జానా రెడ్డిని ఓడించడానికి ఇన్ని కుట్రలా ?

కేసీఆర్ లో ఓటమి భయం – జానా రెడ్డి విజయం తధ్యం

’ఓటమి భయంతో టీఆర్ఎస్ పార్టీ , సీఎం కేసీఆర్ నాగార్జున సాగర్ లో చిల్లర రాజకీయాలకు, రాజ్యంగ విరుద్ద చర్యలకు పాల్పడుతూ, హేయమైన రాజకీయాలకు తెర తీశారు’’ అని విమర్శించారు ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్. ‘’నాగార్జున సాగర్ లోని ప్రభుత్వ అతిధి గృహంలో టీఎన్జీవో నాయకులంతా వచ్చి సమావేశం ఏర్పాటు చేశారు. పీఆర్ఎస్ ఇచ్చినందుకు కేసీఆర్ కు కృతజ్ఞత సభ పెట్టుకున్నారు. ఇది కేసీఆర్ చిల్లర రాజకీయం. కేసీఆర్ పని గట్టుకొని టీఎన్జీవో అసోసియేషన్ వారందరినీ కూడా ఇక్కడికి రప్పించి , సాగర్ ఎన్నికల్లో పని చేసే ప్రభుత్వ ఉద్యోగులందరినీ కూడా సమీకరించి, టీఆర్ఎస్ పార్టీకి గెలుపు లభించే విధంగా పోలింగ్ బూతుల్లో ఓటర్లని మానిప్యులేట్ చేయాలని స్వయంగా కేసీఆర్ ఆదేశాలు ఇవ్వడం సిగ్గు చేటు. కేసీఆర్ దిగజారుడు తనానికి నిదర్శనం’’ అని మండిపడ్డారు దాసోజు.

‘’నాగార్జున సాగర్ లో జానారెడ్డి గెలుపు ఖాయని స్పష్టమైన నేపధ్యంలో గత నలఫై రోజులుగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు ప్రజలని మభ్య పెడుతూ ప్రలోభాలకు గురి చేస్తూ మద్యం, డబ్బులు పంచుతున్నారు. ఇది చాలదు అన్నట్టు ఇంకా దిగజారిపోయి ప్రభుత్వ ఉద్యోగులని సమీకరించి టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయండి, పోలింగ్ బూతుల్లో టీఆర్ఎస్ గెలుపుకు పని చేయండని ఆదేశాలు ఇస్తూ ప్రజాస్వామ్యన్ని తూట్లు పొడుస్తున్నారు కేసీఆర్. టీఆర్ఎస్ పార్టీ, టీఎన్జీవో నాయకులు కుమ్మక్కపోయారని స్పష్టంగా తేలిపోయింది’’ అని పేర్కొన్నారు దాసోజు .
దీనిపై కేంద్ర ఎన్నికల అబ్జర్వర్ సజ్జన్ సింగ్ చౌహాన్ కి మాజీ ఎమ్మెల్యే ఎరవాతి అనిల్ కుమార్ , టిపిసిసి సెక్రెటరీ రోహిన్ రెడ్డి కలిసి ఫిర్యాదు చేసిన శ్రవణ్… రాజ్యంగానికి వ్యతిరేకంగా, ఎన్నికల కోడ్ కి వ్యతిరేకంగా ఒక ప్రభుత్వ అతిధి గృహంలో టీఎన్జీవో సమావేశం ఏర్పాటు చేసి, టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయమని చెప్పడం ఎక్కడి న్యాయం ?’’ అని ప్రశ్నించారు.

Sravan Dasoju

‘’చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ శశాంక్ ఘోగల్ ఎక్కడున్నారు ? అసలు ఎన్నికలు జరుగుతున్నాయా ? టీఎన్జీవో లు ఇంత బహిరంగంగా కుమ్మక్కైపోయి టీఆర్ఎస్ పార్టీ కోసం పని చేస్తుంటే.. అసలుఎన్నికలు పెట్టడం ఎందుకు.. టీఆర్ఎస్ గెలిచిందని కేసీఆర్ కి రాసిచ్చేయండి. ఇందుకీ బూటకపు ఎన్నికలు?’’ అని నిలదీశారు దాసోజు.
‘’కాంగ్రెస్ పార్టీ, జనా రెడ్డి మొద టినుంచి ఎన్నికలు నిష్పాక్షపాతంగా జరగాలని చెబుతూనే వున్నారు. కానీ ఇంత నికృష్టంగా ఓ మిడతల దండు మాదిరిగా సాగర్ లోకి వచ్చి నలఫై రోజులుగా ప్రజలని మభ్య పెట్టే ప్రయత్నం చేస్తుంది టీఆర్ఎస్. తెలంగాణ కోసం పోరాడిన జనా రెడ్డిని ఓడించడానికి ఇన్ని కుట్రలా ? చివరికి ఉద్యోగులని కూడా మభ్య పెట్టె ప్రయత్నం చేయడం ఏం న్యాయం ? అని ప్రశ్నించారు దాసోజు.

‘’చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ శశాంక్ గోయల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా చిల్లరగా వ్యవహరించారు. టీఆర్ ఎస్ పార్టీ ఓటర్లని పోలింగ్ బూత్ దగ్గర కూడా మభ్య పెడుతుంటే కళ్ళు మూసుకున్నారు. ఈ రోజు సాగర్ ఎన్నికల్లో కూడా అదే దృశ్యం కనిపిస్తుంది. మంత్రులు వచ్చి ఇక్కడ డబ్బులు పంచుతున్నారు మద్యం ఏరులైపారుతుంది. చివరికి టీఎన్జీవో నాయకులు ఎన్నికల కోడ్ కి విరుద్దంగా వ్యవహరిస్తుంటే చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గా శశాంక్ ఘోగల్ ఏం చేసున్నారు? భాద్యతాయుతమైన స్థానంలో వున్న మీరు రాజ్యంగ పరిరక్షకులుగా వుండాలి కానీ కేసీఆర్ కి పరిరక్షకుడిగా వ్యవహరించడం దారుణం’’ అని విమర్శించారు దాసోజు

‘’ఓటమి భయం కేసీఆర్ మొహంలో కనిపిస్తుంది. జానా రెడ్డి గెలుస్తారనే స్పష్టమైన సంకేతాలు వస్తున్న నేపధ్యంలో టీఎన్జీవో నాయకులతో కలసి కుట్ర చేసే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్. టీఎన్జీవో నాయకులు ఎవరో మనకి తెలుసు. వాళ్ళంతా భజన పరులుగా మారారు. వీళ్ళని ఉపయోగించుకునే పన్నాగం పన్నారు కేసీఆర్. వాళ్ళని సమీకరించి మీటింగ్ పెట్టారు. వీళ్ళే పోలింగ్ బూత్ లో అధికారులుగా వుంటారు. అసలు ఉద్యోగులే మాస్ రిగ్గింగ్ చేయరనే గ్యారెంటీ ఏంటి ? ఏ రకంగా నిష్పాక్షపాత ఎన్నిక జరుగుతుంది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా, ఎన్నికలు అంటే ప్రజలకు అసహ్యం పుట్టించే విధంగా కేసీఆర్ చర్యలు వుండటం దుర్మార్గం.’’ అని విమర్శించారు దాసోజు.

‘’చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ శశాంక్ ఘోగల్ కి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు రాజ్యంగానికి రక్షకులు. అంతే కానీ కేసీఆర్ కి బానిస కాదు. దయ చేసి రాజ్యంగాన్ని కాపాడే విధంగా వ్యవహరించాలి’’ అని కోరారు దాసోజు.
‘’జానా రెడ్డి ని ఓడించడానికి కేసీఆర్ చేస్తున్న చిల్లర రాజకీయాలకు తెగబడుతున్నారు. తెలంగాణ కోసం పాటుపడ్డ వ్యక్తి జానా రెడ్డి. జేఏసీ పుట్టింది ఆయన ఇంట్లోనే. ఆయన దయతోనే సోనియా గాంధీని ఒప్పించి తెలంగాణ తీసుకొచ్చారు. అలాంటి వ్యక్తిని ఓడగొట్టడం కోసం వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఓటర్లని మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఉద్యోగస్తులని కూడా మభ్య పెట్టడం కేసీఆర్ కి సిగ్గు చేటు. కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినా జానా రెడ్డి గెలుపు తధ్యం. టీఆర్ఎస్ పార్టీకి కర్రకాల్చి వాత పెట్టడానికి సాగర్ ప్రజలు సిద్దంగా వున్నారు’’ అని పేర్కొన్నారు దాసోజు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *