వైరల్ అవుతున్న ఈ ఫోటో వెనక అసలు కథ తెలుసా!

ఈ ఫోటో ఇపుడు “రాయలోరి పాలనలో రోడ్లపై వజ్ర వైడూర్యాలు, రత్నాలు రాసుల పోసి అమ్మేవారని పాఠ్య పుస్తకాల్లో మాత్రమే చదివాం…జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో నడిరోడ్డుపై సేరుల్లో ఇసుక అమ్మడం నా జీవితంలో ఫస్ట్ టైమ్ చూస్తున్నా” అనే క్యాప్షన్ తో వైరల్ అవుతూ ఉంది.
కానీ ఇది నిజం కాదు. ఫోటో నిజం గాని క్యాప్షన్ అబద్దం. అయితే ఫోటో వెనక ఉన్న కథని ఫ్యాక్ట్ చెకర్ ఒకరు బయట పెట్టారు.
ఇదిగో చదవండి.
ఇసుక బేరం.. సోషల్‌ మీడియా ఆగమాగం
సోషల్‌ మీడియాలో కొంతకాలంగా ప్రతీదీ వింత అయిపోయింది. ఏ ఒక్క ఫోటో విభిన్నంగా కనిపించినా.. ఏ చిన్నపాటి వీడియో చూసినా ఎవరి ఆలోచనలకు తగ్గట్లు, ఎవరి వైఖరికి తగ్గట్టు వాళ్లు అన్వయించుకుంటున్నారు.
సొంత కామెంటరీని జోడించి వైరల్‌ చేస్తున్నారు. అది చివరి యూజర్‌కు చేరుకునే సరికి పూర్తి స్వరూపమే మారిపోతోంది. రెండు రోజుల క్రితం ఓ ఫోటో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది.
కరీంనగర్‌ జిల్లా ఇప్పటి పెద్దపల్లి జిల్లా పరిధిలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మంథనిలో ఇసుకను డబ్బాల చొప్పున అమ్ముతున్న దృశ్యమది. రెండు రోజులు తిరిగేసరికి ఆ ఇసుక అమ్మకం ఫోటోకు సవాలక్ష సొంత కామెంట్లు జోడయ్యాయి.
రాష్ట్రం ఎల్లలు కూడా దాటిపోయాయి. రాజకీయ రైటప్‌లూ తోడయ్యాయి. చివరకు ఆ ఫోటో ఎక్కడిదో, ఎందుకు అలా అమ్మాల్సి వచ్చిందో అన్న అసలు సంగతి మరుగున పడిపోయింది.
తెలంగాణలో దీపావళి సీజన్‌. దీపావళి పండుగ మొదలుకొని.. కార్తీకపౌర్ణమి దాకా కేదారేశ్వరస్వామి నోములు, వ్రతాలు జరుపుకోవడం ఈ ప్రాంతంలో ప్రధానంగా ఉత్తర తెలంగాణలో ఆనవాయితీ. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లినా, పట్టణ ప్రాంతాల్లో చూసినా దాదాపు 70శాతం మంది కేదారేశ్వరస్వామి నోము నోచుకుంటారు.
ఆ వ్రతంలో భాగంగా.. పవిత్రమైన నోము పాత్రలను గొలుసు (పారేనీళ్లలో అడుగున ఉండే ఇసుక) పైన ఉంచుతారు. యేడాది పాటు.. అత్యంత పవిత్రంగా ఉట్టిమీద ఉంచే నోము కుండలను కిందికి దింపి.. పారే నీళ్లలో నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఇసుక (గొలుసు)పైనే ఉంచుతారు. కింద అస్సలు పెట్టరు. అది ఇక్కడి సంప్రదాయం.
గోదావరి పరీవాహకం ఇరువైపులా ఉన్న ప్రాంతాల్లోని జనం గోదావరి ప్రవాహంలోని గొలుసు (ఇసుక)ను నోము నోచుకునే రోజు ఉదయాన్నే నదీస్నానమాచరించి తీసుకొచ్చి నోము కుండల కింద పేర్చుతారు. అ
. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగా కాళేశ్వరం నుంచి మొదలుకొని ఎగువన గోదావరిఖని , శ్రీపాద సాగర్‌ ప్రాజెక్టు దాకా గోదావరి నిండుకుండలా ఉంది. గతంలో అయితే.. ఈ సమయంలో పాయలు పాయలుగా ప్రవాహం ఉండేది.
ఇప్పుడు పూర్తిగా గోదావరి నిండిపోవడంతో.. ఈ సంస్కృతి, సంప్రదాయం గురించి తెలిసిన మంథని ఆవల మంచిర్యాల జిల్లా, మహారాష్ట్రకు చెందిన కొందరు.. అక్కడి నదులు, ఏరులలో ఇసుకను తీసుకొచ్చి.. నోము పాత్రలకోసం చిన్నడబ్బా ఇసుక రూ.10 చొప్పున అమ్మారు.
ఆ గొలుసు ప్రాధాన్యం తెలిసిన, నోములు నోచుకునే వాళ్లు.. కొనుక్కెళ్లారు. బహుశా కార్తీక పౌర్ణమి వరకే ఈ దృశ్యం కనిపిస్తుంది.
ఆ తర్వాత ఈ పవిత్రమైన గొలుసు (ఇసుక) అవసరం ఎవరికీ ఉండదు. కానీ.. ఈ ఒక్క ఫోటోతో అనేక రైటప్‌లు అల్లి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు.
ఈ సంస్కృతి గురించి తెలియని వాళ్లు ఆ ఫోటోతో పాటు సర్క్యులేట్‌ అవుతున్న రైటప్‌లనే గుడ్డిగా నమ్మాల్సి వస్తోంది. అందుకే ఇలాంటి తప్పుడు ప్రచారాలు, కల్పితాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టాలనే ఉద్దేశ్యంతో ఈ చిన్న ప్రయత్నం చేయాల్సి వచ్చింది.
– సప్తగిరి గోపగాని
Google Fact Check Trainer.