తనదయిన శైలిలో విప్లవ గీతాలు ఆలపించిన తెలుగు రాష్ట్రాల విప్లవోద్యమ సాంస్కృతిక కళాకారుడు ఆరుణోదయ రామారావు (65) హఠాత్తుగా హైదరాబాద్ లో మృతిచెందారు.ఆయన ఇంటిపెరెవరికి తెలియదు, ఆయన ఆరుణోదయ రామారావుగానే ప్రజలకు పరిచయం.
ఆయన సిపిఐ (ఎంఎల్) చండ్రా పుల్లారెడ్డి వర్గానికి అనుబంధంగా ఉన్న అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఏపీ అధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రామారావుకు ఈ ఉదయం గుండెపోటు రావడంతో హైదరాబాద్ లోని దుర్గాబాయి దేశ్ ముఖ్ ఆసుపత్రికి తరలించారు.
మధ్యాహ్నం మరోసారి స్ట్రోక్ రావడంతో చికిత్స పొందుతూ 02:45 గంటలకు మృతిచెందినట్లు బంధువులు చెప్పారు.
రామారావు స్వస్థలం కర్నూలు జిల్లా ఆదోని.
40 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లోని వామపక్ష ఉద్యమాల్లో క్రియాశీలపాత్ర పోషించారు. ఆయన పాట, బాణి విశిష్టమయినవి.గద్దరు దొక శైలి అయితే, అరుణోదయ రామారావు తెలుగునాటక శైలితో జనాన్ని ఆకట్టుకునేవారు.
‘వీరగాథల పాడారా‘ అంటూ తన స్వరంతో ప్రజలను వుర్రూత లూగించే వారు. ఉయ్యాలో….జంపాలా అని జంపాల చంద్రశేఖర్ మీద ఆయన పాడే పాట ఆరోజుల్లో యువకులను ఎంతో ఉత్తేజ పరిచేది
ఆయన భౌతికకాయాన్ని సందర్శించేందుకు తరలివస్తున్న వామపక్షాలు, ప్రజాసంఘాల నేతలు.
ప్రజాసందర్శన కోసం మృతదేహాన్ని విద్యానగర్ లోని మార్క్స్ భవన్ కు తరలించారు.