ముక్కోటి ఏకాదశి కి ముస్తాబైన తిరుమల (ఫోటో గ్యాలరీ)

తిరుమల, 05 జ‌న‌వ‌రి 2020: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జ‌న‌వ‌రి 6న వైకుంఠ ఏకాదశి, 7న వైకుంఠ ద్వాదశి పర్వదినాలకు ఏర్పాట్లు పూర్త‌య్యాయి. ఈ సంద‌ర్భంగా శ్రీ‌వారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఇందులో భాగంగా జ‌న‌వ‌రి 6న తెల్లవారుజామున 12.30 నుండి 2 గంటల వరకు ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావైతో శ్రీవారిని మేల్కొలిపి, ధనుర్మాస కైంకర్యాలు, తోమాల, కొలువు, పంచాంగ శ్ర‌వ‌ణం నిర్వహిస్తారు. అనంతరం భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారని తితిదే ప్రజాసంబంధాలవిభాగం తెలిపింది.
ఉద‌యం 9 గంట‌ల‌కు స్వ‌ర్ణ‌ర‌థం
ఉదయం 9 నుండి 11 గంటల నడుమ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు స్వర్ణరథంపై ఆలయ నాలుగుమాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు. సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు సహస్రదీపాలంకార సేవ కన్నులపండుగగా జరుగనుంది. అనంతరం స్వామివారు ఉభయనాంచారులతో క‌లిసి తిరుచ్చిపై నాలుగుమాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి 8.30 నుండి 9.30 గంట‌ల వ‌ర‌కు రంగ‌నాయ‌కుల మండ‌పంలో అధ్య‌య‌నోత్స‌వ కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తారు.
జ‌న‌వ‌రి 7న చ‌క్ర‌స్నానం
జ‌న‌వ‌రి 7వ తేదీన‌ వైకుంఠ ద్వాదశి పర్వదినాన స్వామి పుష్కరిణి తీర్థ ముక్కోటి తిరుమలలో ఘనంగా జరుగనుంది. ఈ సందర్భంగా ఉదయం 4.30 గంటల నుండి 5.30 గంటల వరకు శ్రీ చక్రత్తాళ్వార్లను నాలుగుమాడ వీధులలో ఊరేగింపుగా తీసుకెళ్లి వరాహస్వామి ఆలయం చెంత గ‌ల‌ స్వామివారి పుష్కరిణి తీర్థంలో చక్రస్నానం నిర్వహిస్తారు.
ఆర్జిత సేవ‌లు ర‌ద్దు
వైకుంఠ ఏకాద‌శి, ద్వాద‌శి ప‌ర్వ‌దినాల నేప‌థ్యంలో జ‌న‌వ‌రి 5 నుండి 7వ తేదీ వ‌ర‌కు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం ఆర్జిత‌సేవ‌ల‌ను టిటిడి రద్దు చేసింది.