‘జగనన్న వసతి దీవెన’ ప్రారంభం, జగనన్న వసతి దీవెన అంటే…

విజయనగరంలో ఈ రోజు  ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి  ‘జగనన్న వసతి దీవెన’ పథకం ప్రారంభించారు.
’జగనన్న వసతి దీవెన‘ పథకంఅంటేఏమిటి?
ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఆపై కోర్సులు అభ్యసించే విద్యార్థులకు మంచివసతి ఉండాలని భోజనం, వసతి కింద ఈ పథకంలో ఏటా రూ.20 వేల వరకు ఆర్థిక సహాయం చేస్తారు. ఐటిఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ ఆపై కోర్సులు అభ్యసించే విద్యార్థులకు రూ.20 వేల ఆర్థిక సహాయం చేయనున్నారు.
ఈ పథకం కింద జనవరి, ఫిబ్రవరిలో మొదటి వాయిదా కింద రూ.10 వేలు, జూలై, ఆగస్టులో మరో రూ.10 వేలు డిగ్రీ, ఆ పై కోర్సులు అభ్యసించే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తారు. వీరే కాకుండా ఐటిఐ విద్యార్థులకు రెండు విడతల్లో రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రెండు విడతల్లో రూ.15 వేలు ఇస్తారు. ఒక కుటుంబంలో ఎంత మంది పిల్లలు చదివినా, ప్రతి ఒక్కరికీ ఈ పథకం వర్తిస్తుంది. ఇస్తారు. 11.87,904  మంది పిల్లలకు ఒక బటన్‌ నొక్కగానే, ఆయా మొత్తాల్లో సగం ఆ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా రూ.1100 కోట్లకు పైగా జమ అవుతాయి.
’జగనన్న వసతి దీవెనష‘ విద్యార్థులు
చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 1,31,899 మంది, అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 57,270 మంది విద్యార్థులు ఇప్పుడు ‘జగనన్న వసతి దీవెన’ ద్వారా లబ్ధి పొందుతారు. జిల్లాల వారీగా చూస్తే.. విజయనగరంలో 59,688, విశాఖలో 1,05,709, తూర్పు గోదావరిలో 1,23,938, పశ్చిమ గోదావరిలో 86,816, కృష్ణాలో 1,19,197, గుంటూరులో 1,19,618, ప్రకాశంలో 70,128, నెల్లూరులో 67,541, అనంతపురంలో 85,041, వైయస్సార్‌ కడపలో 78,595, కర్నూలులో 82,464 మంది విద్యార్థులు ‘జగనన్న వసతి దీవెన’ పథకంలో లబ్ధిదారులుగా ఉన్నారు.
పథకాలు–వ్యయం
వసతి దీవెన పథకం కోసం ఏటా రూ.2300 కోట్లు ఖర్చు చేస్తుండగా, విద్యా దీవెన పథకంలో ఏటా మరో రూ.3700 ఖర్చు చేయబోతున్నారు. ఈ రెండు పథకాల ద్వారా దాదాపు రూ.6 వేల కోట్లు పిల్లల కోసం ఖర్చు చేస్తున్నారు.
ఈ పథకం ప్రారంభిస్తూ ముఖ్యమంత్రి చేసిన ప్రసంగం విశేషాలు:
చదువుల దీపాలు వెలిగిస్తేనే ఈ తరంతో పాటు, భావి తరాల తలరాతలు మారుతాయని ముఖ్యమంత్రి  వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లైనా పేద కుటుంబంలో ఉన్న వారు పేదరికం దాటి ముందుకు రాలేదని, ఈ పరిస్థితి మారాలని, పేద కుటుంబాల పిల్లలు కూడా గొప్ప చదువులు చదవాలని ఆయన ఆకాంక్షించారు. అందుకే ఆ దిశలోనే అడుగులు వేస్తూ, దేశంలో ఎక్కడా లేని విధంగా చదువుల విప్లవానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇవాళ చదువుకుంటున్న పిల్లలు ప్రపంచంతో పోటీ పడాల్సి ఉందని, దాన్ని గుర్తించే ఈ ప్రభుత్వం పలు పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తుంటే, రోజూ కొందరు విమర్శలు గుప్పిస్తున్నారని పేర్కొన్నారు.
రాష్ట్రం నుంచి పరిశ్రమలు పోవాలని కోరుకుంటూ డబ్బులు ఇచ్చి మరీ పత్రికల్లో రాయిస్తున్నారని, దుష్ప్రచారం చేస్తున్నారని అటువంటి వారిని ఏమనాలో అందరూ ఆలోచించాలని సీఎం కోరారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు సమన్యాయం చేయడానికి వీల్లేదని, దాడులు చేస్తున్న మూకలను ఏమనాలి అని ఒక్కసారి ఆలోచన చేయాలని, తప్పుడు రాతలు రాస్తున్న ఈ పత్రికలను, తప్పుడు మాటలు చూపిస్తున్న ఈ ఛానళ్లను ఏమనాలో ఒక్కసారి ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఇవాళ మనం రాక్షసులతో యుద్ధం చేస్తున్నామని అన్నారు. ఏ తప్పూ చేయకపోయినా కూడా, ఏదేదో జరిగి పోతున్నట్లుగా విపరీతమైన రాతలతో పాటు, విపరీతంగా చూపిస్తున్న టీవీ ఛానళ్లు ఉన్నాయన్న ముఖ్యమంత్రి తాము యుద్ధం చేస్తా ఉన్నది ఒక్క ప్రతిపక్షంతోనే కాకుండా, ఉన్మాదులతో యుద్ధం చేస్తున్నామని చెప్పారు.
సుదీర్ఘ పాదయాత్రలో నిరుపేద విద్యార్థుల, వారి తల్లిదండ్రుల కష్టాలు స్వయంగా చూసి, పేదరికం వల్ల ఏ ఒక్క విద్యార్థి కూడా ఉన్నత విద్యకు దూరం కాకూడదన్న లక్ష్యంతో చేపట్టిన ‘జగనన్న వసతి దీవెన’ పథకాన్ని చేపట్టామని అన్నారు.
రాష్ట్రంలో ఇప్పటికీ 33 శాతం నిరక్షరాస్యులున్నారని అంటే జాతీయ స్థాయి కంటే దిగువన మనం ఉన్నామని జగన్ గుర్తు చేశారు. అదే విధంగా 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉన్న పిల్లల్లో ఇంటర్‌ తర్వాత కళాశాలల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్యకు సంబంధించిన ‘గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో’ (జీఈఆర్‌) కూడా చాలా తక్కువగా ఉందని తెలిపారు.
‘మనం బ్రిక్స్‌ దేశాలతో పోల్చుకుంటాం. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా. ఆయా దేశాలతో పోలిస్తే.. రష్యాలో జీఈఆర్‌ 81 శాతం, బ్రెజిల్, చైనాలో 50 శాతం ఉంటే, మన దగ్గర మాత్రం అది కేవలం 23 శాతం మాత్రమే. అంటే నూటికి 77 మంది పిల్లలు ఇంటర్‌ తర్వాత కళాశాలలకు వెళ్లడం లేదు’ అని ముఖ్యమంత్రి వివరించారు.
చదువుల విప్లవం
ఈ పరిస్థితుల్లో మన పిల్లలు ఏ రకంగా పేదరికం నుంచి బయటకు వస్తారు? ఆ కుటుంబాలు ఎలా బాగు పడతాయన్న సీఎం, ఈ పరిస్థితి మారాలని, ఆ పిల్లలు కూడా గొప్ప చదువులు చదవాలని స్పష్టం చేశారు. అందుకే ఆ దిశలోనే అడుగులు వేస్తూ, దేశంలో ఎక్కడా లేని విధంగా చదువుల విప్లవానికి శ్రీకారం చుట్టామని వెల్లడించారు.
అందులో భాగంగా ఇవాళ ఇక్కడి (విజయనగరం) నుంచి వసతి దీవెన ప్రారంభిస్తున్నందుకు గర్వపడుతున్నానని చెప్పారు. వార్షిక ఆదాయం రూ.2.5 లక్షల కంటే తక్కువ ఉన్న పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఈ పథకంలో రూ.20 వేల వరకు భోజనం, వసతి కోసం ఇస్తామని ప్రకటించారు.
రాక్షసులు, ఉన్మాదులతో యుద్ధం
‘ఇంటింటా చదువులు, అందరికీ ఆరోగ్యం, అన్ని ప్రాంతాలకు నీళ్లు, రైతన్నలకు ఆనందం, ఉద్యోగాలు–ఉపాధి.. ఈ లక్ష్యాల సాధనే లక్ష్యంగా ప్రభుత్వాన్ని గొప్పగా నడిపేట్టుగా మీ బిడ్డను ఆశీర్వదించమని కోరుతా ఉన్నాను. దేవుడి దయ కూడా చాలా కావాలి. ఎందుకంటే రాక్షసులతో యుద్ధం చేస్తా ఉన్నాం. ఏ తప్పూ చేయకపోయినా కూడా, ఏదేదో జరిగి పోతున్నట్లుగా విపరీతమైన రాతలు. విపరీతంగా చూపిస్తున్న టీవీ ఛానళ్లు. యుద్ధం చేస్తా ఉన్నది ఒక్క ప్రతిపక్షంతోనే కాదు. ఒక ఉన్మాదులతో యుద్ధం చేస్తా ఉన్నాం’ అని సీఎం పేర్కొన్నారు.