నా మీద కోపంతో అమరావతి రైతులను హింసిస్తారా : మహాధర్నాలో చంద్రబాబు

తన మీద కోపంతో రైతులను హింసించ వద్దని, ఈ రైతులు అమరావతికి తమ భూములను అప్పగించిన త్యాగధనులని మాజీ ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు అమరావతి తుళ్లూరులో జరిగిన  మహాధర్నా పాల్గొన్నారు. అక్కడ ఆయన రైతులతో కలసి  జై అమరావతి అంటూ చంద్రబాబు నినాదాలు కూడా చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కామెంట్స్…..
‘అమరావతి రైతుల్ని ఈ పరిస్థితుల్లో చూస్తాననుకోలేదు. సమాజ హితం కోసం ముందుకొచ్చిన త్యాగధనులు మీరు. రాష్ట్రం నిలదొక్కుకోవాలనే ఉద్దేశం తో మీరు భూముల ఇచ్చేందుకు నాడు ముందుకొచ్చారు. మీకందరికీ ఆమోదయోగ్యమైన ప్యాకేజి నాడు ప్రకటించాను. ఇది ఓ మహానగరంగా అభివృద్ధి చెందుతుందని మీరంతా భూములిచ్చారు. రైతులకు న్యాయం కోసమే రైతు దినోత్సవం జరుపుకుంటున్నారు. రైతు దినోత్సవం రోజే రోడ్డు పై ఉండటం బాధ కలిగిస్తోంది,’ అని చంద్రబాబు అన్నారు.
అమరావతి లో రైతులు ప్రథమ పౌరులుగా ఉంటారని ఆశించాని అంటూ ఆరోజు  చంద్రబాబుగా కాదు,  ప్రభుత్వం నుంచి సీఎం గా హామీ ఇచ్చానని, ఎవరూ ఎకరం భూమి కూడా ఇవ్వడానికి ముందుకు రాని పతిస్థితుల్లో….33 వేల ఎకరాలు ఇచ్చారు,’ అని ఆయన రైతులను ప్రశంసించారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే…
‘ ఒక్క ఇల్లు కట్టాలంటే మూడేళ్లు పడుతుంది. రైతులకు న్యాయం జరగాల్సిందే. అమరావతి పై జగన్ ఎందుకు మాట తప్పి మడం తిప్పారు. 30వేల ఎకరాలు కావాలని నాడు అని ఇప్పుడెందుకు 200ఎకరాలు చాలు అంటున్నారు. ఇన్సైడ్ ట్రేడింగ్ పేరుతో అమరావతి ని చంపేయటం అన్యాయం, దుర్మార్గం. ధైర్యం ఉంటే హైకోర్టు ద్వారా ఇన్సైడ్ ట్రేడింగ్ పై న్యాయ విచారణ జరిపించండి,’ అని ఆయన ముఖ్యమంత్రికి సవాల్ విసిరారు.
జిఎన్ రావు నివేదికకు విశ్వసనీయత లేదు
‘ మేమూ విచారణకు సహకరిస్తాం. తప్పు తేలితే ఎలాంటి శిక్షకైనా సిద్ధం. రాజకీయాలు ఎన్నికలప్పుడు చేసుకుందాం.నాకు ఇప్పుడు కావాల్సింది అమరావతే. జీఎన్ రావు ఎవరిని అడిగి నివేదిక రూపొందించారు. జీఎన్ రావ్ రిపోర్ట్ కి ఉన్న విశ్వసనీయత ఎంత?  ముఖ్యమంత్రి పేపర్ లీక్ చేస్తే జీఎన్ రావు పరీక్ష రాసినట్లుంది. జీఎన్ నివేదిక జగన్ నివేదిక తప్ప మరొకటి కాదు,’ అని ఆయన అన్నారు.
విశాఖ ను ఎపుడో ఆర్థిక రాజధానిగా ప్రకటించాం
‘విశాఖపట్టణం అభివృద్ధి కి తెలుగుదేశం వ్యతిరేకం కాదు. అందుకే విశాఖ ను ఆర్ధిక రాజధాని గా ప్రకటించాం. ఐటీ హబ్ గా విశాఖ అభివృద్ధి కి శ్రీకారo చుట్టాం. పర్యాటక కేంద్రంగా విశాఖ పరిసర ప్రాంతాల అభివృద్ధి కి పూనుకున్నాం. సచివాలయం లేదా అసెంబ్లీ అక్కడ పెడితే అది అభివృద్ధి కాదు. అసెంబ్లీ ఓ దగ్గర, సచివాలయం మరో ప్రాంతంలో ప్రపంచంలో ఎక్కడా లేదు. నాపై కోపంతో ప్రజల్ని హింసించడం తగద,’ అని చంద్రబాబు అన్నారు.