,అమరావతి సచివాలయం వారిచే జారీ చేయడమైనది)