ఆంధ్రా స్కూళ్లకు వేసవి శెలవులు రద్దు, జూన్ 17 నుంచి టెన్త్ పరీక్షలు?

కోవిడ్ సంక్షోభం తర్వాత ఇపుడు మొదలవుతున్న విద్యా సంవత్సరం చెల్లాచెదురుకావడం, తరగతులు ఆలస్యంగా ఆరంభించడం వేసవి శెలవులు రద్దు చేయాలని రాష్ట్ర విద్యా శాఖ పి విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

టెన్త్‌ విద్యార్థులకు సిలబస్‌ బోధన పూర్తి చేయడానికి పని దినాలు సర్దుబాటు కావాల్సి ఉంది. ఈ దృష్ట్యా టెన్త్‌ విద్యార్థులకు వేసవి సెలవులు లేకుండా తరగతులను కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు. సిలబస్‌ పూర్తి చేయడానికి, విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధులను చేయడానికి 160 పనిదినాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. రెండో శనివారాలు, ఆదివారాలు మినహా తక్కిన అన్ని రోజులను పని దినాలుగానే ఉంటాయి.

ఇదే విధంగా రాష్ట్రంలో 2020–21 విద్యా సంవత్సరంలో టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలను  7 పేపర్లకు కుదిస్తున్నారు.   స్కూళ్లలో ప్రత్యక్ష తరగతుల నిర్వహణ 5 నెలలు ఆలస్యంగా నవంబర్‌ 2 నుంచి ఆరంభమైన నేపథ్యంలో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

పబ్లిక్‌ పరీక్షలను జూన్‌ 17వ తేదీ నుంచి నిర్వహించాలని యోచిస్తున్నారు.  టెన్త్‌ పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ బుధవారం సచివాలయంలో పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అనేక నిర్ణయాలు తీసుకున్నారు.

 సైన్స్‌లో రెండు పేపర్లు

కరోనా కారణంగా గత ఏడాదిలో విద్యాశాఖ పరీక్ష పేపర్లను 11 నుంచి 6 కు కుదించింది. ఆ మేరకు పరీక్షల నిర్వహణకు షెడ్యూల్‌ ప్రకటించినా కరోనా తీవ్రత కారణంగా రద్దు చేసి విద్యార్థులందరినీ ఆల్‌పాస్‌గా ప్రకటించిన వషయం తెలిసిందే.

ఈ విద్యా సంవత్సరంలో కూడా తరగతులు ఆలస్యం కావడంతో సిలబస్‌ కుదించి బోధన చేయిస్తున్నారు. దీంతో పాటు బోధనాభ్యసన కార్యక్రమాలు పూర్తిస్థాయిలో జరగనందున గత ఏడాది మాదిరిగానే ఈ సారి పేపర్ల సంఖ్యను 7కు కుదించారు.

గత ఏడాది భాషా పేపర్లతో పాటు సబ్జెక్టు పేపర్లను కలిపి 6కు కుదించారు. ఈసారి భాషా పేపర్లు, సైన్స్‌ మినహా ఇతర సబ్జెక్టు పేపర్లను ఒక్కొక్కటి చొప్పున 5 ఉంటాయి. సైన్స్‌లో మాత్రం భౌతిక శాస్త్రం, వృక్ష శాస్తాలకు సంబంధించి వేర్వేరు పేపర్లుగా ఉంటాయి. మొత్తం 7 పేపర్లలో విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉంటుంది.

 100 మార్కులకే పరీక్ష

నిరంతర సమగ్ర విద్యా మూల్యాంకనం (సీసీఈ) ప్రకారం టెన్త్‌లో గతంలో ఆయా పేపర్లలో 80 మార్కులకు పరీక్షలు నిర్వహించే వారు. 20 మార్కులను అంతర్గత పరీక్షల మార్కుల నుంచి కలిపేవారు. అంతర్గత మార్కుల విషయంలో ప్రైవేట్‌ పాఠశాలల్లో అక్రమాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదుల మేరకు ప్రభుత్వం రెండేళ్ల క్రితం వాటిని రద్దు చేసి టెన్త్‌లో అన్ని పేపర్లను 100 మార్కులకు నిర్వహిస్తోంది. ఈ విద్యాసంవత్సరంలో కూడా అదే విధానంలో ఒక్కో పేపర్‌ను 100 మార్కులకు నిర్వహించనున్నారు. జూలై మొదటి వారంలో ఫలితాలు విడుదల చేయాలని భావిస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *