పెన్షనర్ల జీతాల్లో కోత విధించవద్దు : ముఖ్యమంత్రికి శ్రవణ్ దాసోజు విజ్ఞప్తి

 తెలంగాణ పెన్షనర్ల జీతాల్లో కోత విధించవద్దని ముఖ్యమంత్రికి ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు విజ్ఞప్తి చేశారు.
కోవిడ్-19 వైరస్ మహమ్మారిని ఎదుర్కొనే చర్యలో భాగంగా జీవోఎంఎస్ 27, తేదీ 30 మార్చి, 2020 ద్వారా రాష్ట్రంలో శాసన సభ్యుల, ఆల్ ఇండియా సర్వీసులు, ఇతర ప్రభుత్వోద్యోగుల జీతాలో కోత విధించాలని  ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో  పెన్షనర్ల ను  కూడా చేర్చి వారి జీతాల్లో కోత విధించాలనుకోవడం దురదృష్టకరమని ఆయన  పేర్కొన్నారు.
ఈ నిర్ణయం 30, 40 ఏళ్ళుగా ప్రభుత్వ ఉద్యోగులుగా పని చేసి, ఈరోజు కేవలం పెన్షన్ మీదనే ఆధారపడి జీవనం గడుపుతున్న వృద్ధులకు తీవ్రమైన మానసిక క్షోభ కలిగించడంతో పాటు కనీస అవసరాలు తీర్చుకోలేని దుస్థి ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు.
చాలామంది రిటైర్డు ఉద్యోగులుఒకవైపు సొంత ఇల్లు లేక కిరాయి ఇండ్లలో మగ్గుతూ మరోవైపు రోగాలతో నానా ఇబ్బందులకు గురవుతూ, వచ్చే పింఛన్లు సరిపోక నానా ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.
దాసోజు ఇంకా ఏమన్నారంటే…
ఇప్పుడు వస్తున్న చాలీచాలని పెన్షన్ లో 50 శాతం కోత విధిస్తే వాళ్ళు మందులు కొనుక్కోవడానికి కానీ, ఇంటికి కిరాయిలు కట్టుకోవడానికి కానీ, నిత్యవసర వస్తువులు కొనుక్కోవడానికి కానీ డబ్బులు లేక నానా ఇబ్బందులు గురి అయ్యే పరిస్థితి ఉంది.
అంతే కాకుండా రిటైర్డ్ ఉద్యోగి చనిపోయిన తరువాత అతని పై ఆధారపడి ఉన్న భార్యకు వచ్చే పెన్షన్ దాదాపు 50 శాతం కంటే తక్కువగానే ఉంటుంది. ఉదాహరణకు రూ . 20 వేల రూపాయల పెన్షన్ తీసుకుంటున్న రిటైర్డ్ ఉద్యోగి ఒకవేళ మరణిస్తే అతని భార్య కు వచ్చే ఫ్యామిలీ పెన్షన్ కేవలం రూ .9 వేలు రూపాయలు కూడా సరిగ్గా రాదు. ఇలాంటిప్పుడు ఫ్యామిలీ పెన్షన్ లో కూడా 50 శాతం కోత విధించినట్లయితే, ఆ కుటుంబాలు బిచ్చమెత్తుకొని బతకాల్సిన దుస్థితి ఏర్పడుతుంది.
కాబట్టి మానవీయ దృక్పథంతో ఫ్యామిలీ పెన్షన్ లతో పాటు మొత్తం సర్వీస్‌ పెన్షనర్లు జీతభత్యాలను కూడా కోత విధించవద్దని ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు .