మనవాళ్లే కాని ఆంధ్రలోకి అనుమతించలేక పోయాం: ముఖ్యమంత్రి జగన్ ఆవేదన

హైదరాబాద్ నుంచి ఆంధ్ర లో తమ తమ వూర్లకు వెళ్లాలనుకుంటున్న చాలామంది యువకులను ఆంధ్రలోకి అనుమతించలేకపోయినందుకు చాలా బాధ గా ఉందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడి అన్నారు.
అందుకే కొన్ని నిర్ణయాలు సరైన సమయంలో తీసుకోకపోతే, అనర్థం జరుగుతుందన్న భయం కూడా ఉంది.  కాబట్టి అందరూ సహకరించాలని అన్నారు.
కోవిడ్‌–19 వైరస్‌ నివారణ, నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్‌ డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి  వైయస్‌ జగన్‌ ప్రసంగించారు.
ఈ ప్రసంగం  ముఖ్యాంశాలు
నిన్న రాత్రి జరిగన కొన్ని ఘటనలు మనసును కలిచి వేశాయి.  మన వాళ్లేఅయినా తెలంగాణ నుంచి తిరిగొస్తునంన వారిని  మనం చిరునవ్వుతో ఆహ్వానించే పరిస్థితి లేదని బాధనిపించింది. కానీ అందరం ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇవాళ అందరం ఇళ్లకే పరిమితం కాకపోతే వ్యాధిని అదుపు చేయలేం.
నిన్న ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోకి వచ్చిన సుమారు 200 మందిని క్వారంటైన్‌లో ఉంచాల్సి వచ్చింది. మానవతాదృక్పథంతో వారిని రాష్ట్రంలోకి అనుమతించినా 14 రోజులు క్వారంటైన్‌లో ఉంచడం అనివార్యమయింది. ఎందుకు? ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవాళ్లనే నేరుగా వారి ఊళ్లకు వెళ్లనిస్తే తీవ్రపరిణామాలుంటాయి. వారి కుటుంబసభ్యులను కష్టాల్లో పడేసినట్లవుతుంది. ఇతర ప్రాంతాల్లో ఉన్న మనవాళ్లకు ప్రభుత్వం కచ్చితంగా అండగా ఉంటుంది.
నిన్న హైదరాబాద్ ప్రైవేటు హాస్టళ్ల నిర్వాహకులు హాస్టళ్లను మూసివేయాల్సి రావడంతో అక్కడ రకరకాల కోచింగ్ తీసుకుంటున్నవారు, ఉద్యోగులు పెద్ద ఎత్తున రోడ్డునపడ్డారు. తన ఆంధ్రలోని సొంతవూర్లకు పోయేందుకు అనుమతించేలా ఎన్ వొసిఇవ్వాలన్ని కొంత మంది గొడవ చేయడంతో సర్టిఫికేట్ ఇచ్చి పంపించారు. అయితే, వీళ్లందరిని ఆంధ్ర సరిహద్దున జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద పోలీసులు నిలిపివేశారు.కొందరిని క్వారంటైన్ కు తరలించినా, చాలమంది దగ్గిర ఎన్ వొసి లేకపోవడం పోలీసులు వారిని ఆపేశారు.దీనితో గందరగోళం నెలకొనింది. చివరకుజగన్ తెలంగాణ ముఖ్యమంత్రితో మాట్లాడి సమస్యకు తాత్కాలికంగా ముగింపు పలికారు. ఈ విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ జరిగిన దానికి ఆవేదన వ్యక్తంచేశారు.

-ఇవాళ కూడా పొందుగుల, దాచేపల్లి, నాగార్జునసాగర్‌ సరిహద్దుల్లో ఇదే పరిస్థితి. ఒకసారి ప్రదేశం మారితే, వారు ఎందరితోనో కాంటాక్ట్‌లోకి వస్తున్నారు వారు ఇంకా ఎంత మందితో కాంటాక్ట్‌లోకి వెళ్తారో తెలియదు
వారిని ట్రేస్‌ చేయడం చాలా కష్టం. ఏప్రిల్‌ 14 వరకు మనం ఎక్కడికీ వెళ్లకుండా, ఇళ్లలోనే ఉంటే, కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ ఈజీగా తెలుస్తుంది
వ్యాధి సోకిన వారిని గుర్తించి వెంటనే ఆస్పత్రికి తరలించవచ్చు.
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారు కానీ, ఇక్కడ కూడా ఒక ఊరి నుంచి మరో ఊరుకు పోవద్దు.

-మూడు వారాల పాటు నియంత్రణ పాటించండి. ఎక్కడి వారు అక్కడే ఉండమని కోరుతున్నాను. మన వాళ్లను మనమే ఆపాల్సి రావడం బాధనిపిస్తోంది. నిన్న కూడా 44 మందిని, మార్కాపూర్, కందుకూరు వద్ద 152 మందిని అనుమతి ఇచ్చాం. వారందరినీ 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచక తప్పదు. ఎందుకంటే వారు వేరే రాష్ట్రం నుంచి వచ్చారు, ఎవరెవరితో కాంటాక్ట్‌లో ఉన్నారో తెలియదు .వారిని మానవతా దృక్పథంతో అనుమతి ఇచ్చినా వారిని 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచక తప్పదు. కాబట్టి పరిస్థితి అర్ధం చేసుకోండి.
తెలంగాణ సీఎం సానుకూల స్పందన
తెలంగాణ సీఎం కేసీఆర్‌ గారితో మాట్లాడాం ఆయన కూడా చాలా పాజిటివ్‌గా స్పందించారు.  ఎవరికి అవసరమైనా కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేస్తే, వెంటనే ప్రభుత్వం స్పందిస్తుంది. కేసీఆర్‌ గారు ఎంతో ఆప్యాయత చూపారు అందరినీ తాను చూసుకుంటానని చెప్పారు. రాష్ట్రంలో ఎన్ని కేసులు?
రాష్ట్రంలో ఇప్పటికి 10 కేసులు పాజిటివ్‌గా తేలాయి, వదిలేస్తే అది ఎంత వరకు పోతుందో తెలియదు. ఈ 10 కేసులు పెరగకుండా ఉండాలంటే అందరూ సమష్టిగా కృషి చేయాలి
విదేశాల నుంచి ఎందరొచ్చారు?
విదేశాల నుంచి ఇక్కడికి వచ్చిన వారిని సర్వే చేసి ట్రాక్‌లో పెట్టడం జరిగింది.  మొత్తం 27,819 మంది రాగా, వారిని నిఘాలో పెట్టాం.
వారు ఎందరితో కాంటాక్ట్‌లో ఉన్నారో.. వారు ఇంకా ఎవరెవరితో కాంటాక్ట్‌లో ఉన్నారో ఆలోచించాలి.  ఇంటింటికి తిరిగి సర్వే ఎప్పటికప్పుడు రక్షణ చర్యలు చేయడం వల్లనే కేవలం 10 కేసులకే పరిమితం కాగలిగాం.
అన్ని చోట్ల వైద్య సదుపాయాలు
– విశాఖ, నెల్లూరు, విజయవాడ, తిరుపతి.. 4 చోట్ల క్రిటికల్‌ కేర్‌ ఆస్పత్రుల ఏర్పాటు చేశాం.  ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఐసీయూ బెడ్స్, వెంటిలేటర్లతో పాటు, అదనపు బెడ్లు అందుబాటులో ఉన్నాయి.– ప్రతి జిల్లాలో 200 బెడ్లతో చికిత్స కేంద్రాలు (క్వారంటైన్‌ సెంటర్లు) ఏర్పాటు.  అలాగే ప్రతి నియోజకవర్గంలో 100 పడకలతో క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశాం. ప్రైవేటు సెక్టార్‌లో కూడా వెంటిలేటర్లు సిద్ధంగా ఉన్నాయి. ఈ విధంగా అన్ని విధాలుగా సిద్థంగా ఉన్నాం.
1902 హెల్ప్‌లైన్‌
– ఎవరికి ఏ రకమైన అవసరం ఉన్నా, ఇబ్బంది వచ్చినా కాల్‌ చేయండి. సీనియర్‌ ఐఏఎస్‌ కృష్ణబాబుతో పాటు, మరో 10 మంది  ఉన్నతాధికారులను ఏర్పాటు చేశాం.  ఇంకా ఆరోగ్యపరమైన సమస్యలకు 104 నెంబర్‌ కూడా అందుబాటులో ఉంది. సరుకుల రవాణా వాహనాలకు అనుమతి ఇచ్చాం. నిత్యావసరాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి నిల్వ చేసుకోవాల్సిన అవసరం లేదు. రైతు బజార్లను విస్తరిస్తున్నాం. ప్రజల సంఖ్య, వారి అవసరాలు గుర్తించి కేవలం 2 నుంచి 3 కి.మీ పరిధిలో రైతు బజార్లతో పాటు, నిత్యావసరాలు అందుబాటులో ఉంటాయి. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అన్నీ తెరిచి ఉంటాయి. కాబట్టి అవసరమైనవి తీసుకుని, ఆ తర్వాత ఇళ్లలోనే ఉండండి.