ఐఎఎస్ అధికారి రమామణి మృతి , ఐఎఎస్ అధికారుల సంఘం సంతాపం

 సేవాభావంతో పనిచేసి ప్రజల ప్రశంసలందుకున్న సీనియర్ ఐఎఎస్ అధికారి టికె రమామణి (56) (2010) అకస్మిక మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ఐఎఎస్ అధికారుల సంఘం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.
సంఘం ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ఈ మేరకు ప్రకటన విడుదల చేస్తూ ఆదర్శభావాలు కలిగిన ఒక ఐఎఎస్ అధికారిణిని కోల్పోవటం బాధాకరమని, విభిన్న శాఖలలో తనదైన శైలిలో ఆమె ప్రజలకు సేవలు అందించారన్నారు. రమామణి భర్త మురళీ మోహన్ ఎపి స్టెప్ లో మేనేజర్ గా పనిచేసి పదవీ విరమణ పొందారు.
ఇరువురు కుమారులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. రాష్ట్ర సర్వీసుల నుండి పదోన్నతిపై 2010 లో ఐఎఎస్ కు ఎంపికైన టికె రమామణి తొలుత అనంతపురం సంయిక్త కలెక్టర్ గా విధులు నిర్వహించారు.
1964 అక్టోబరు 18న జన్మించిన రమామణి ఇటీవలి వరకు వాణిజ్య పన్నుల విభాగంలో కమీషనర్ కు కార్యదర్శిగా వ్యవహరించారు.
గుంటూరు పండరి పురం లో బంధువుల ఇంటికి గత రాత్రి వచ్చిన ఆమె, స్వల్ప అనారోగ్యంతో గురువారం గుంటూరు సర్వ జన ఆసుపత్రికి వచ్చారు. వైద్యం అందిస్తుండగా రామా మణి మృతి చెందారు.
ఈ నేపధ్యంలో ప్రవీణ్ కుమార్, సునీత, ప్రవీణ్ ప్రకాష్ తో పాటు, గుంటూరు జిల్లా కలెక్టర్ శ్యాముల్ ఆనంద్ కుమార్, జాయింట్ కలెక్టర్లు ప్రశాంతి, దినేష్ కుమార్, మరియి ప్రద్యుమ్న, పియూష్ కుమార్, విజయ తదితరులు రమామణి బౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. రమా మణి భర్త మురళీమోహన్ ని, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు.
రామామణి తండ్రి టికెఆర్ శర్మ స్వాతంత్ర్య సమరయోధులు. శాసనసభ్యులుగా వ్యవహరించారని ఈ సందర్భంగా ఐఎఎస్ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ప్రస్తుతించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నపుడు ఆమె హయత్ నగర్,శేరిలింగం పల్లి  తాశీల్దార్ గా పనిచేశారు.ప్రభుత్వం భూముల అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు చాలా కృషి చేశారు. ఆమె తొలినుంచి పేదల పక్షపాతి. పేదలకు సాయం చేసేందుకు ఎపుడూ కృషి చేశారు.