ఎస్కేయు విసి ప్రొ. జయరాజ్ హఠాన్మరణం

అనంతపురం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి జయరాజ్‌ హఠాన్మరణం చెందారు.
ఆదివారం రాత్రి అనంతపురం నుంచి విజయవాడకు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులో బయలుదేరారు. కర్నూలు జిల్లా డోన్‌ వద్దకు వచ్చేసరికి గుండెపోటు రావడంతో బస్సులోనే కుప్పకూలారు.
ఆయనఆరోగ్య పరిస్థితి గమనించిన తోటి ప్రయాణికులు అప్రమత్తమై డోన్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆయనను పరీక్షించిన వైద్యులు అప్పటికే ప్రాణం పోయినట్లు ధ్రువీకరించారు.ఆ
ఆచార్యజయరాజ్‌కు బోధన, పరిశోధన, పరిపాలన రంగంలో 31 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. 1987లో ఎస్కేయూలో అధ్యాపకునిగా చేరారు. ఆర్థిక శాస్త్ర విభాగం అధిపతిగా, డీన్‌ సోషియల్‌ సైన్సెస్‌గా, రాయలసీమ వర్సిటీ రిజిస్ట్రార్‌గా, ఎస్కేయూ ఉపప్రధానాచార్యులుగా, ప్రధానాచార్యులుగా, కళాశాల అభివృద్ధి డీన్‌గా, డీన్‌ స్టూడెంట్స్‌ అఫైర్స్‌గా, సోషియల్‌ ఎక్స్‌క్లూజివ్‌ సంచాలకులుగా వివిధ హోదాల్లో పని చేశారు.
2012లో రాష్ట్ర ఉత్తమ ఆచార్య అవార్డు పొందారు. ఎస్కేయూ ఉపకులపతిగా అక్టోబరు 26న బాధ్యతలు స్వీకరించారు. వర్శిటీ ఉన్నతికి చక్కటి సంస్కరణలో ముందుకు సాగుతున్న వేళ ఆయన హఠాన్మరణం విద్యా వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది.