తెలంగాణలో 6 కు చేరిన కరోనా మృతులు

తెలంగాణలో కరోనా మృతుల సంఖ్య ఈ  రోజు భారీగా పెరిగింది. మొత్తంగా ఇప్పటిదాకా ఆరుగురు మృతిచెందారని ప్రభుత్వం కొద్ది సేపటికిందట ప్రకటించింది. అయితే, కొంతమంది మృతుల సంఖ్య ఎనిమది అని చెబుతున్నారు. ఈ విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. ఇక్కడ స్పష్టత ఎందుకు లేకుండా పోయిందంటే మొదట మెడికల్ బులెటీన్ లో ఇద్దరు చనిపోయారని పేర్కొన్నారు. తర్వాత చీఫ్ మినిస్టర్ కార్యాలయం మరొక ఆరుగురు మృతి చెందారని పేర్కొంది. రెండు కలిపితే 8 అని చాలా మంది భావిస్తున్నారు.

ఈ నెల 13 నుంచి 15 వరకు ఢిల్లీలో నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కాజ్ లో మత పరమైన ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో కొందరికి కరోనా వైరస్ సోకింది.
అందులో తెలంగాణకు చెందిన వారు కూడా ఉన్నారు. వారిలో ఇప్పటి వరకు ఆరుగురు మరణించారు.
వారిలో ఇద్దరు గాంధి ఆసుపత్రిలో, ఒకరు అపోలో ఆసుపత్రిలో, ఒకరు గ్లోబల్ ఆసుపత్రిలో, ఒకరు నిజామాబాద్ లో, ఒకరు గద్వాలలో మరణించారు.
వీరి ద్వారా వైరస్ సోకే అవకాశం ఉందని భావిస్తున్న అనుమానితులను ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందాలు గుర్తించి, ఆసుపత్రులకు తరలిస్తున్నాయి.
వారికి పరీక్షలు నిర్వహించి, వైద్యం అందిస్తున్నారు. మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వారికి కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తున్నది కాబట్టి, ఈ ప్రార్థనల్లో పాల్గొన్న ప్రతీ ఒక్కరు విధిగా తమ సమాచారాన్ని అధికారులకు అందించాలని వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తున్నది.

వారికి ప్రభుత్వమే పరీక్షలు నిర్వహించి, ఉచితంగా చికిత్స కూడా అందిస్తుంది. కాబట్టి మర్కజ్ వెళ్ళి వచ్చిన వారంతా తప్పక అధికారులకు సమాచారం అందించాలి. వారి గురించి ఎవరికి సమాచారం తెలిసినా వెంటనే ప్రభుత్వానికి తెలియ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ కోరుతున్నది.