ఆంధ్ర ప్రదేశ్ ఫుల్ కరోనావైరస్ రిపోర్టు ఇదే…

అమరావతి : కోవిడ్‌ –19 నివారణ, నియంత్రణ చర్యలతో పాటు లాక్‌ డౌన్‌ వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకుండా పలు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కొనసాగుతున్న కోవిడ్‌ నివారణ, నియంత్రణ చర్యలతో పాటు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై రిపోర్ట్‌
ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసులు:
రాష్ట్రంలో తాజాగా ఈ రోజు మరో 12 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో  రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 161కి చేరింది.
నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 32 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత కృష్ణా జిల్లాలో 23, గుంటూరు జిల్లాలో 20, వైయస్సార్‌ కడప జిల్లాలో 19, ప్రకాశం జిల్లాలో 17, పశ్చిమ గోదావరిలో 15, విశాఖపట్నం జిల్లాలో 14, చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాలలో 9 చొప్పున పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.
ఇక అనంతపురం జిల్లాలో 2, కర్నూలు జిల్లాలో 1 కేసు నమోదు కాగా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
కోవిడ్‌ –19 విస్తరణ, నివారణా చర్యలపై సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ సమీక్ష:
రాష్ట్రంలో ఇంటింటికీ వలంటీర్లు, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లు నిర్వహించిన సర్వేపై సీఎం ఆరా
రాష్ట్రంలో 1.45 కోట్ల ఇళ్లకు గానూ 1.28 కోట్ల ఇళ్లలో సర్వే పూర్తయ్యిందని తెలిపిన అధికారులు
రాష్ట్ర వ్యాప్తంగా జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం లాంటి ఏదో ఒక లక్షణం ఉన్న వారి గుర్తింపు
రెండో దశలో భాగంగా వీరిని పరిశీలిస్తారని, ఎవరికి పరీక్షలు చేయాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటారని వెల్లడించిన అధికారులు
కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో వార్డుల వారీగా డాక్టర్లను నియమించారా లేదా? అని అధికారులను ఆరా తీసిన సీఎం
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కార్పొరేషన్లు, మున్సిపాల్టీల వారీగా వైద్యుల మ్యాపింగ్‌ చేశామన్న అధికారులు
ఢిల్లీలో సదస్సుకు హాజరైన వారు, వారితో కాంటాక్ట్‌ అయిన వారికి పూర్తిస్థాయిలో పరీక్షలు చేయాలని ఆదేశించిన సీఎం
ఇక జిల్లాల వారీగా వివరాలు:
శ్రీకాకుళం జిల్లా:
జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ వెల్లడించారు. జిల్లా కోవిడ్‌ 19 ఆసుపత్రిగా ప్రభుత్వం గుర్తించిన జెమ్స్‌ ఆసుపత్రిని, రాజాం జి.ఎం.ఆర్‌ ఆసుపత్రిని, రాజాం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన రైతు బజారును, కాలేపు దేవాంగుల వీధిలో కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులను మంత్రి శుక్రవారం పరిశీలించారు.
జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కాలేదని, ఇక్కడి నుంచి ఢిల్లీకి ప్రయాణించిన వారి వివరాలు కూడా సేకరించి అవసరమైన శాంపిల్స్‌ తీసుకుంటున్నామని మంత్రి కృష్ణదాస్‌ చెప్పారు.
కాగా, కరోనా లాక్‌ డౌన్‌ వల్ల జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళలేని వారికి ప్రత్యేక వసతి గృహాలు ఏర్పాటు చేశామని కలెక్టర్‌ జె.నివాస్‌ తెలిపారు. ఆశ్రయం లేని వారు ఎవరైనా ఆ గృహాల్లో ఉండవచ్చని ఆయన చెప్పారు. భోజన, వసతి ఏర్పాట్లను ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. జిల్లా కేంద్రంలోని 7 రోడ్ల జంక్షన్‌ వద్ద వై.యస్‌.ఆర్‌ కళ్యాణ మండపం, అంబేద్కర్‌ జంక్షన్‌ వద్ద రెవిన్యూ గెస్టు హౌస్, జెడ్పీ ఎదురుగాగల హెచ్‌.బి కాలనీ వద్ద అంబేద్కర్‌ భవన్‌ లో వసతి గృహాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ వెల్లడించారు.
విజయనరం జిల్లా :
– జిల్లా నుంచి కరోనా నిర్ధారిత పరీక్షకు పంపిన మూడు శాంపిళ్ళు నెగటివ్‌ వచ్చాయని కలెక్టర్‌ డా. ఎం.హరిజవహర్‌లాల్‌ వెల్లడించారు.
– గతంలో పంపిన 10 శాంపిళ్ళు నెగటివ్‌ రాగా, తాజాగా పంపిన మూడు కూడా నెగటివ్‌ గా వచ్చాయని, దీనితో జిల్లాలో ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదని ఆయన తెలిపారు.
– అయినా కరోనా నివారణ చర్యలన్నీ అదే విధంగా కొనసాగుతాయని స్పష్టం చేసారు.
– లాక్‌డౌన్‌ సందర్భంగా ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడకుండా ప్రభుత్వ పరంగా అన్ని రకాల చర్యలనూ తీసుకున్నామని ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి అన్నారు.
– రైతు బజార్ల వికేంద్రీకరణలో భాగంగా విజయనగరం పట్టణంలోని రాజీవ్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్‌ను సందర్శించిన ఆమె, కూరగాయల ధరలపై వాకబు చేశారు.
– ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం స్థానికులకు మాస్కులు పంపిణీ చేశారు.
– కాగా, కరోనా వైరస్‌ నివారణ, నియంత్రణ చర్యల్లో స్వచ్చందంగా పని చేయడానికి 18 మంది ముందుకు వచ్చారు.
– జిల్లా కలెక్టర్‌ పిలుపు మేరకు ఒక డాక్టరు, నలుగురు ఫార్మాసిస్ట్‌లు, ఒక నర్స్, ఎం.పి.హెచ్‌. మేల్‌ నలుగురు, ఫిమేల్‌ ఒకరు, ల్యాబ్‌ టెక్నీషియన్‌ లు ఏడుగురుమొత్తంగా 18 మంది దరఖాస్తు చేసుకున్నారు.
– కరోనా వ్యాధిగ్రస్తుల చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రులను వినియోగించుకోవాలని.. ఇటీవలి వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేటు ఆసుపత్రులను జిల్లా కలెక్టర్‌ డా.ఎం.హరిజవహర్‌లాల్‌ పరిశీలించారు.
– 900 నాన్‌ ఐసియు పడకలను, మరో 25 ఐసియు పడకలను ఏర్పాటు చేయడంలో భాగంగా నగరంలో కోవిడ్‌ చికిత్సకు తగిన సౌకర్యాలు వున్న పలు ఆసుపత్రులను కలెక్టర్‌ పరిశీలించారు.
విశాఖపట్నం జిల్లా:
కరోనా మహమ్మారిని పారద్రోలి ప్రజలను దాని బారి నుండి రక్షించేందుకు వైద్య, పోలీస్, శానిటేషన్‌ సిబ్బందితో పాటు, జిల్లా యంత్రాంగం అహర్నిశలు పాటుపడుతున్నారని, వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు.
గాజువాక, మధురవాడ, పెందుర్తి తదితర పట్టణ ప్రాంతాలలో వలస కార్మికులు ఎక్కువగా ఉన్నారని వారిలో చాలా మందికి రేషన్‌ కార్డులు లేవని వారికి తగు ఏర్పాట్లు చే సి నిత్యావసర సరుకులను పంపిణీ చేసే విధంగా చూడాలని జాయింట్‌ కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డిని మంత్రి ఆదేశించారు. అదే విధంగా ఈనెల 15వ తేదీ లోపల అర్హులందరికీ నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని నిర్దేశించారు.
కోవిడ్‌–19 ఆస్పత్రులుగా గుర్తించిన ఛెస్ట్, ఈఎన్‌టీ, గీతమ్‌ ఆస్పత్రులలో కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న నేపథ్యంలో ఆయా ఆస్పత్రులలో సరిపడా వైద్యులు ఉండే విధంగా చూడాలని, లేనిపక్షంలో ప్రైవేట్‌ డాక్టర్లను వైద్యవసరాలకు ఉపయోగించుకోవాలని ఏఎంసి డైరెక్టర్‌ డాక్టర్‌ సుధాకర్‌ను మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో శానిటేషన్‌ సౌకర్యాన్ని మెరుగుపరచాలని, ఆసుపత్రులలో పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి వైద్యులు, సిబ్బందికి రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.
ఆస్పత్రులలో పని చేసే వైద్యులు, నర్సులతోపాటు శానిటేషన్‌ వర్కర్లకు పీపీఈ కిట్స్‌ను అందించాలన్న మంత్రి శ్రీనివాసరావు, జిల్లాకు అవసరమైన వైద్య పరికరాలు, మెడిసిన్స్, పీపీఈ కిట్స్‌ తదితర మెడికల్‌ ఎక్విప్మెంట్‌కు ఇండెంట్‌ అందజేస్తే, తాను వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో మాట్లాడి వాటన్నింటినీ రప్పించే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పారు.
తూర్పుగోదావరి జిల్లా:
– జిల్లాలో 299 కరోనా వైరస్‌ లక్షణాల అనుమానిత కేసుల శాంపిళ్లను లాబ్‌ పరీక్షలకు పంపగా, 267 కేసులు నెగిటీవ్‌ గా నిర్థారణ అయ్యాయని, 9 కేసులలో వైరస్‌ పాజీటీవ్‌గా తేలిందని, మరో 23 శాంపిళ్ల రిపోర్టులు రావలసి ఉందని వైద్య ఆరోగ్య శాఖ నోడల్‌ అధికారి తెలిపారు.
– జిల్లాలో కరోనా వైరస్‌ నివారణ చర్యలలో భాగంగా 165 క్వారంటైన్‌ సెంటర్లు నిర్వహిస్తున్నారు. ఇంకా 6,509 ఐసోలేషన్‌ బెడ్లు ఏర్పాటు చేశారు.
– జిల్లాలో కరోనా వైరస్‌ అనుమానిత లక్షణాలు కలిగిన 3441 మందిని హోమ్‌ ఐసోలేషన్‌లోను, 419 మందిని క్వారంటైన్‌ సెంటర్లలోను ఉంచి వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
– రాజానగరం, రాజమండ్రి, అమలాపురం లో ఏర్పాటు చేసిన జిల్లా కోవిడ్‌–19 ప్రత్యేక ఆసుపత్రులలో 1322 నాన్‌ ఐసియు బెడ్లు, 127 ఐసియు బెడ్లు సిద్ధం చేశారు.
– జిల్లాలో 14.65 లక్షల కుటుంబాలను హౌస్‌ టు హౌస్‌ సర్వే టీములు సందర్శించి మొత్తం 17,447 మందిని కోవిడ్‌–19 సర్వైలెన్స్‌లో పర్యవేక్షిస్తున్నారు. వారిలో 12,076 మంది గ్రామీణ ప్రజలు కాగా, 5371 మంది పట్టణాల ప్రజలు ఉన్నారు.
– డిల్లీలో మతపరమైన సమావేశానికి హాజరై వచ్చిన 26 మందిని ట్రాక్‌ చేసి కరోనా వైరస్‌ పరీక్షలు నిర్వహించగా, వారిలో ముగ్గురికి వైరస్‌ పోజిటీవ్‌ అని తేలింది. మిగిలిన వారి ఫలితం నెగటివ్‌గా వచ్చింది.
– కరోనా వైరస్‌ నివారణ చర్యల్లో భాగంగా జిల్లాలో 1344 పిపిఈ కిట్లు, 200 ఎన్‌95 మాస్కులు, 5500 గ్లోవ్స్, 99,900 సర్జికల్‌ మాస్క్‌లు, 46 వెంటిలేటర్లు, 35 లీటర్ల శానిటైజర్‌ను అందుబాటులో ఉంచారు.
పశ్చిమ గోదావరి జిల్లా:
– జిల్లాలో 15 కరోనా కేసుల నమోదు కావడంతో వైరస్‌ నివారణే ధ్యేయంగా అధికారులు కృషి చేస్తున్నారు.
– రెండు మూడ్రోజులుగా కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు పెరుగుతుండడంతో ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుప్రతి, ఆశ్రం అసుపత్రులను పూర్తి స్థాయి కోవిడ్‌ ఆసుపత్రులుగా మార్పు చేయాలని కలెక్టర్‌ ఆదేశం.
– ఇక నుంచి ఆ రెండు ఆసుపత్రుల్లో కరోనా కేసుల మినహా మరే కేసులకూ వైద్య సేవలు లభించవని తెలిపిన వైద్య ఆరోగ్య శాఖ
– పాలకొల్లులో గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు సమీక్ష.
– కరోనా నియంత్రణలో అధికారులు మరింత కృషి చేయాలన్న మంత్రి
– రాబోయే 11 రోజులు ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచన.
– నిత్యావసర సరుకులు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
ఇక జిల్లాలో పాజిటివ్‌ వచ్చిన ఫలితాలు: 15
నెగిటివ్‌ గా వచ్చినవి: 44
ఇంకా రిపోర్టులు రావాల్సినవి: 202
విదేశాల నుంచి వచ్చిన వారి సంఖ్య: 4,821
28 రోజుల గృహ నిర్బంధం పూర్తి చేసిన వారు: 2,773
ఇంకా గృహ నిర్బంధంలో ఉన్న వారు: 2,038
హాస్పిటల్స్‌లో చేరిన అనుమానితులు: 261
కృష్ణా జిల్లా:
– జిల్లాలో కరోనా తొలి మరణం సంభవించడంతో పలు ప్రాంతాలను రెడ్‌ అలర్ట్‌ జోన్‌ గా ప్రకటించారు. విజయవాడ, నూజివీడు, జగ్గయపేటను రెడ్‌ అలర్ట్‌ జోన్‌లుగా ప్రకటించారు.
– ఆయా ప్రాంత ప్రజలు ఎవరు మూడు రోజులు బయటకు రావద్దని అధికారులు ఆదేశించారు.
– ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని, నిత్యావసరమైన పాలు, మెడిసిన్‌ లు డోర్‌ డెలివరీ చేస్తామని తెలిపారు.
– ఇప్పటివరకు జిల్లాలో 23 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, అత్యధికంగా విజయవాడలో 18, జగ్గయ్యపేటలో 2, నూజివీడు 2, నందిగామలో ఒక పాజిటివ్‌ కేసు నమోదు అయింది.
– జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 796 మంది అసోసియేషన్‌ లో ఉంచడం జరిగింది.
– వీరిలో కొంతమంది కి ఇప్పటికే 28 రోజులు గడవగా 65 మంది 14 రోజుల లోపు ఐసోలేషన్‌ లో ఉన్నారు.
– విజయవాడలో కరోనాతో మృతి చెందిన వ్యక్తి కుమారుడికి కూడా పాజిటివ్‌గా తేలింది. అతను ఢిల్లీ సదస్సుకు వెళ్లి గత నెల 17న నగరానికి తిరిఇ వచ్చాడు.
– మరోవైపు చనిపోయిన వ్యక్తితో కాంటాక్ట్‌ లో ఉన్న 29 మందిని గుర్తించి, అందరినీ క్వారంటైన్‌ కు పంపించారు.
– ఆంధ్రా, తెలంగాణ సరిహద్దు ప్రాంతం.. గరికపాడు చెక్‌పోస్ట్‌ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ పరిశీలించారు. చెక్‌ పోస్ట్‌ వద్ద దాతల సహాయంతో పోలీస్‌ శాఖ ఏర్పాటు చేసిన ఉచిత అన్నదాన కేంద్రాన్ని పరిశీలించి లారీ డ్రైవర్‌లు, క్లీనర్‌లకు ఆహారం పొట్లాలను అందజేశారు.
– కరోనా నివారణ చర్యల్లో భాగంగా గుడివాడ పట్టణంలో, డివిజన్‌ పరిధిలోని ఆయా గ్రామ పంచాయితీల్లో సోడియం హైడ్రోక్లోరిక్‌ ఆమ్ల మిశ్రమాన్ని స్ప్రే చేస్తున్నారు.
– గుడివాడ డివిజన్‌ పరిధిలో ఇప్పటి వరకు కరోనా వైరస్‌కు సంబందించిన పోజటివ్‌ కేసులు ఏమీ లేవు.
– డివిజన్‌ పరిధిలో 128 మంది అనుమానితులను హోమ్‌ ఐసోలేషన్‌ లో ఉంచి వారికి వైద్యులు ప్రతి రోజు చికిత్స అందిస్తున్నారు.
– కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్‌ నియంత్రణకు తీసుకున్న లాక్‌ డౌన్‌ ప్రతి ఒక్కరూ పాటించాలని మంత్రి శ్రీ కొడాలి వెంకటేశ్వరరావు (నాని) కోరారు.
– మచిలీపట్నం మండలంలోని 34 గ్రామ పంచాయతీలలో సొడియం హైపో క్లోరైడ్‌ చల్లే కార్యక్రమాన్ని మంత్రి శ్రీ పేర్ని వెంకట్రామయ్య ( నాని) ప్రారంభించారు.
గుంటూరు జిల్లా:
– ఇప్పటి వరకు జిల్లాలో 20 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.
– ఇప్పటి వరకు మొత్తం 382 శాంపిల్స్‌ తీయగ అందులో పాజిటివ్‌ 20, నెగెటివ్‌–242 వచ్చాయి. మరో 120 శాంపిల్స్‌ ఫలితాలు రావాల్సి ఉంది.
– వారిలో ఫారిన్‌ రిటర్న్‌–8, ఫారిన్‌ కాంటాక్ట్‌–1, ఢిల్లీ రిటర్న్‌–200, ఢిల్లీ కాంటాక్ట్‌–77 కాగా, ఇతరులు మరో 16 మంది ఉన్నారు.
– ఎక్కువ పాజిటివ్‌ కేసులు ఢిల్లీ రిటర్స్, ఢిల్లీ కాంటాక్ట్‌లలోనే నమోదయ్యాయి. దీంతో జిల్లా యంత్రాంగం వారివై ప్రత్యేక దృష్టి పెట్టింది.
– ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్‌ కేసులు గుంటూరు టౌన్‌–9, మాచర్ల–5,అచ్చంపేట–3, క్రోసూరు–1, కారంపుడి–1, మంగళగిరి–1.
– జిల్లా నుంచి ఢిల్లీ మత ప్రార్ధనకు వెళ్లివచ్చిన వారు 187 మందిగా ప్రాధమిక అంచనాకు వచ్చిన యంత్రాంగం ఇప్పటి వరకు 146 మందిని ట్రేస్‌ అవుట్‌ చేసి శాంపిల్స్‌ తీసారు.
– వాళ్లకి కాంటాక్ట్‌ లో ఉన్నవారిని క్వారంటైన్‌ కేంద్రాలకు తరలిస్తున్నారు.
– జిల్లాలో క్వారంటైన్‌ కేంద్రాల సంఖ్య 28 ఉండగా ఇప్పుడు వాటిని 92కు పెంచుతున్నట్లు సమాచారం.
– అదే విధంగా ఇప్పటివరకు సర్వేలెన్స్‌ 2633 మంది ఉన్నట్లు సమాచారం.
– క్వారంటైన్‌ కేంద్రాల్లో 118 విదేశీ ప్రయాణీకులు ఉన్నారు.
– జిల్లాలో ఫారిన్‌ రిటర్న్‌ 2087 మంది స్వీయ గృహ నిర్బంధంలో ఉన్నారు.
– జిల్లాలో మొత్తం 15 వేల బెడ్స్‌ సిద్దం చేస్తున్నారు.
– రేపు (శనివారం) సాయంత్రం లోపు 2500 బెడ్స్‌ సిద్దం చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు.
– మరోవైపు జిల్లాలో 8 నుంచి 9 ఆస్పత్రుల్లో ఐసోలేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.
ప్రకాశం జిల్లా:
– మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి దుకాణాల్లో నిత్యవసరాలు, కూరగాయల ధరలను పరిశీలించారు. వాటి సరఫరా వివరాలు ఆరా తీశారు.
– జిల్లాలో 16 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, చికిత్స పొందిన ఒకరు ఇవాళ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు.
– జిల్లాలో హోమ్‌ ఐసోలేషన్‌లో 1,000 మంది ఉండగా, వారిలో 28 రోజులు పూర్తి చేసుకున్న వారు 117 మంది.
– కరోనా వైరస్‌ సోకిన వారి చికిత్స కోసం జిల్లాలో మొత్తం 500 బెడ్లు సిద్ధం చేశారు.
– జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరగటంతో ప్రజల్లో ఒక విధమైన భయం నెలకొంది.
– మరోవైపు ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలానికి ఒక క్వారంటైన్‌ సెంటర్‌ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా:
– ఢిల్లీ వెళ్లొచ్చిన వారిలో 219 మంది శాంపిల్స్‌ పరీక్షలకు పంపితే 32 పాజిటివ్, 116 నెగిటివ్‌ రాగా, మరో 71 మంది ఫలితాలు రావాల్సి ఉంది.
– లాక్‌ డౌన్‌ ను అతిక్రమించే ప్రజలపై కఠిన చర్యలు తీసుకుంటామన్న కలెక్టర్‌
– ఇక ఇంటి వద్దే ఫోటో తీసుకుని లబ్ధిదారులకు వలంటీర్లు పెన్షన్‌ అందిస్తున్నారు
– పాజిటివ్‌ కేసులున్న చోట పక్కాగా పారశుధ్ధ్యం అమలు చేస్తున్నామన్న కలెక్టర్‌
– జిల్లాలో హోం ఐసోలేషన్‌లో 896 మంది ఉన్నారు
– ఆసుపత్రి క్యారంటైన్‌ లో 105 మంది ఉన్నారు.
– జిల్లాకు విదేశాల నుంచి 1700 మంది వచ్చినట్లు గుర్తించారు.
– నెల్లూరులోని అన్ని డివిజన్స్‌లో అందుబాటులో 2,200 బెడ్లు ఉన్నాయి.
చిత్తూరు జిల్లా:
జిల్లాలో ఇప్పటి వరకు ఒక్కటి కూడా కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కానప్పటికీ, మొత్తం తొమ్మిది కేసులకు సంబంధించి చికిత్స జరుగుతోంది.
– ముఖ్యమంత్రి ప్రకటించినట్టుగా అర్హులైన వారికి శనివారం వెయ్యి రూపాయలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
– ఆస్పత్రుల సిబ్బందితో పాటు, కరోనా వైరస్‌ నియంత్రణ, నివారణ కార్యక్రమాల్లో పాల్గొంటున్న వారికి ఇంకా వ్యక్తిగత రక్షణ ఉపకరణాలు (పీపీఈ) అందాల్సి ఉంది.
– ఐసొలేషన్‌లో ఉన్న చాలా మంది నిర్భంధ సమయం ముగిసింది.
అనంతపురం జిల్లా:
– అనంతపురము కలెక్టరేట్‌ రెవిన్యూ భవన్‌లో మెడ్‌ ప్లానెట్‌ ప్రెవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ సాగర్‌ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని క్వారంటైన్‌ కేంద్రాలకు హ్యాండ్‌ శానిటేజర్లను జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు పంపిణీ చేశారు.
– అనంతపురం రెవెన్యూ భవనంలో జిల్లాలోని వివిధ మత పెద్దలతో జిల్లా కలెక్టర్‌ సమావేశం నిర్వహించి, కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు.
– జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్‌ లో జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులతో సమావేశమైన కలెక్టర్, ఏ నర్సింగ్‌హోమ్‌ మూసివేయరాదని, నిరంతరం సేవలు అందించాలని ఆదేశించారు.
– కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన హిందూపురం, లేపాక్షిలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ప్రజలు ఎవరూ బయటకు రాకుండా కట్టుదిట్టమైన భద్రత కల్పించారు.
– మరోవైపు ఆయా ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి కరోనా పరీక్ష నిర్వహిస్తున్నారు.
– జిల్లాలోని అన్ని వార్డుల్లో, గ్రామాల్లో వాలంటీర్లు ఇంటింటికీ తిరిగి కరోనా లక్షణాలు ఎవరికైనా ఉన్నాయా అని పరిశీలించారు.
– జిల్లాలో ఎక్కువగా పండుతున్న అరటి, మామిడి, బొప్పాయి, ఇతర కూరగాయలు ను ఇతర రాష్ట్రాల కు సరఫరా చేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు.
కడప జిల్లా:
– జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 19 కరోనా పాజిటీవ్‌ కేసులు నమోదయ్యాయి.
– జిల్లాలో పాజిటీవ్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో.. జిల్లా కలెక్టర్‌ హరికిరణ్‌ హైఅలర్ట్‌ ప్రకటించారు.
– ఎస్పీ అన్బురాజన్‌ ఆధ్వర్యంలో పోలీసు బలగాల ద్వారా కడప నగరంతో పాటు, ప్రొద్దుటూరు ఇంకా పాజిటీవ్‌ కేసులు నమోదయిన పట్టణాల్లో కోర్‌ జోన్, బఫర్‌ జోన్లను ప్రకటించి ఆయా వీధులను కట్టడి చేశారు.
– జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో లాక్‌ డౌన్‌ పక్కాగా అమలవుతోంది.
– ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రతి ఇంటి నుంచి కేవలం ఒకొక్కరే వచ్చి సరుకులు కొనుగోలు చేస్తున్నారు.
– కరోనా వైరస్‌ నిర్మూలనలో భాగంగా జిల్లా అగ్నిమాపక శాఖ పలు చోట్ల హైపో క్లోరైడ్‌ ద్రావణం స్ప్రే చేస్తోంది.
కర్నూలు జిల్లా:
– జిల్లా కోవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ ఆకస్మికంగా తనిఖీ చేసి అధికారులకు దిశాా నిర్దేశం చేశారు.
– కరోనా వైరస్‌ నియంత్రణ నిర్బంధ గదులలో సౌకర్యాలు తదితర వాటిపై మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన కలెక్టర్‌ వారికి అవసరమైన సూచనలు చేశారు.
– నిత్యావసర సరుకుల కిరాణా దుకాణాలలో ధరలు సంబంధించిన 2000 బ్యానర్లు ఏర్పాటు చేసిన అధికారులు.
– జిల్లాలో మైగ్రేనెట్‌ లేబర్స్‌ రిలీఫ్‌ సెంటర్స్‌ 11లో 20 రాష్ట్రాలకు సంబంధించి 2843 మంది కూలీలకు వసతి ఏర్పాటు.
– లాక్‌ డౌన్‌ భాగంగా అనాధలు, అభాగ్యులకు మరియు విధి నిర్వహణలో ఉన్న యంత్రాంగానికి ఆహార పొట్లాలను వితరణ చేసిన స్వచ్ఛంద సంస్ధలు

(ఇదిప్రభుత్వ వర్గాలనుంచి అందిన నివేదిక)