ఆంధ్రలో విద్యార్థులందరికి ఉచితంగా స్మార్ట్ ఫోన్లు

కరోనా వ్యాప్తి భయం వల్ల ముఖాముఖి తరగతుల బదులు డిజిటల్ క్లాసులను ప్రోత్సహించాలని ఆంధ్రప్రదేశ్ నిర్ణయించింది.  9వ తరగతి నుంచి ఇంటర్‌ వరకూ ఆన్ లైన్ క్లాసులు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాటుచేస్తున్నది. దీనికోసం చదివే విద్యార్థులకు స్మార్ట్ ఫోన్ లు కూాడా అందివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతివిద్యార్థికి  రూ.5 వేల నుంచి రూ.6 వేల విలువగల స్మార్ట్‌ఫోన్లు ఇవ్వాలని సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ నిర్ణయించింది.
నిరుపేద విద్యార్థుల కుటుంబాలపై ఆర్థికభారం పడకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే  సొసైటీ పరిధిలోని గురుకులాల్లో చదివే 60వేల మంది విద్యార్థుల్లో 30-40 శాతం మందికి మాత్రమే స్మార్ట్‌ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. వీళ్లకి డిజిటల్ క్లాసులు అందుబాటులోకి తీసుకురావడం కష్టంకాదు. ఇక మిగిలింది ఇతర పాఠశాలల విద్యార్థులే. వారికి స్మార్ట్ ఫోన్లు అందించాలని సొసైటీ నిర్ణయించింది.
శుక్రవారం తాడేపల్లిలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపె విశ్వరూప్‌ అధ్యక్షతన జరిగిన సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ పాలకమండలి సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.
సమావేశంలో తీసుకున్న ఇతర నిర్ణయాలు:
నెలకు ఒక్కో పాఠశాలకు 300 లీటర్ల సోడియం హైపోక్లోరైట్‌, 150 లీటర్ల సబ్బు ద్రావణం సరఫరా. 189 గురుకులాల్లో ఆంగ్ల ల్యాబ్‌ల ఏర్పాటు
* విశాఖపట్నంలో 2, నెల్లూరు, తిరుపతి, రాజమహేంద్రవరంలో ఒక్కొక్కటి చొప్పున కొత్తగా ఐఐటీ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలి.
* విద్యార్థులకు ఆహారం తయారీ, క్యాటరింగ్‌ను పొరుగుసేవల విధానంలో అప్పగించాలి.
* కొత్తగా 34 గురుకులాల్లో అటల్‌ టింకరింగ్‌ ప్రయోగశాలలను ఏర్పాటు చేయాలి.
* పరిశుభ్రత, పచ్చదనంలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తూ తొలిస్థానంలో నిలిచిన గురుకులానికి రూ.50 వేలు, ద్వితీయ స్థానానికి రూ.30 వేలు ప్రోత్సాహకంగా ఇవ్వాలి.