వివేకా అనుమానాస్పద మృతి వార్తలపై సీఎం రియాక్షన్ ఇదే

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి అనుమానాస్పద మృతి వార్తలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఆయన హఠాన్మరణం పట్ల చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల ప్రజల్లో అనుమానాలు రావడంపై హుటాహుటిన స్పందించారు. అప్పటికప్పుడు పోలీసు ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. డిజిపితో, ఇంటలిజెన్స్ అధికారులతో, కడప జిల్లా పోలీసు అధికారులతో మాట్లాడారు.

వివేకానంద రెడ్డి మృతిపై అత్యన్నత స్థాయిలో దర్యాప్తు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనిపై వెంటనే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) నియమించాలని ఆదేశించారు. దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని, నిందితులు ఏ స్థాయి వారైనా కఠినంగా శిక్షించాలని కోరారు.

వివేకానంద రెడ్డి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. శాసన సభలో, శాసన మండలిలో, లోక్ సభలో ప్రజా ప్రతినిధిగా వ్యవహరించారని అన్నారు. ఎంపిగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా దీర్ఘకాలం సేవలు అందించారన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *