సర్ , ప్లీజ్ కౌన్సిల్ రద్దు చేయండి: మోది కి జగన్ విజ్ఞప్తి

 న్యూఢిల్లీ:
ఆంధ్రప్రదేశ్  శాసనమండలి రద్దు చేసేందుకు సహకరించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి  విజ్ఞప్తి చేశారు.  ఈ రోజు ఢిల్లీలో ప్రధాని నివాసంలో జగన్ ప్రధాని మోదీతో సుమారు ఒకటి న్నర గంట సేపు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయన శాసన మండలిని ఎందుకు రద్దు చేయవలసి వచ్చిందో ప్రధానికి వివరించారు.
గడచిన రెండు నెలల పరిణామాలను చూస్తే శాసనమండలి ప్రజల మంచి కోసం, మెరుగైన పాలన కోసం ప్రభుత్వానికి సలహాలివ్వాల్సింది పోయి అడ్డుపడే ధోరణితో వ్యవహరిస్తోందని ఆయన ప్రధానికి వివరించారు.  ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం చేసిన బిల్లులను అడ్డుకునే ప్రయత్నం చేస్తోందన్నారు.  ఈ నేపథ్యంలో మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, శాసనసభ మండలిని రద్దు చేస్తూ రికమెండ్‌ చేసిందని ఆయన చెప్పారు.
తదనంతర చర్యలకోసం కేంద్ర న్యాయశాఖను ఆదేశించాలని ఆయన ప్రధానికి విజ్ఞప్తి చేశారు.
 ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానికి  ముఖ్యమంత్రి ఒక వినతి పత్రం కూడా సమర్పించారు.
• ఉగాది రోజున రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న 25 లక్షల ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ముఖ్యమంత్రి ప్రధానిని ఆహ్వనించారు.  నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా దీన్ని చేపట్టామని ఆయన తెలిపారు.
• తూర్పుగోదావరి జిల్లాలో 800 ఎకరాల ఉప్పు భూములను ఇళ్ల స్ధలాల కోసం ఇవ్వాల్సిందిగా  కేంద్రమంత్రిత్వశాఖను ఆదేశించాల్సిందిగా కోరిన సీఎం
• 2021 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నామని వినతిపత్రంలో వెల్లడించిన సీఎం
• ముంపు ప్రాంతాల్లో ఉన్న అన్ని కుటుంబాలను తరలించడానికి సహాయ, పునరావాస పనులను అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం చేయాల్సి ఉందన్న ముఖ్యమంత్రి
• పోలవరం ప్రాజెక్టు అంచనాలు రూ.55,549 కోట్లకు చేరిందని, ఇందులో ఆర్‌ అండ్‌ ఆర్‌ కోసమే రూ.33010 కోట్ల రూపాయలు అవసరం అవుతుందని తెలిపిన సీఎం
• కేంద్ర జలవనరులశాఖలోని సాంకేతిక సలహా కమిటీ పోలవరం అంచనాలను రూ.55,549 కోట్లగా ఫిబ్రవరి 2019న అంచనాలు వేసిన అంశాన్ని ప్రధానికి తెలిపిన సీఎం
• దీనికి పరిపాలనా పరమైన అనుమతులు ఇంకా రాలేదని, ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని వీలైనంత త్వరగా వీటికి ఆమోదం తెలపగలరని ముఖ్యమంత్రి వినతి
• పోలవరం ప్రాజెక్టుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తంలో ఇంకా రూ.3320 కోట్ల రూపాయలు రావాల్సి ఉందని,
• ఈ మొత్తాన్ని వెంటనే విడుదల చేయాల్సిందిగా కేంద్ర జలవనరుల శాఖను ఆదేశించాలని విజ్ఞప్తి చేసిన ముఖ్యమంత్రి.
ప్రత్యేక హోదా
• అభివృద్ధి పరంగా అసమతుల్యతను నివారించడానికి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరిన సీఎం
• ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఆర్ధిక సంఘం సిఫార్సులతో అవసరం లేదని 15వ ఆర్ధిక సంఘం చెప్పిన విషయాన్ని వినతిపత్రంలో పేర్కొన్న ముఖ్యమంత్రి
• ప్రత్యేక హోదా అన్నది కేంద్ర ప్రభుత్వం పరిధిలోనిదని, తగిన నిర్ణయాన్ని కేంద్రప్రభుత్వమే తీసుకోవచ్చంటూ 15వ ఆర్థిక సంఘం స్పష్టంచేసిన అంశాన్ని ప్రధానికి నివేదించిన సీఎం
• దీన్ని పరిగణలోకి తీసుకుని ప్రత్యేక హోదాను రాష్ట్రానికి ఇవ్వాలని కోరిన సీఎం
రెవెన్యూలోటు
• ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం ప్రకారం రెవెన్యూలోటును భర్తీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని, రూ.22948.76 కోట్లు రెవెన్యూ లోటుగా కాగ్‌ అంచనా వేసిందని,
• ఇంకా రూ.18969.26 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉందని, వీలైనంత త్వరగా ఈ మొత్తాన్ని ఇప్పించగలరంటూ ప్రధానిని కోరిన సీఎం.
గ్రాంట్లు విడుదల
• ఈ ఆర్ధిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.10,610 కోట్లు మాత్రమే వచ్చాయని, గత ప్రభుత్వంలో ఏ యేడాదితో పోల్చినా ఈ మొత్తం తక్కువే అని ప్రధాని ముందు ఉంచిన సీఎం.
• పెండింగ్‌లో ఉన్న గ్రాంట్స్‌ను విడుదల చేయాల్సిందిగా కేంద్ర ఆర్ధికశాఖను ఆదేశించాలని విజ్ఞప్తి.
కడప స్టీల్‌ ప్లాంటు
• కడప స్టీల్‌ ప్లాంటు నిర్మాణానికి సత్వర చర్యలు తీసుకోవాలని, రామాయపట్నం పోర్టు నిర్మాణానికి నిధులివ్వాలని వినతి
• కృష్ణా– గోదావరి నదుల అనుసంధానానికి నిధులు విడుదల చేయాలని ప్రధానిని కోరిన సీఎం
• రాజధాని నిర్మాణానికి రూ.2500 కోట్లు కేటాయిస్తే… కేవలం రూ.1000 కోట్లు మాత్రమే విడుదల చేశారని, మిగిలిన నిధులునూ వెంటనే విడుదలయ్యేలా చూడాలని కోరిన సీఎం.
వెనుకబడిన జిల్లాలకు అభివృద్ధి నిధులు
• గడిచిన ఆరేళ్లలో 7 జిల్లాలకు కేవలం రూ.1050 కోట్లు మాత్రమే ఇచ్చారని, గడిచిన మూడేళ్ల నుంచి కేటాయింపులు కూడా లేవని,
• రూ.2,100 కోట్లకు గాను కేవలం రూ.1050 కోట్లు మాత్రమే విడుదల చేశారని, వెనుకబడిన జిల్లాలకు బుందేల్‌ఖండ్, కలహండి నమూనాలో నిధులివ్వాలని గట్టిగా కోరిన సీఎం.
• అక్కడ ఒక వ్యక్తికి తలసరి రూ.4000 ఇస్తే, ఇక్కడ రూ.400 మాత్రమే ఇస్తున్నారని ప్రధానికి తెలిపిన సీఎం.
• హైకోర్టును కర్నూలుకు తరలించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరిన సీఎం.
• ఈమేరకు కేంద్ర న్యాయశాఖకు తగిన ఆదేశాలు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి.
• రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న అభివృద్ధి, అసమతుల్యతను తొలగించి సమగ్రాభివృద్ధి కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, దీనికోసం పరిపాలన వికేంద్రీకరణ, రాజధాని కార్యకలాపాల వికేంద్రీకరణ కోసం ప్రణాళికలు రూపొందించుకున్నామని ప్రధానికి వెల్లడి.
• ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా విశాఖపట్నం, జ్యుడీషియల్‌ క్యాపిటల్‌గా కర్నూలు, లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌ గా అమరావతిగా ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ప్రధాని వెల్లడి.
• దీనికోసం ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్‌ వికేంద్రీకరణ మరియు అన్ని ప్రాంతాలకు సమగ్రాభివృద్ధి చట్టం–2020 కి అసెంబ్లీ ఆమోదముద్ర వేసిందని తెలిపిన సీఎం.
• ఆంధ్రప్రదేశ్‌ దిశ చట్టం –2019కు ఆమోదం తెలపాల్సిందిగా విజ్ఞప్తి
• మహిళలు, చిన్నారుల రక్షణ కోసం తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్‌ దిశ చట్టం–2019 పై అనేకమంది ప్రశంసలు తెలిపిన అంశాన్ని ప్రధానికి వివరించిన సీఎం.
• మహిళలు, చిన్నారుల రక్షణ కోసం ఉద్దేశించి ఈ చట్టాన్ని ఆమోదించేలా కేంద్ర హోంశాఖకు ఆదేశాలివ్వాలని ప్రధానికి విజ్ఞప్తి.