కృష్ణా, గోదావరి నదుల యాజమాన్య బోర్డుల మీద నోటిఫికేషన్?

కృష్ణా, గోదావరి నదుల యాజమాన్య బోర్డుల అధికార పరిధులను నోటిఫై చేయడంలో కేంద్ర ప్రభుత్వం తీవ్ర అలసత్వం ప్రదర్శించింది. రాష్ట్ర విభజన జరిగిన ఏడేళ్ళ తదనంతరం ఇప్పుడు బోర్డుల అధికార పరిధులను నిర్ధేశిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేయబోతున్నట్లు ప్రసారమాధ్యమాల్లో వార్తలొచ్చాయి. నాగార్జునసాగర్, శ్రీశైలం జలాశయాల దగ్గర రెండు రాష్ట్రాలు జుట్లు పట్టుకొన్న చేదు అనుభవాల నేపథ్యంలో విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఆ పని ఎప్పుడో చేసి ఉండాల్సింది.

పాలమూరు – రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను కూడా ఆ నోటిఫికేషన్ ప్రస్తావించబోతున్నారని, పర్యవసానంగా ఆంధ్రప్రదేశ్ కు నష్టం వాటిల్లబోతున్నదన్న అపోహలను రేకిత్తించడం మంచిది కాదు. ఈ రెండు ఎత్తిపోతల పథకాలకు అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదు. అవి అక్రమ నిర్మాణాలుగానే భావించబడుతున్నాయి. వాటిని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసే ప్రాజెక్టుల జాబితాలో చేసే అవకాశమే లేదు. ఒకవేళ ఎవరి ప్రోద్భలంతోనైనా చేర్చితే కేంద్ర ప్రభుత్వం చట్ట వ్యతిరేకంగా వ్యవహరించినట్లవుతుంది.

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014, సెక్షన్ 85(1) నదీ యాజమాన్య బోర్డుల ఏర్పాటు మరియు విధులు: గోదావరి నది యాజమాన్య‌ బోర్డు, కృష్ణా నది యాజమాన్య బోర్డు అని పిలవబడే రెండు వేర్వేరు బోర్డులను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. కేంద్రం ప్ర‌భుత్వం ఎప్పటికప్పుడు నోటిఫై చేసే ప్రాజెక్టుల పరిపాలన, నియంత్రణ, నిర్వహణ మరియు ఆపరేషన్ చేయడం ఆ బోర్డుల బాధ్యత.

సెక్షన్ 87(1) బోర్డు యొక్క అధికార పరిధి: గోదావరి మరియు కృష్ణా నదులపై నిర్మించబడి ఉన్నహెడ్‌వర్క్స్ (ఆనకట్టలు, జలాశయాలు, నియంత్రణ నిర్మాణాలు), కాలువల‌ వ్యవస్థలో భాగం, నీటిని, విద్యుత్తును సరఫరా చేయడానికి సంబంధిత రాష్ట్రాలలో నెలకొల్పబడిన వ్యవస్థ పై కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన ప్రకారం, అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం, 1956 కింద ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్స్ ఇచ్చిన తీర్పులకు లోబడి బోర్డులు అధికార పరిధిని కలిగి ఉంటాయి.

(2) ఏదైనా ప్రాజెక్టు మీద సబ్_సెక్షన్ (1) క్రింద‌ బోర్డుకు అధికార పరిధి ఉందా అన్న ప్రశ్న తలెత్తితే దానిపై నిర్ణయం కోసం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి.

 

-టి.లక్ష్మీనారాయణ, సామాజిక ఉద్యమకారుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *