బోండా ఉమ, బుద్దా వెంకన్న మీద దాడి ఇలా జరిగింది: లాయర్ కిశోర్

మాచర్ల : ఈ రోజు గుంటూరు జిల్లాలోని మాచర్లలో టీడీపీ నేతలు బొండా ఉమామహేశ్వర రావు, బుద్దా వెంకన్న, హైకోర్టు న్యాయవాది కిశోర్‌లపై వైసీపీ వర్గీయులు దాడి చేశారు. ఈ దాడిలో టీడీపీ నేతల వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. తప్పించుకుని టీడీపీ నేతలు అక్కడి నుంచి నల్గొండకు వెళ్లిపోయారు.
 ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు.. లాయర్ కిశోర్‌తో మాట్లాడారు. అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కిశోర్ మాట్లాడుతూ.. దాడి ఎలా జరిగిందో లాయర్ కిశోర్ వివరించారు:
‘‘తెలుగుదేశం కార్యకర్తలకు న్యాయ సలహా ఇవ్వడానికి మేం మాచర్ల వెళ్లాం.మా వెనక కార్లో బొండా ఉమా, బుద్దా వెంకన్న ఉన్నారు. అయితే, అక్కడున్న వైసీపీ కార్యకర్తలు మా వాహనాలపై దాడి చేశారు. నాకు కూడా గాయమైంది, రక్తంకారుతూ ఉంది. కాని, మా డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి అక్కడి నుంచి నల్లగొండకు కారును తీసుకెళ్లారు. మేం నాగార్జున సాగర్ మీదుగా నల్లగొండ చేరుకున్నాం. వారు 10 వాహనాలతో మమ్మల్ని వెంబడిస్తుూ వచ్చారు.”
మాచర్లలో తమపై వైసీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారని, దాడి నుంచి బతికబయటపడతామన్న నమ్మకం కూడా లేకుండా ఉండిందని బోండా ఉమ వెల్లడించారు. వైసీపీ కార్యకర్తలు తమ గన్‌మెన్‌పై కూడా దాడికి పాల్పడ్డారని ఆయన చెప్పారు. వెల్దుర్తిలో డీఎస్పీ వాహనంలో తాము వెళ్తుంటే వైసిపి కార్యకర్తులు మళ్లీ అడ్డుకున్నారని.. డీఎస్పీపై కూడా వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని ఆయన చెప్పారు. పోలీసులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఉందని బోండా ఉమ వెల్లడించారు.

డిజిపి స్పందన

మాచర్ల సంఘటన పై సత్వరమే డీజీపీ గౌత మ్ సవాంగ్ స్పందించారు. మాచర్లలో ఏంజరిగిందో  సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు జరిపి  నివేదిక సమర్పించాల్సింది గా ఆయన గుంటూరు ఐ.జి ని ఆదేశించారు.
మాజీ మంత్రి కెఇ కృష్ణమూర్తి ఖండన
ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతో టీడీపీ నేతల నామినేషన్లను అడ్డుకుంటున్నారు. మాచర్లలో నామినేషన్ వేసేందుకు వెళ్లిన తెలుగుదేశం పార్టీ నేతల నుండి నామినేషన్ పత్రాలు దౌర్జన్యంగా లాక్కుని చించేశారు. ఆ ఘటనపై న్యాయపరంగా చర్యలు తీసుకోవడానికి సంబంధించి వెళ్లిన నేతలపై దాడి చేస్తారా?
రాళ్లు, కర్రలు, రాడ్లతో దాడి చేస్తారా.? రాష్ట్రంలో ఫ్యాక్షన్ సంస్కృతి, కక్షా రాజకీయాలు ఎంతలా పేట్రేగిపోతున్నాయో చెప్పడానికి ప్రస్తుత ఘటనే సాక్ష్యం. మాజీ మంత్రిపైన, ఎమ్మెల్సీపైన వైసీపీ యువజన నేతలు బరితెగించి దాడికి పాల్పడ్డారంటే సామాన్యుల పరిస్థితి ఏమిటి.? అసలు ప్రజలకు జగన్ ప్రభుత్వంలో రక్షణ ఉందా?
పోలీసులపై కూడా దాడికి పాల్పడ్డారంటే.. వారి వెనుక ముఖ్యమంత్రి జగన్ లేరని చెప్పగలరా.? అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా.. రాక్షస రాజ్యంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతోంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే రాష్ట్రం రావణ కాష్టం అవుతుందని మొదటి నుంచి చెబుతూనే ఉన్నాం.
ఇప్పుడు అది నిజమని తేలింది. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించండి. ప్రజా స్వామ్యాన్ని పరిరక్షించే వారిని ఎన్నుకోవడంలో కీలకంగా వ్యవహరించండి.