కెసిఆర్ వి తాటాకు చప్పుళ్లు, భయపడొద్దంటున్న ప్రొ. కోదండరాం

ఆర్టీసీ కార్మికులపై బెదిరింపులకు మాని వాళ్లు లేవనెత్తిన సమస్యలకు  పరిష్కారం చూపాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు   ప్రొఫెసర్ కోదండ రామ్ ముఖ్యమంత్రి సలహా ఇచ్చారు.

అభద్రతలో, ఆందోళనలో బతుకుతున్న 48 వేల కుటుంబాలను మరింత కృంగదీసేలా బెదిరింపులు చేయడం మాని, వెంటనే చర్చలకు పిలవాలని ఈ దిశగా కదులుతూ తీర్పు యిచ్చిన కోర్టును, రాజ్యాంగాన్ని గౌరవించాలని ఆయన సూచించారు.

అదే సమయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ వి తాటాకు చప్పుళ్లని ఆయన పేర్కొన్నారు.

‘ఆర్టీసీ కార్మికులకు వారి కుటుంబాలకు విజ్ఞప్తి చేస్తున్నాం… ఈ తాటాకు చప్పుళ్ళకు బెదరొద్దు, ఆవేదన చెందొద్దు, అఘాయిత్యాలకు పాల్పడొద్దు. విపక్షాలు అన్నీ మీతో ఉన్నాయి, దేశవ్యాప్త ప్రజాసంఘాలు, యూనియన్లు మీతో ఉన్నాయి. పోరాడుదాం. హక్కుల్ని సాధించుకుందాం,’ అని ఆయన సమ్మెలో ఉన్న కార్మికులకు పిలుపునిచ్చారు.

* ఆర్టీసీ నష్టాల సాకుతో ప్రైవేట్ చేయబూనుకోవడం నడువదు. ఈ ధోరణి మానుకోకపోతే ఆయనే నేటి ప్రెస్ మీట్ లో చెప్పినట్టు ప్రజలే ముఖ్యమంత్రిని తీసేస్తరని ఆయన హెచ్చరిక కూడా చేశారు.

కోదండ రామ్ ఇంకా ఏమన్నరంటే…

హుజూర్ నగర్ ఎన్నికల ఫలితాల అనంతరం కెసిఆర్ విలేకరులతో మాట్లాడుతూ ఆర్టీసి పనయిపోయిందని, మూసేస్తామని చెప్పడం బెదిరింపు చర్య.

*ఆర్టీసీ కార్మికుల సమ్మె గురించి జర్నలిస్టులు అడిగిన చాలా ప్రశ్నలకు దబాయింపుకు పాల్పడ్డారు కానీ హేతుబద్దమైన సమాధానం లేదు ముఖ్యమంత్రి దగ్గర.

* ఆదేశిక సూత్రాల ప్రకారం ప్రజలకు మెరుగైన జీవనం ఇవ్వాలి. దానికి ప్రభుత్వం బాధ్యత పడాలి అని మొన్న హైకోర్టు పధ్నాలుగు పేజీల ఆర్డర్ కాపీలో స్పష్టంగా చెప్పింది. మనది సోషలిస్టు దేశమని, ప్రజలందరూ గౌరవంగా బతికే పరిస్థితులు ఉండాలని కోర్టు స్పష్టం చేసింది.

* నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ కూడా స్పష్గంగా అన్నరు – పేదరిక నిర్మూలనలో ప్రజా రవాణా చాలా ప్రాముఖ్యం కలిగినది అని. పేద ప్రజల విద్య, వైద్య, ఉద్యోగ, రవాణా, ఆర్ధిక అవసరాలను తీర్చే ఆర్టీసీని లాభం-నష్టం భాషలో, పరిభాషలో చూడొద్దు.

* కార్మికులు సకలజనుల సమ్మె విజయవంతం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించారు. ఇపుడున్న గుర్తింపు సంఘం టీ.ఎం.యూ కూడా సమ్మెలో ఉన్నది. నాడు వీరే రాష్ట్రాని సాధించడం ద్వారా కేసీఆర్ ను ముఖ్యమంత్రి చేసిన్రు. అవసరమైనపుడు కార్మికులను వాడుకుని ఇపుడు తీసిపారేయడం అన్యాయం.

* నష్టాలకు కార్మికులు కారణం అనడం దుర్మార్గం. టికెట్ల రేట్లను ప్రభుత్వం నియంత్రించినంత కాలం నష్టాలను ప్రభుత్వమే భరించాలి. నష్టాల విషయంలో ఆర్టీసిపై బాధ్యత పెట్టి, ప్రైవేటైజ్ చేయడంలో మాత్రం కేబినేట్ కూడా అవసరం లేదు, నేను ఒక్క సంతకంతో ప్రైవేట్ చేసేస్తా అనడం దురహంకారం, రాజ్యంగ విరుద్ధం, అప్రజాస్వామికం.* కార్మికులు మంచోళ్ళు కానీ యూనియన్లు చెడ్డవి అనడం హాస్యాస్పదం. కార్మికులు తయారు చేసుకున్నదే యూనియన్. వారి గొంతుక, వారి హక్కు అయిన సంఘాలను అప్రతిష్టపాలు చేయడం దుర్మార్గం.

* ఆర్టీసీ ఆర్ధిక పరిస్థితిపై ప్రభుత్వం వెంటనే ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి.