తెలంగాణ జర్నలిస్ట్ 72 గంటల సమాధి నిరసన

తెలంగాణలో రెవెన్యూ అధికారుల తీరుతో ఒక జర్నలిస్ట్ కడుపు రగిలింది. వారి అవినీతి అక్రమాల మీద కలంతో పోరాడి ఓడిపోయిన జర్నలిస్ట్ తుదకు సమాధిలో 72 గంటల నిరసనకు దిగాడు. ఆయనకు వచ్చిన కష్టం ఏమిటి? ఆయన ఎవరు? ఎందుకు నిరసనకు దిగాడు? పూర్తి వివరాలు చదవండి. ఆయన మాటల్లో…

డియర్ ఫ్రెండ్స్
*22 సంవత్సరాల నుంచి జర్నలిస్టు గా పనిచేస్తున్నాను.ఈనాడు, ఆంధ్ర జ్యోతి, నమస్తే తెలంగాణతో పాటు ఈటివి,స్టూడియో ఎన్,జెమిని టివి,ఏపి 24×7 న్యూస్ ఛానల్ రిపోర్టర్ గా మహబూబాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాలో పనిచేసాను.ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏపి 24×7 జిల్లా ఇంఛార్జి గా పనిచేస్తున్నాను.

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం పెరుమాళ్ల సంకీస గ్రామంలో మా తాతల నుంచి మాకు సంక్రమించిన భూమిని.. మా ప్రమేయం లేకుండా అవినీతి అధికారులు ఏకపక్షంగా రికార్డులను ట్యాంపరింగ్ చేసి ఇతరులకు ధారాధత్తం చేసారు. మా నాన్న మారెడ్డి అప్పిరెడ్డి చనిపోయిన తరువాత రెవిన్యూ రికార్డులను పరిశీలిస్తే…. 2012-13 లో అక్రమంగా ఆర్.ఓ.ఆర్ చేసినట్లు గుర్తించాను.ఏడాదిన్నర నుంచి పోరాటం చేస్తున్నాను. రెవిన్యూ అధికారుల ధన దాహనికి నాతో పాటు వందలాది మంది రైతులు దగా పడ్డారు. రెవిన్యూ రికార్డుల ట్యాంపరింగ్ ను ఆధారాలతో సహా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాను. ఎవరికి వారు ఉచిత సలహాలు ఇచ్చారు తప్ప రికార్డులను మార్చిన అవినీతి అధికారులపై చర్యలు తీసుకోలేదు. అవినీతి అధికారుల వలన రెండు సంవత్సరాల నుంచి రైతుబంధు పథకం ద్వారా లబ్ధిపొందలేదు. అవినీతి చేసిన అధికారులు మాత్రం కోట్లు సంపాదించారు. నాకు జరిగిన అన్యాయంపై గళం విప్పాను.అయినా చర్యలు శూన్యం. నా 22 సంవత్సరాల మీడియా జీవితంలో ఎందరికో అండగా ఉన్నాను.అవినీతి అధికారుల భరతం పట్టాను. రెవిన్యూ, పోలీసు, రవాణాశాఖ, పంచాయతీరాజ్, విద్యాశాఖ లో అధికారులను సస్పెండ్ చేయించాను. అయినా నాకు జరిగిన అన్యాయంపై చర్యలు లేవు.

కలెక్టర్ ను కలిసా…ఆర్డివో కోర్టు లో అప్పీల్ చేసుకోమన్నాడు. తప్పు రెవిన్యూ వాళ్లది అయితే… నేను ఎందుకు అప్పీల్ కు వెళ్లాలి. ఎవరిని అడిగి రికార్డులను మార్చారు అంటే సమాధానం లేదు. ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు రికార్డులను మార్చవచ్చా… ఎకరానికి 5 నుంచి10 వేలు తీసుకుని రికార్డులను ఇష్టానుసారంగా మార్చారు. అవినీతికి పాల్పడిన వి.ఆర్.ఓ రాంబాబు, ఆర్.ఐ లక్ష్మణ్, తహశీల్దారు విజయ్ కుమార్ మీద పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసాను. అయినా చర్యలు శూన్యం. వ్యవస్థ మీద విసిగిపోయాను. అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని 72 గంటల నిరసన దీక్ష కు సిద్ధం అయ్యాను.నా దీక్ష కు మీ సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరుతున్నాను. నాకు ఎక్కడ అన్యాయం జరిగిందో… అక్కడే….మా వ్యవసాయ క్షేత్రంలో శాంతియుతంగా రేపు(20వ తేదీన) ఉదయం దీక్ష చేపడుతున్నాను.రాజకీయాలకు అతీతంగా మీ మద్దతు కోరుతూ
మారెడ్డి నాగేoదర్ రెడ్డి
సీనియర్ జర్నలిస్టు
ఉమ్మడి ఖమ్మం జిల్లా
99486 73832