బేల్దార్లకు జనసేన ‘డొక్కా సీతమ్మ’ ఆహార శిబిరాలు, ఇంతకీ డొక్కాసీతమ్మ ఎవరు?

భవన నిర్మాణ కార్మికుల కోసం ఈనెల 15 , 16 తేదీల్లో డొక్కా సీతమ్మ స్ఫూర్తితో ఆహార శిబిరాలు ఏర్పాటు చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు నిచ్చారు.  ఇసుక లేక, భవన నిర్మాణ పనుల్లేక బేల్దార్లంతా ఉపాధి కోల్పోయారని చెబుతూ వారికి అండగ ఉన్నామని చాటిచెప్పేందుకు జనసేన ఈ శిబిరాలను ఏర్పాటుచేస్తూ ఉంది.
ఆకలితో వున్నవారికి పని కల్పించి కడుపు నింపాల్సిన ప్రభుత్వమే… ఉన్న ఉపాధిని పోగొట్టి, కార్మికుల కడుపు మాడ్చేసింది. అందువల్ల  ఇటువంటి పరిస్థితుల్లో జనసేన నాయకులు, జనసైనికులు వారికి అండగా ఉండాలని పవన్ పిలుపు నిచ్చారు.
‘పస్తులుంటున్న కార్మికుల కోసం డొక్కా సీతమ్మ గారి స్పూర్తితో, ‘డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు’ ఏర్పాటు చేస్తాం.పనుల కోసం అడ్డాకు కార్మికులు వచ్చే సమయంలో – అడ్డాల దగ్గరే శిబిరాలు ఏర్పాటు చేసి ఆహారాన్ని అందిస్తాం.మా వనరులు పరిమితమేగావచ్చు. కానీ మనకు చేతనైనంత సాయం చేస్తాం.రాష్ట్ర వ్యాప్తంగా 15 , 16 తేదీల్లో డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలను నిర్వహిస్తాం,’ అని ప్రకటించారు.
ఈ శిబిరాలు చూసైనా ప్రభుత్వం కార్మికులకు ఉచితంగా ఆహారాన్ని అందించే ఏర్పాట్లు చేస్తే హర్షిస్తామని ఆయన చెప్పారు.
‘ప్రభుత్వ క్యాంటీన్లు ద్వారా అందిస్తారో మరో విధంగానో… కార్మికులకు, వారి కుటుంబాలకు ఉచితంగా ఆహారం అందించాలి.నెలల తరబడి పనులు లేకుండా చేసి పస్తులు పెట్టినందుకు కార్మికుల కుటుంబాలకు ఉచితంగా ఆహారం అందించాలి,’ అని పవన్ పేర్కొన్నారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసే శిబిరాలకు ఏ రంగైనా వేసుకోండి.. ఏ పేరైన పెట్టుకోండి. కానీ కార్మికులకు ఉచితంగా ఆహారాన్ని అందించాలని ఆయన ఒక చురక కూడా వేశారు..
ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకున్నవారు 50 మంది వరకూ ఉన్నారని భవన నిర్మాణ కార్మిక సంఘాలు చెబుతున్నాయని అంటూ మీరు ఏడు కుటుంబాలకే పరిహారం ఇచ్చారు. అందరికీ ఇవ్వాల్సిందే అని  ఆయన  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి మరణం తరవాత 1200 మంది చనిపోయారని ఏ లెక్కలతో చెప్పారో తెలియదుగానీ ఓదార్పు యాత్రలో వారి ఇళ్లకు వెళ్లి లక్షల రూపాయలు ఇచ్చారు. మంచిదే. అయితే, ఇపుడు మీ నిర్ణయంతో ఉపాధి లేక 50 మంది వరకూ చనిపోతే.. మరి ఏ లెక్కలతో ఏడు కుటుంబాలకే పరిహారం ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
ఇప్పుడు మీ పార్టీ డబ్బు ఇవ్వక్కర్లేదు. ఇల్లు కట్టుకొనే ప్రతి ఒక్కరూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం సెస్ చెల్లిస్తారు, ఆ సంక్షేమ నిధి నుంచే పరిహారం ఇవ్వండని ఆయన అడుగుతున్నారు.
డొక్కా సీతమ్మ ఎవరు?
-టివిఎస్ శాస్త్రి
శ్రీమతి డొక్కా సీతమ్మ గారు తూర్పు గోదావరి జిల్లాలోని రామచంద్రాపురం తాలుకా , మండపేట గ్రామంలో 1841, అక్టోబరు రెండోవారంలో జన్మించారు. ఈమె తండ్రి అనుపింది భవానీశంకరం, తల్లి నరసమ్మ గార్లు. సీతమ్మ గారి తండ్రి శంకరం గారిని గ్రామస్తులు ‘బువ్వన్న’ గారనే పేరుతో పిలుస్తుండేవారు. దానికి కారణం ఆయన అడిగిన వారందరికీ ‘బువ్వ'(అన్నం) పెట్టటమే! అటువంటి తండ్రికి కూతురిగా జన్మించిన సీతమ్మ గారు అన్నార్తుల ఆకలిని తీర్చిన మహా ఇల్లాలు. విద్యావాసనలు లేని లేని సాధారణ గృహిణి ఆమె.
బాల్యంలో సీతమ్మ గారికి తల్లితండ్రులు కథలు, పాటలు, పద్యాలు అన్నింటినీ నేర్పారు. ఆ రోజుల్లో స్త్రీలు విద్య నేర్చుకునే అవకాశాలు సరిగా లేకపోవడంతో ప్రాచీన సంప్రదాయాలకు తలవంచి పెద్దబాలశిక్ష వంటి గ్రంధాన్ని కూడా పూర్తిగా అధ్యయనం చెయ్యకుండానే పెళ్ళికి సిద్ధపడాల్సి వచ్చింది. సీతమ్మ గారి బాల్యంలోనే ఆమె తల్లి నరసమ్మ గారు మరణిస్తే, ఇంటిని చక్కదిద్దే భారం సీతమ్మ గారి మీద పడింది. దానిని ఒక పవిత్రమైన బాధ్యతగా ఆమె స్వీకరించింది. గోదావరినదీ పరీవాహక ప్రాంతంలోని కొన్ని గ్రామాలను లంక గ్రామాలని అంటారు. అటువంటి ఒక లంక గ్రామం లంకగన్నవరం. ఆ గ్రామంలో డొక్కాజోగన్న పంతులు గారనే పెద్ద ధనవంతుడు ఉండేవాడు. ఆయన ధనవంతుడే కాకుండా పెద్ద రైతు కూడా. వీటన్నిటినీ మించి మంచి వేదపండితుడు. ఒక రోజున పండిత సభకు వెళ్లి వస్తూ మండపేట వచ్చేటప్పటికి మధ్యాహ్నమయ్యింది. భోజనం చేసే సమయం అయింది. వారు మంచి ఆకలితో ఉన్నారు. సమయానికి వారికి భవానీ శంకరం గారు గుర్తుకు వచ్చారు. వెంటనే దగ్గరలో ఉన్న భవానీ శంకరం గారింటికి వెళ్లి ఆ పూట వారి ఇంటి ఆతిధ్యాన్ని స్వీకరించారు. జోగన్నగారికి అతిధి మర్యాదలను చేయటంలో సీతమ్మగారు చూపించిన ఆదరాభిమానాలకు ఆయన సంతృప్తి చెందాడు, పరమానందభరితుడయ్యాడు. యవ్వనంలో ఉన్న సీతమ్మగారు చూపించిన గౌరవ మర్యాదాలు, ఆమె వినయ విధేయతలు నచ్చి జోగన్నగారికి ఆమెను వివాహం చేసుకోవాలనే భావన కలిగింది.
ఆయనకు జ్యోతిష్య శాస్త్రంలో కూడా ప్రవేశం ఉంది. ఇద్దరి జాతకాలు సరిపోయినట్లుగా ఆయన తృప్తి చెందారు. బువ్వన్నగారు సీతమ్మను డొక్కా జోగన్న గారికిచ్చి అతి వైభవంగా వివాహాన్ని జరిపించారు. సీతమ్మగారు అత్తవారింట్లో అడుగు పెట్టగానే ఆమె ఇంటి పేరు ‘డొక్కా’ గా మారింది. ఆమెలో సహజంగా ఉన్న ఉదారగుణం, దాతృత్వం రోజు రోజుకూ పెరగసాగాయి. జోగన్న, సీతమ్మ గార్ల దాంపత్యం అన్యోన్యమైనది. ఆ పుణ్య దంపతులను చూసి చుట్టుపక్కల గ్రామాల వారందరూ గొప్పగా చెప్పుకునే వారు. ఆప్యాయతా, ఆదరణలకు నిలయంగా వారి ఇంటిని గురించి ఆచుట్టుపక్కల గ్రామస్తులందరూ ఆ రోజుల్లో గొప్పగా చెప్పుకునేవారు. లంక గ్రామాలకు చేరుకోవాలంటే, నేటికీ కూడా పడవే ముఖ్యమైన ప్రయాణ సాధనం. జోగన్నగారి గ్రామమైన లంకగన్నవరం త్రోవలో ఉండటంచేత, చాలామంది ప్రయాణీకులు వారి ఇంటనే భోజనాలు చేసేవారు. ఏ వేళ అతిధులు వచ్చినా వారికి అన్నపానాదులు లేవని చెప్పకుండా వారికి సకల మర్యాదాలు చెయ్యటం ఒక పవిత్రకార్యంగా ఆ దంపతులు స్వీకరించారు.
అచిరకాలంలోనే ఉభయ గోదావరి జిల్లాలలో ‘అపర అన్నపూర్ణ’ గా శ్రీమతి సీతమ్మ గారు పేరుపొందారు. లంక గ్రామాలకు తరచుగా వరదల వల్ల ప్రమాదాలు ఏర్పడేవి. నిలువ నీడలేని బాధితులను ఆదుకొని వారికి వసతి, భోజన సదుపాయాలను నిరాటంకంగా ఏర్పాటు చేసే ఉదాత్త గుణశీల సీతమ్మగారు. మగవాడు సంపాదించి ఎంత తెచ్చినా, ఔదార్యం లేని స్త్రీ ఉంటే ఆ సంపాదనకు అర్ధం, పరమార్ధం ఉండవు. అన్నదానం చేసి మానవతకు అర్ధం చెప్పిన మహిళాశిరోమణి సీతమ్మగారు. అలా అచిరకాలంలోనే ఆమె ఖ్యాతి భారతదేశమంతా వ్యాపించటమే కాకుండా, ఆంద్ర దేశపు కీర్తిని ఇంగ్లండు వరకు వ్యాపింపజేసిన మహా ఇల్లాలు సీతమ్మ గారు. అన్నం పెట్టేటప్పుడు ఆమె చూపే మాతృప్రేమ మరువరానిది. జీవితమంతా మాతృప్రేమను పంచిన మహనీయురాలు ఈమె. ‘అపర అన్నపూర్ణమ్మ’మన డొక్కా సీతమ్మ గారు! అన్నదానమే కాకుండా మరెన్నో శుభాకార్యాలకు విరాళాలు ఇచ్చిన దాత కూడా ఈ మహా ఇల్లాలు. ఈ జాతిరత్నం 1909 లో మరణించింది.
( gotelugu.com లో వచ్చిన ఆంధ్రుల అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ గారు నుంచి తీసుకున్నది.)

Feature photo from Wikepedia