హైదరాబాద్ నుంచి ఆంధ్రా, కర్నాటక వెళ్లాలంటే ఇదీ మార్గం…

తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లాలనుకునేవారికి  డీజీపీ కార్యాలయం మార్గదర్శకాలు వెలువడ్డాయి.
తెలంగాణ నుంచి అంతర్ రాష్ట్ర ప్రయాణాలకు పాసులు అవసరం లేదని రాష్ట్ర డీజీపీ కార్యాలయం ఇంతకు ముందే  స్పష్టం చేసింది. తెలంగాణ నుంచి ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రకు వెళ్లేవారు ఆయా రాష్ట్రాల రిజిస్ట్రేషన్ యాప్‌లలో ప్రయాణ వివరాలు నమోదు చేసుకుంటే చాలు. ఆంధ్ర వెళ్లాల్సిన వారు స్పందన యాప్‌లో, కర్ణాటక వెళ్లేవారు సేవా యాప్‌లో, మహారాష్ట్ర వెళ్లే వారు ఆ రాష్ట్ర పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని డీజీపీ కార్యాలయం సూచించింది.
తెలంగాణకు వచ్చే వాహనాలకు కూడా పాసులు అడగడం లేదని డిజిపి కార్యాలయం తెలిపింది.
అటువైపు ఆంధ్రప్రదేశ్  డీజీపీ కార్యాలయం కూడా ప్రజా రవాణాపై ఇంకా షరతులును సడలించలేదు. దీనికి కారణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతర్రాష్ట్ర కదలికలపై ఇంకా నిర్ణయం తీసుకొనకపోవడమే.
అంత వరకు ప్రస్తుతం అమల్లో ఉన్న షరతులు కొనసాగుతాయని ఏపీ డీజీపీ గౌతమ్ నిన్న స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి రోడ్డు మార్గాన ఆంధ్రప్రదేశ్ రావాలనుకునే ప్రయాణికులు ఖచ్చితంగా స్పందన పోర్టల్ ద్వారా ఈ-పాస్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
కరోనా ప్రభావం తక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చే వారు హోం క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం ఉంటుందని, కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చే వారు మాత్రం 7 రోజులు ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్‌లో ఉండి టెస్టులు చేయించుకోవాలి.
పాజిటివ్ వస్తే కోవిడ్ ఆస్పత్రికి.. నెగిటివ్ వస్తే 7 రోజులు హోం క్వారంటైన్‌కు వెళ్లాల్సిన అవసరం ఉందని సవాంగ్ ప్రకటించారు.