విపక్షాల మాయమాటలకు కార్మికులు మోసపోవొద్దు

మహబూబాబాద్ : ప్రజల్లో బలంలేని ప్రతిపక్షాల మాయమాటలను నమ్మిగానీ, స్వార్థ ప్రయోజనాలకోసం పాకులాడుతున్న యూనియన్ల నాయకులను నమ్మిగానీ ఆర్టీసి కార్మికులు మోసవపోవద్దని, బేషరతుగా ఈరోజు అర్ధరాత్రిలోపు ఉద్యోగాల్లో చేరాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు కోరారు. ఆర్టీసి సమ్మె-కార్మికుల భవిష్యత్ పై నేడు మహబూబాబాద్ లోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌజ్ లో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు.
    ఆర్టీసిని బలోపేతం చేసేందుకు సిఎం కేసిఆర్ గారు వైస్రాయి హోటల్ లో రోజంతా సమావేశం పెట్టి  యూనియన్లు, అధికారులతో చర్చించారని, ఆర్టీసిని లాభాల బాటలో నడిపించేందుకు ముఖ్యమంత్రి కృత నిశ్చయంతో ఉన్నారని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. గతంలో రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కేసిఆర్ గారు బస్ డిపోలు తిరిగి వాటి పరిస్థితి సమీక్షించి, నష్టాల్లో ఉన్న ఆర్టీసిని లాభాల బాటలో నడిపించారని గుర్తు చేశారు.
    ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆర్టీసికి 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చి, ఐఆర్ ఇచ్చి కార్మికుల వేతనాలు భారీగా పెంచారని, ఆర్టీసిని లాభాల్లోకి తీసుకొచ్చేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నా…యూనియన్ల స్వార్థ ప్రయోజనాల కోసం కార్మికులను సమ్మెకు ఉసిగొల్పుతూ నష్టాల్లోకి తీసుకెళ్తున్నారని తెలిపారు.
తెలంగాణలోనే పెద్ద పండగలైన దసరా, బతుకమ్మ పండగల సందర్భంగా ఆర్టీసికి మంచి రాబడి ఉంటుందని, నష్టాల్లో ఉన్న ఆర్టీసి ఆ సందర్భాన్ని వినియోగించుకోకుండా సమ్మెకు పోవడం వల్ల మరింత నష్టాలు వస్తున్నాయని వివరించారు.
    తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అంగన్ వాడీలు, ఆర్టీసి, ఐకేపి ఫీల్డ్ అసిస్టెంట్లు, వీఆర్ఏలు, విఏఓలు, కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్లు, పార్ట్ టైం లెక్చరర్లు, సెర్ప్ ఉద్యోగులు, ఏఎన్ఎంలు, వాచ్ మెన్లు, స్వీపర్లు, రేషన్ డీలర్ల వంటి ఉద్యోగులందరికీ భారీగా వేతనాలు పెంచిన కార్మిక, ఉద్యోగ పక్షపాతి సిఎం కేసిఆర్ అన్నారు.
    ప్రభుత్వంలో విలీనం తప్ప మిగిలిన డిమాండ్లపై చర్చించాలని హైకోర్టు సూచించినా ఆర్టీసి యూనియన్లు విలీనం తప్ప మరేదానిపై మాట్లాడమని మొండి పట్టు పట్టి కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
    ప్రజల్లో బలం లేని ప్రతిపక్ష పార్టీలు ఆర్టీసి సమ్మెను తమ రాజకీయం కోసం వాడుకుంటున్నాయని, దీనిని ఆర్టీసి కార్మిక, ఉద్యోగ కుటుంబ సభ్యులు గుర్తించాలని కోరారు.
ఉద్యోగాలు లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారని, ఉన్న ఉద్యోగాన్ని ఎవరి మాటలో నమ్మి పోగోట్టుకోవద్దని విజ్ణప్తి చేశారు. ఉద్యోగుల కుటుంబ సభ్యులు వెంటనే ఉద్యోగానికి వచ్చేలా వారిని ఒత్తిడి చేయాలన్నారు.
    ఆర్టీసి సమ్మెకు మద్దతిస్తున్న ప్రతిపక్ష పార్టీల బలం ఏమిటో మొన్న హుజూర్ నగర్ ఎన్నికల్లో తేటతెల్లమైందని తెలిపారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టే విధంగా ప్రజలు తీర్పు ఇచ్చారని, ఈ తీర్పు ప్రతిపక్షాలకు చెంపపెట్టువంటిదని అభివర్ణించారు.
    సమ్మెను సమర్ధిస్తూ, ప్రోత్సహిస్తున్న బిజెపి కేంద్రంలో పార్లమెంట్ లో ఆర్టీసిని ప్రైవేట్ పరం చేయాలని తీసుకొచ్చిన మోటార్ వెహికల్ బిల్లుకు అక్కడ ఓటేసి, ఇక్కడ మాత్రం ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ ద్వంద్వ నీతికి పాల్పడుతోందని విమర్శించారు. కేంద్రం తీసుకొచ్చిన చట్టం ఆధారంగానే సిఎం కేసిఆర్ గారు ప్రైవేట్ వాహనాలకు పర్మిట్లు ఇస్తున్నారని వివరించారు.
    ప్రజలతో తిరస్కారానికి గురైన కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పాలిత ఏ రాష్ట్రంలో కూడా ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయలేదని, పైగా ఆర్టీసి నష్టాల్లోకి వెళ్లడానికి కారణమై, నేడు ఆర్టీసిని తెలంగాణలో ప్రభుత్వంలో విలీనం చేయాలనడం వారి రాజకీయ దిగజారుడుకు నిదర్శనమన్నారు.
    ఆర్టీసి కార్మికులు, ఉద్యోగులు విధుల్లో చేరుతామని వస్తుంటే…యూనియన్ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం వారిని అడ్డుకుంటున్నారని, దాడులు చేస్తున్నారని, ఇలాంటి పరిస్థితి మంచిది కాదని హితవు పలికారు.
    ఇప్పటికైనా ఆర్టీసి కార్మికులు ముఖ్యమంత్రి కేసిఆర్ పిలుపు మేరకు వెంటనే విధుల్లో చేరాలని కోరారు. ముఖ్యమంత్రి పిలుపు మేరకు విధుల్లో చేరిన తర్వాత కార్మికుల భవిష్యత్ కు సిఎం కేసిఆర్ గారు అండగా ఉంటారని తెలిపారు.
    సోమవారం నాడు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహశిల్దార్ కార్యాలయంలో దుండగుని దాడిలో సజీవ దహనానికి గురైన తహశిల్దార్ విజయ రెడ్డి మృతికి మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ సంతాపం తెలిపారు. ఆమెపై పెట్రోల్ పోసి దాడి చేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిపై, వారి వెనుక ఉన్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి పనులకు తావులేదని, ఇది ఉద్యోగుల సంక్షేమాన్ని కాంక్షించే ప్రభుత్వమని చెప్పారు. విజయరెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

ఈ సమావేశంలో మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత మాట్లాడుతూ…ముఖ్యమంత్రి కేసిఆర్ ఉద్యోగుల సంక్షేమాన్ని కోరుకునే సిఎం అని, ఆయన పిలుపుమేరకు స్వచ్ఛందంగా వచ్చి వెంటనే విధుల్లో చేరాలని కోరారు. కార్మికులు ఇబ్బంది పడితే…ఈ ప్రభుత్వం కూడా ఇబ్బంది పడినట్లు భావించిన సిఎం కేసిఆర్ గారు ఇప్పటికీ మూడుసార్లు కార్మికులను విధుల్లో చేరాలని అందుకే కోరారని తెలిపారు. విధుల్లో చేరిన కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.

ఈ సమావేశంలో జడ్పీ చైర్ పర్సన్ అంగోతు బిందు పాల్గొన్నారు.